తిరుమల: ఆలయంలో పది టన్నుల పుష్పాలతో  అలంకరణ
x
పుష్పశోభితమైన తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆకట్టుకుంటున్న రామాయణ ఘట్టాలు..

తిరుమల: ఆలయంలో పది టన్నుల పుష్పాలతో అలంకరణ

శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం.. రూపాయి హారతి సమర్పించిన టీటీడీ అర్చకులు.


తిరుమల శ్రీవారి క్షేత్రంలో తెలుగు నూతన సంవత్సర శ్రీపరాభవ నామ ఉగాది వేడుక శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉగాది ఆస్థానం అనంతరం ఆస్థాన సిద్ధాంతి శ్రీవారికి పంచాగం వినిపించారు. వేదపండితులు రూపాయ హారతి సమర్పించారు. ఈ రెండు అంశాల వెనుక ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉంది.శ్రీవెంకటేశ్వరస్వామివారి ఆలయం, వెలుపల 10 టన్నుల దేశ, విదేశీ పుష్పాలు పత్రాలతో అలంకరించారు.

టిటిడి వేద పండితులు, ఆలయ అర్చకులు, జీయర్ స్వాముల పర్యవేక్షణలో ఉగాది ఆస్థానం (శ్రీవారి కొలువు) నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంవత్సరం మొత్తం నిర్వహించే ఉత్సవాలు ఊరేగింపులు ఉగాది నుంచి ప్రారంభాన్ని లెక్కగా పరిగణిస్తారు. అందుకే ఉగాది ఆస్థానానికి ప్రత్యేక విశిష్టత ఉంది.


తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవతో ఉగాది పండుగ మొదలైంది. బంగారువాకిలి వద్ద గరుడాళ్వార్ కు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి వేంచేపు చేశారు. దక్షిణ దిశలో శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారిని ఆశీనులను చేశాక ఉగాది ఆస్థానం నిర్వహించారు.


తొలి కొలువు..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. తిరుమలలో ఉగాది పండుగ రోజున నిర్వహించే తొలి వార్షికోత్సవంగా ఉగాది కొలువు నిర్వహించారు. దీనిని శ్రీవారికి ఉగాది దర్బార్ గా నిర్వహించడం ఆనవాయితీ. ఆనంద నిలయం అంటే శ్రీవారి మూలమూర్తికి ఎదురుగా ఉన్న బంగారు వాకిలి వద్ద గరుడాల వరకు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. జీయర్ స్వాములతో కలిసి టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర, ఆలయ ప్రధాన అర్చకులు ఆరు పట్టువస్త్రాలను తీసుకుని వచ్చారు.

ఉగాది ఆస్థానం


శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసిన తరువాత వేద పండితులు తీసుకుని వచ్చిన ఆరు పట్టువస్త్రాలను శ్రీవారికి సమర్పించారు. వాటిలో నాలుగు పట్టు వస్త్రాలు శ్రీవారి మూలమూర్తికి, మరో రెండు వస్త్రాల్లో ఒకటి శ్రీమలయప్ప స్వామి వారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి సమర్పించే నాలుగు పట్టు వస్త్రాల్లో స్వామివారి కిరీటానికి, రెండోది నందకం (ఖడ్గం) మూడో వస్త్రం దోమాలుగా అలంకరించారు. నాలుగో వస్త్రాన్ని ఉత్తరీయంగా స్వామివారి మూలవిరాట్ కు అలంకరించారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి చెంత ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. అంతకుముందు ఈ పంచాంగాన్ని శ్రీవారి పాదాల చెంత నుంచి పూజలు చేశారు.

శ్రీవారు పంచాంగం వింటారా..

