
మామిడి తోటలు చిగురిస్తుంటే... రైతుల్లో ఎందుకీ ఆందోళన
మామడి కాయల సీజన్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. గుజ్జు పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. యజమానులు మామిడికాయలు కొనుగోలు చేయలేకుంటే రైతుల పరిస్థితి ఏమిటి?
చిత్తూరు జిల్లాలో బెంగళూరు (తోతాపురి, అంటుమామిడి) కాయలు ప్రాసెస్ చేస్తారు. ఎందుకంటే ఈ కాయ గట్టిగానే కాదు. తోలుకూడా మందంగా ఉంటుంది. ఈ రకం కాయలు పండించడానికి రైతులు ఆసక్తి చూపిస్తారు.
రాష్ట్రంలో 4.13 లక్షల హెక్టర్లలో మామిడి సాగవుతుంటే, సగటున 43 లక్షలు టన్నుల దిగుబడి వస్తుంది. చిత్తూరు జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో సాగు 5.60 లక్షల టన్నుల దిగుబడి. వస్తోంది. రైతులు ఫ్యాక్టరీలకు తరలించడం, మార్కెట్ యార్డులు, లేదా ర్యాంపులకు తరలించడానికి ఆసక్తి చూపిస్తారు. ఫ్యాక్టరీలకు తరలించడం వల్ల కాస్త అయినా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. చిత్తూరు జిల్లాలో 39 మామిడి ప్రాసెస్ యూనిట్లు దీనికోసం ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది కొనుగోలు చేయడం కష్టంగా మారుతుందేమో అని ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ సౌత్ జోన్ ఛైర్మన్ (all India food processor association- Aifpa) గోవర్ధన్ బాబీ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
"గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన కాయలు ప్రాసెస్ చేశాం. 2.75 లక్షల మామిడి గుజ్జు యూరప్ దేశాలకు విక్రయించే అవకాశాలు మృగ్యంకావడంతో నిలువలు పేరుకుపోయాయి" అని చెప్పారు. యూరప్ దేశాలపై యుద్ధ మేఘాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఏడాది కాలంలో సుమారు 70 వేల టన్నుల వరకు అతికష్టం మీద కంటెయినర్లలో పంపగలిగాం. ఇంకా రెండు లక్షల టన్నులు మిగిలే ఉన్నాయి" అని బాబీ వివరించారు.
ఈ పరిస్థితుల్లో మళ్లీ మామిడి సీజన్ ఈనెలాంతరం నుంచి ప్రారంభం కానుంది. మామిడి రకాలు మొదట కోతకు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని ఢిల్లీ, రాజస్థాన్, ముంబై ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులకు తోడు తిరుపతిలో మామిడి శుద్ధి పరిశ్రమల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.
"రాష్ట్ర ప్రభుత్వం మామిడి ప్రాసెస్ యూనిట్లలో మిగిలిన గుజ్జును కొనుగోలు చేయడానికి ముందుకు రావాలి" అని బాబీ కోరుతున్నారు. తద్వారా ఈ ఏడాది దిగుబడి కొనుగోలు చేయడానికి మార్గం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
యూరప్ దేశాల యుద్ధ ప్రభావం 'చిత్తూరు' జిల్లాపై పడింది. మామిడి గుజ్జు పరిశ్రమపై పడింది. లక్షల టన్నుల గుజ్జు మిగిలిపోయింది. ఆదుకోవాలని యజమానులు అభ్యర్థిస్తున్నారు.
రష్యా- ఉక్రేయిన్ యుద్ధం. గాజాపై ఇజ్రాయిల్ దాడులు. భారత ఉత్పత్తులపై 28 నుంచి 30 శాతం దిగుమతి సుంకం విధించడం. ఇవన్నీ వెరసి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమపై ప్రభావం చూపించింది. దీనివల్ల పరిశ్రమలకే కాదు. మామిడికాయలు సరఫరా చేసిన రైతులకు చెల్లింపు ఆగిపోయాయి. బ్యాంకు రుణాలపై మారిటోరియం ఇవ్వాలని బాబీ కోరుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 87,500 ఎకరాల్లో (దాదాపు 1.10 లక్షల హెక్టర్లు) సుమారు 88 వేల మంది రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 1/3 మూడోవంతు కూడా గత ఏడాది మామిడి దిగుబడి రాలేదు. ధరలు ఉన్నా, దిగుబడి లేక రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి దిగుబడిని రైతులు మామిడి గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేశారు.
"ప్రాసెస్ యూనిట్లలో చిన్నపాటి టిన్నులు, భారీ డ్రమ్ముల్లో నింపిన 2.75 లక్షల టన్నుల మామిడిగుజ్జు నిలువలు గోదాముల్లో పేరుకు పోయాయి" అని బాబి ఆందోళన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో మరో 47 పరిశ్రమలు చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు 47 ఉన్నాయి. అందులో తిరుపతి ప్రాంతాల్లో ఆరు మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఏటా సీజన్లో 7 లక్షల టన్నుల మామిడి కాయలు ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రాసెస్ చేస్తే, 3.50 లక్షల టన్నుల గుజ్జు దిగుబడి వస్తుంది.
