లోక్‌సభ స్పీకర్: ఓం బిర్లా vs కె సురేష్

పార్లమెంట్ స్పీకర్ పదవికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ పద్ధతి లేదు. ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. అయితే ఈ సారి ఎందుకు భిన్నంగా జరుగుతోంది?

Update: 2024-06-25 10:02 GMT

పార్లమెంట్ స్పీకర్ ఎన్నికకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీఏ తన అభ్యర్థిగా బిజెపి ఎంపి ఓం బిర్లాను నామినేట్ చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని సురేష్‌కు కేటాయించాలని ఇండియా కూటమి పట్టుబట్టింది. అందుకు ఎన్డీఏ నిరాకరించడంతో కాంగ్రెస్ లీడర్ కెసి వేణుగోపాల్, డిఎంకె టిఆర్ బాలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నాడూ ఇలాంటి పోటీ లేదు. చివరిసారిగా 1946లో ఈ తరహా ఎన్నిక జరిగింది.

ఎవరీ ఓం బిర్లా..

రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి గెలిచిన బిజెపి ఎంపి 17 సంవత్సరాల వయస్సులో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1979లో కోటా గుమన్‌పురాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

BJP సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో ఉన్న అనుబంధం కారణంగా 2014 నుండి కోట నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు కోట సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

RSS కుటుంబం నుంచి వచ్చిన బిర్లా తొలుత BJP యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో పనిచేశాడు. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వెంకయ్య నాయుడు, రాజస్థాన్ బీజేపీ చీఫ్ రాందాస్ అగర్వాల్‌తో బిర్లాకు సాన్నిహిత్యం ఏర్పడింది. సామాన్యుల సమస్యలపై బహిరంగ సభలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా ఎదిగారు. బిజెపి విద్యార్థి విభాగం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యుడిగా ఉన్న బిర్లా.. 1978లో కోటాలో స్థానిక పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తూ.. ముందుకు పోనివ్వకుండా రాజస్థాన్ మంత్రి కారు ముందు అడ్డంగా పడుకున్నాడు.

పార్లమెంటరీ వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేకపోయినా.. ఎంపీగా లోక్‌సభలో మంచి డిబేటర్‌గా రికార్డు ఉంది. దాంతో 2019లో లోక్‌సభ స్పీకర్ పదవికి బిజెపి బిర్లాను ఎంపిక చేసింది. 671 ప్రశ్నలు అడిగిన బిర్లా..118 డిబేట్‌లలో పాల్గొన్నారు.

బిర్లా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైతే.. 1980 నుంచి 1989 వరకు అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన బలరాం ఝాఖర్ రికార్డును సమం చేస్తారు. స్పీకర్‌గా ఐదేళ్లు పనిచేసిన తర్వాత.. 22 ఏళ్లలో లోక్‌సభకు తిరిగి ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా బిర్లానే అవుతారు.

స్పీకర్‌గా పనిచేసిన GMC బాలయోగి 2002లో మరణించారు. అప్పట్లో మనోహర్ జోషి, మీరా కుమార్ ఎన్నికలలో ఓడిపోయారు. సుమిత్రా మహాజన్, సోమనాథ్ ఛటర్జీ పదవీ విరమణ చేశారు.

కె సురేష్ గురించి..

కొడికున్నిల్ సురేష్ ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. అత్యంత సీనియర్ లోక్‌సభ సభ్యులలో ఒకరు. ప్రస్తుతం కేరళలోని మావెలికర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సురేష్.. 2021లో కేరళ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ పదవికి పోటీపడ్డ వారిలో ఒకరు. తర్వాత కేరళ కాంగ్రెస్ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా కూడా పనిచేశారు.

సురేష్ తొలిసారిగా 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆదూర్ నియోజకవర్గం నుంచి 1991, 1996, 1999 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 1998, 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

తన కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని, క్రైస్తవుడని వచ్చిన ఆరోపణలపై కేరళ హైకోర్టు 2010లో ఆయనపై అనర్హత వేటు వేసింది. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది.

ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని రెండో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా కూడా ఉన్నారు.

ఇటీవలి ఎన్నికలలో సిపిఐ నుంచి పోటీచేసిన సిఎ అరుణ్ కుమార్‌ను సురేశ్ 10వేల ఓట్ల తేడాతో ఓడించారు.

Tags:    

Similar News