తిరుమల శ్రీవారి చెంత ఉగాది ఆస్థానం నిర్వహించడానికి ఎంత ప్రాధాన్యత ఉందో, పంచాంగ శ్రవణానికి కూడా అంతే నిబద్ధత ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం మొదట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రాన్ని ప్రస్తావిస్తూ భక్తితో స్వామి వారికి పంచాంగం చదివి వినిపిస్తారు. ఉభయదేవేరులు శ్రీదేవి భూదేవి నక్షత్రాలపై ఉత్తర పాల్గొన, రేవతి ఫలితాలను కూడా ఆస్థాన సిద్ధాంతి వివరించారు. ఇది వారం నక్షత్రాలతో పాటుగా కొత్త సంవత్సరంలో నవనాయక ఫలాలు లాభనష్టాలు గ్రహాల గతులు తదితర అంశాలన్నీ వినిపించడం ఇక్కడ సాంప్రదాయంగా ఆచరించారు.

జమా లెక్కలు..

ఉగాది ఆస్థానం అంటే కేవలం పంచాంగ శ్రవణమే కాదు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. ఇదే సమయంలో గత సంవత్సరం ఉగాది నుంచి ఈ ఉగాది వరకు అంటే ఏడాది పాటు హుండీ ద్వారా లభించిన కానుకలు, ఆదాయం, ఖర్చు వంటి వివరాలను శ్రీవారికి నివేదించారు. ఈ ఏడాది నిర్వహించబోయే ఉత్సవాల వివరాలతో పాటు ఆలయ విషయం కూడా వేద పండితులు శ్రీవారికి నివేదించారు.

రూపాయి హారతి..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు ఎంత ప్రాధాన్యత ఉందో .. ఉగాది ఆస్థానం వేళ రూపాయి హారతి అనేది ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారి మూల విరాట్ కు సమర్పించారు. ఉగాది ఆస్థానం, శ్రీవారు కొలువు వంటి కార్యక్రమాలతో పాటు పంచాంగ శ్రవణం పూర్తి కాగానే శ్రీవారికి రూపాయి హారతిని సమర్పించడం ఆనవాయితీ. ఉగాది ఆస్థానానికి వచ్చిన వారి నుంచి రూపాయి వంతున వసూలు చేసి శ్రీవారికి హారతి సమర్పించారు. శ్రీవారికి పిండివంటలను నివేదించడంతో ఈ కార్యక్రమం పూర్తయింది.
తిరుమలలో గురువారం సాయంత్రం ఉభయ దేవరులతో కలిసి శ్రీమలయప్ప స్వామి వారు ఊరేగింపుగా మాడవీధుల్లో విహరిస్తారు. ఈ ఉత్సవం ద్వారా తెలుగు నూతన సంవత్సర ఆశీస్సులు అందుకున్నట్లు భక్తులు మానసికంగా ఆనందానికి లోనవుతారు.

శోభాయమానంగా శ్రీవారి ఆలయం..


తెలుగు నూతన సంవత్సర పండుగను పురస్కరించుకుని తిరుమల క్షేత్రం వద్ద పుష్పాలంకరణ కనువిందు చేస్తోంది. ఆలయం వెలుపల గొల్లమండపం సమీపంలో ఫల, పుష్పాలతో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.


"ఉగాది కోసం శ్రీవారి ఆలయం, వెలుపల పది టన్నుల పుష్పాలు, పత్రాలు, పండ్లతో అలంకరించాం" అని టీటీడీ ఉద్యానవన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు చెప్పారు. ఉగాది వేడుక దాదాపు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద అలంకరించారు. సుమారు 60 వేల కట్‌ ఫ్లవర్స్‌ వినియోగించినట్టు టీటీడీ ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసులు చెప్పారు.


రామయణ ఘట్టాలు..


శ్రీవారి ఆలయం లోపల పుష్పాలంకరణ కనువిందు చేస్తోంది. ఆలయం వెలుపల కూడా రామాయణ ఘట్టాలను వివరించే చిన్నికృష్ణుడు, రాముడు, మాహా విష్ణువును పోలిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


మూడు యుగాలకు (కృత, త్రేత, ద్వాపర) చెందిన ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Read More
Next Story