
Float festival | నీటిపై విహరిస్తూ కనువిందు చేసిన గోవిందుడు..
తిరుపతి పుష్కరణిిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా విహరించిన శ్రీగోవిందరాజస్వామి
తిరుపతి, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలు సాగుతూనే ఉంటాయి. అందులో భాగంగా తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామి తెప్పోత్సవాలు కనువిందుగా సాగుతున్నాయి. శనివారం రాత్రి ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు పుష్కరిణిలో తెప్పలపై ఏడు చుట్లు విహరిస్తూ దర్శనం ఇచ్చారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉదయం 10.30 నుంచి ర 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
కనువిందుగా..
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో తెప్పోత్సవం కనువిందుగా సాగింది.
అంతకుముందు సర్వాలంకార భూషితుడైన శ్రీగోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకుని వచ్చారు. పుష్కరిణి వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న తెప్పలపైకి ఉభయ దేవేరులతో ఉన్న శ్రీగోవిందుడి పల్లకిని చేర్చారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఎఫ్ఏఅండ్ సీఏవో ఓ బాలాజీ, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, శ్రీ ఎ. నరసింహ మూర్తి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, వీజీవో శ్రీ సురేంద్ర, ఏఈఓ నారాయణ చౌదరి, డీఈ రవిశంకర్ రెడ్డి, అర్చకులు , సిబ్బంది పాల్గొన్నారు.

