హర్యానాలో AAP వాష్‌అవుట్‌కు కారణాలివే..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి “అతి విశ్వాసం” కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

Update: 2024-10-08 13:00 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఓటమిపై ఆమ్ ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చుకున్నారు. తమ పార్టీ అతి విశ్వాసమే పరాజయానికి కారణమని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. హర్యానా ఎన్నికలు తమకు గొప్ప పాఠం నేర్పాయని, ఏ ఎన్నికలలోనూ అతి విశ్వాసం పనికిరాదని ఢిల్లీలో AAP మునిసిపల్ కౌన్సిలర్ల సమావేశంలో అన్నారు.

పార్టీ సీఎం అభ్యర్థి ప్రకటించకపోవడంతో ప్రధాన పోటీ బీజేపీ , కాంగ్రెస్‌ మధ్య జరిగిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. హర్యానాలో ఆప్‌కి లభించింది పట్టణ ప్రాంత మద్దతు మాత్రమే. గ్రామీణ ప్రాంతంలో ఆప్‌ను ఆదరించలేదు. కేజ్రీవాల్ సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని ఆయన భార్య సునీత ప్రచారం చేసినా ఓటర్లు కనికరించలేదు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోవడం ఒక కారణం కాగా.. ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించడం మరో కారణం. హర్యానాలో కేజ్రీవాల్ మొదటి రోడ్‌షో ఎన్నికలకు మూడు వారాల ముందు సెప్టెంబర్ 20న నిర్వహించారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తమ ప్రచారాన్ని చాలా ముందుగానే ప్రారంభించారు.

ఆప్ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడదని ప్రచార సందర్భంగా కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే మధ్యాహ్నానికి ఢిల్లీ, పంజాబ్‌లను పాలిస్తున్న ఆప్ కేవలం 1.53 శాతం ఓట్లను మాత్రమే సాధించిందని ఎన్నికల గణాంకాలు వెల్లడించాయి.

హర్యానాలోని 90 స్థానాలకు 2019లో హర్యానాలో ఆప్ 46 స్థానాల్లో పోటీ చేసి, వాటన్నింటిలో ఓడిపోయి, నోటా కంటే తక్కువ ఓట్లను సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన రాష్ట్రంలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

Tags:    

Similar News