రోజూ పది వేల టన్నుల ఉత్పత్తి
జిల్లాలోని ఒకటి 1.10 లక్షల హెక్టార్లలోని మామిడి తోటల నుంచి వచ్చే దిగుబడిలో 75% తోతాపురి రకం మామిడికాయలు ఈ పరిశ్రమలకు తీసుకొని వస్తారు. ఈ 47 గుజ్జు పరిశ్రమల నుంచి రోజుకు ఎనిమిది వేల నుంచి పదివేల టన్నుల గుజ్జు తీయడానికి సామర్థ్యం ఉన్న యంత్రాలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సింగల్ లైన్, అధిక ఉత్పత్తి చేయడానికి సామర్ధ్యం కలిగిన ఫోర్ లైన్ స్థాయిలో మామిడి కాయలు ప్రాసెసింగ్ చేసేందుకు యంత్ర పరికరాలు ఉన్నట్లు Aifpa సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబి వివరించారు.
ఏటా ఏప్రిల్ నుంచి జూన్, జూలై వరకు మామిడి కాయల దిగుబడి ఉంటుంది. అందులో జూన్ జూలై చివరి నాటికి సీజన్ పూర్తవుతుంది. ఆయా సందర్భాలలో వ్యవసాయ మార్కెట్లు, పొరుగు ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఆ కోవాలోనే ఈ ఏడాది కూడా జిల్లా కలెక్టర్ మద్దతు ధర ప్రకటించారు. ఆ మేరకు రైతుల నుంచి పల్ఫ్ పరిశ్రమల యజమానులు కొనుగోలు చేశారు.
"పల్ఫ్ పరిశ్రమ నిర్వహణ, రైతుల నుంచి మామిడికాయల కొనుగోలుకు పెట్టుబడికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం" అని మరో ప్రాసెస్ యూనిట్ ప్రతినిధి చెప్పారు.
ప్రధాన ఇంపోర్టర్ కువైట్
ఒమన్ (Oman), కువైట్ (Kuwait) దేశాలు మామిడి గుజ్జు కొనుగోలు ప్రధాన ఇంపోర్టర్స్ గా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల చరిత్రలో కరోనా పరిస్థితుల తర్వాత రెండోసారి యూరోపియన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్లే పల్ఫ్ పరిశ్రమకు ఎంతటి భారీ కుదుపు ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు.
సాధారణ రోజుల్లో సముద్రమార్గాన కంటైనర్ రవాణా జరిగేది. చిత్తూరు జిల్లాలోని పరిశ్రమల నుంచి కంటైనర్ లో పల్ఫ్ డబ్బాలు, భారీ డ్రమ్ములు నింపేవారు. ఈ కంటైనర్ (container) చెన్నై సమీపంలోని నౌకాశ్రయానికి చేరేది. అక్కడి నుంచి ఓడల్లో (ship) ఎర్రసముద్రం (Red Sea) మీదుగా గల్ఫ్, అరబ్ ఎమిరేట్స్, ఇతర యూరోపియన్ దేశాలకు రవాణా జరగుతుంది. యూరోపియన్ దేశాల్లో యుద్ధం కారణంగా వల్ల ఎర్రసముద్రం మీదుగా రవాణాకు ఆటంకం ఏర్పడింది. పైరెట్ల దాడులు ఎక్కువగా ఉన్నాయి. అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో శ్రీలంక మీదుగా అనేక దేశాలు చుట్టుకుంటూ ఓడలు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"దీనివల్ల మామిడి గుజ్జు కంటైనర్లు రవాణా చేయడానికి ఆటంకం ఏర్పడింది" గోవర్ధన్ బాబి పరిస్థితి వివరించారు.
1. చెన్నై వరకు పరిశ్రమల యజమానులు తరలించడం ఒక పద్ధతి. అక్కడి నుంచి బయ్యర్ తరలిస్తారు.
2. రెండో విధానం. ఒక పద్ధతిలో కొంతవరకు పరిశ్రమల యజమాను రవాణా చేస్తారు. ఆ తర్వాత పొరుగు దేశాల బయ్యర్లు కంటైనర్లు తీసుకువెళ్తారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
"అన్ని ఖర్చులు పరిశ్రమల యజమానులు భరించాల్సి రావడం వల్ల ఆర్థిక భారం భరించడం శక్తికి మించిన భారంగా మారింది" అని బాబి పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
రవాణా భారం
అరబ్, యూరోపియన్ దేశాల ఆర్డర్ల మేరకు చెన్నై మీదుగా కంటైనర్ ప్రయాణించాలంటే ఖర్చు పెరిగిపోయింది. ఎర్రసముద్రం మీదుగా ఓ కంటైనర్ తీసుకువెళ్లాలంటే వెయ్యి డాలర్లు అవుతుందనుకుందాం. ఇప్పుడు శ్రీలంక మీదుగా అనేక దేశాలు చుట్టుకుని వెళ్లడం వల్ల ఆ భారం 5వేల నుంచి 6000 డాలర్లకు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 500 నుంచి 600. శాతం భారం పెరిగింది. అని గోవర్ధన్ బాబి విశ్లేషించారు.
ఈ పరిస్థితులను సానుకూలంగా ప్రభుత్వాలు అర్థం చేసుకుని, మిగిలిన గుజ్జపై ఉద్యానవన శాఖాధికారులు స్పందించాలని కోరుతున్నారు. తద్వారా వేలాది మంది రైతులకు మేలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దీనిపై ప్రభుత్వంతో చర్చలు సాగిస్తామని ప్రాసెస్ యూనిట్ల యజమానులు చెబుతున్నారు. స్పందన ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.
Next Story