
YCP- NHRC | సీజేఐ, మానవహక్కుల దృఫ్టికి 'యువకులపై పోలీసు లాఠిన్యం'
అమాయకులపై పోలీసుల హింస పెచ్చుమీరిందని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి సీజేఐకి ఫిర్యాదు చేశారు.
అమాయకులపై ఏపీ పోలీసులు కాఠిన్యం ప్రదర్శించారని తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి కేంద్ర చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) తోపాటు మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ లేఖలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటలపై CJI భూషణ్ రామకృష్ణ గవై, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్పర్సన్ V. రామ సుబ్రమణియన్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానాకు లేఖలు రాశారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతి (BC) వర్గాలను లక్ష్యంగా చేసుకున్న ఈ సంఘటనలు రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు, గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లో తెనాలిలో జరిగిన సంఘటనను ఎంపీ గురుమూర్తి ప్రధానంగా ప్రస్తావించారు. పేదవర్గాలకు చెందిన ముగ్గురు దళిత యువకులను బహిరంగంగా రోడ్డుపై పడేసి, యూనిఫాంలో ఉన్న పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై తన లేఖలో ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉప్పునూతల హరికృష్ణను అకారణంగా అదుపులోకి తీసుకుని, నడవడానికి కూడా సాధ్యం కాని విధంగా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో అక్రమంగా నిర్బంధించారని తెలిపారు.
ఈ ఘటనలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఆధారాలు ఆయా సంస్థలకు అందించినట్లు ఎంపీ గురుమూర్తి వివరించారు. పోలీసులు వ్యవహరించిన తీరు రాజ్యాంగం నిర్దేశించిన ఆర్టికల్ 14, 21కు పూర్తిగా విరుద్ధమే కాదు. విలువలను కాలరాశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఈ తరహా సంఘటనలపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలను కూడా ఉల్లింఘించే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
చర్యలు తీసుకోండి.. ఎంపీ గురుమూర్తి
రాష్ట్రంలో అణగారిన వర్గాలపై పోలీసులు అకారణంగా కష్టడీలోకి తీసుకోవడం, చిత్రహింసలకు గురిచేయడం దారుణమని తిరుపతి వైసీపీ మద్దెల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరువల్ల అమాయకులు వేధింపులకు గురయ్యారు. ఈ సంఘటనలపై పూర్తిస్థాయిలో విచారణ చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయడం, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి తన లేఖలో అభ్యర్థించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసులు తన కొడుకు హరికృష్ణను అకారణంగా అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరికృష్ణ తండ్రి యు. ఎల్లయ్య కూడా జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
Next Story