
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ (ఫైల్)
'నీ దగ్గర ఏ క్రెడిట్ ఉంది స్వామీ.. చోరీ చేయడానికి'
జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్
నరకాసురుడు లాంటి వ్యక్తి మళ్లీ వస్తే నాశనమే
ల్యాండ్ టైట్లింగ్ లాంటి దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాం
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతే రాజధాని, అభివృద్ధి ఆగదు
స్వచ్ఛాంధ్రలో రూ. 573 కోట్లతో అభివృద్ధి
ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు
నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో గత ఐదేళ్లూ చూశామని వైఎస్. జగన్ పేరు ప్రస్తావించకుండానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పరిపాలనతో రాక్షసత్వాన్ని ప్రదర్శించారని నిందించారు. మీ దగ్గర ఏమి క్రెడిట్ ఉంది? మేము చోరీ చేయడానికి! అని వైఎస్. జగన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ,
"మంచి-చెడుకి వ్యత్యాసం ఏంటో ప్రజలు తెలుసుకోవాలి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు సూచించారు. చెడ్డ వ్యక్తులను (వైఎస్. జగన్ పేరు ప్రస్తావించకుండానే) ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని అన్నారు.
చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్ధాల సేకరణకు స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లతో పాటు మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం ప్రజా వేదిక సభలో ప్రసంగించారు.
రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి
రాష్ట్రం గత ఐదేళ్లలో రాక్షస పాలనతో అతలాకుతలమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చెప్పినా అమరావతి అభివృద్ధి ఆగదు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఆయన బిగ్గరగా అరిచి చెప్పారు.
"ఐదేళ్ల పాలనలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాం. 94 శాతం స్టైక్ రేటుతో విజయం సాధించాం" అని వ్యాఖ్యానించారు వైసీపీ పాలనలో అమరావతిపై మూడు ముక్కలాట ఆడారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిప్పులు చెరిగారు. అమరావతిని శ్మశానం, ఎడారిగా అభివర్ణించారనీ, ఇప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ రాజధానిపై విషం చిమ్ముతున్నాని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాపై నమ్మకంతో 29 వేల మంది రైతులు 33 వేలు ఎకరాల భూమి రాజధాని కోసం ఇచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదు. ఆనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాను. నేడు అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని తయారుచేస్తామని ప్రకటించారు.
"18 నెలల్లో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం. దేశంలో 25 శాతం పెట్టుబడులు మన రాష్ట్రానికే రావడం ఎన్డీఏ ప్రభుత్వ సమర్థత పాలనకు నిదర్శనం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
భూమికి భద్రత కల్పించాం
భూమి అంటే ప్రజల సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అలాంటి భూమికి గత ప్రభుత్వంలో భద్రత లేకుండా చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో, 22 ఏ అక్రమాలతో ప్రజలతో వికృత క్రీడ ఆడారంటూ వైసీపీ పాలనలో సాగిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై ఫొటోలు వేసుకోవడం కోసం రూ. 700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ సమస్యలు పరిష్కరించాం. రాజ ముద్రతో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేలా పట్టా దారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం అని వివరించారు.
విద్యుత్ చార్జీలు భారం లేకుండా
వైసీపీ ప్రభుత్వంలో రూ.32 వేల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ కాలంలో రూ.1.20 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని ఆయన మళ్లీ గుర్తు చేశారు. రూ.4,600 కోట్ల ట్రూప్ అఫ్ ఛార్జీలు వేస్తే వాటిని ప్రభుత్వమే భరిస్తోందని ఆయన వివరించారు.
"భవిష్యత్ లో కరెంట్ ఛార్జీలు పెంచమని హామీ ఇస్తున్నా. యూనిట్ కి 39 పైసలు ఖర్చు తగ్గించాం. మూడేళ్లలో కరెంటు కొనుగోలు ధరను కూడా గణనీయంగా తగ్గిస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
"గత ప్రభుత్వంలో ఇరిగేషన్ వ్యవస్థను సర్వ నాశనం చేసింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. సీమను రాళ్ల సీమగా మార్చారు. గత ప్రభుత్వంలో కేంద్ర నిధులను పక్కదారి పట్టించారు. కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారు. జల జీవన్ మిషన్ లో రూ. లక్ష కోట్లు వాడుకునే అవకాశం ఉన్నా అసమర్థతతో వదిలేశారు" అని వైసీపీ ప్రభుత్వంలో వినానం సృష్టించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
"రాష్ట్రమంతా గంజాయిని ప్రోత్సహించి యువత భవిష్యత్ ను నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈగల్ వ్యవస్థతో గంజాయిపై ఉక్కుపాదం మోపాం. గత పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బకాయిలను కూటమి అధికారంలోకి రాగానే విడతల వారీగా చెల్లించాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన వారిని ఏం చేయాలి?" అని ప్రజలను ప్రశ్నించారు. నీటిపారుదలకు కీలకమైన రాష్ట్రానికి వరప్రసాదంగా నిలిచే పోలవరం డయాఫ్రమ్ వాల్ గోదావరిలో కలిపేశారన్నారు. ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తిచేస్తామని ప్రకటించారు.
"గోదావరి జలాలు సీమకు వస్తే నీటి సమస్య ఉండదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం చెడు వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుంది" అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ప్రస్తావించారు. నేను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి త్వరలో 50 ఏళ్లు పూర్తవుతోంది. క్రమశిక్షణతో, విలువలతో కూడిన రాజకీయమే చేస్తున్నా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
కుప్పం తరహాలో నగరి అభివృద్ధి
నగరి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు.
"నా మిత్రుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు నిత్యం నగరి ప్రజల కోసం తపించేవారు. నగరిలో ఆ ఐదేళ్లూ అభివృద్ధి అంటే తెలియదు. ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి" అని సంతోషం వ్యక్తం చేశారు.
"2029 ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లకుండా పరిశ్రమలు తీసుకొస్తాం. కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ప్రజావేదిక సభలో పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు వచ్చిన మార్గదర్శులను సీఎం సన్మానించారు. పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు గాలి భాను ప్రకాశ్ నాయుడు, ఎంపీ డి.ప్రసాదరావు తదితర నేతలు హాజరయ్యారు.
Next Story

