కుప్పం మున్సిపాలిటీపై పట్టుకు టిడిపి ఏం చేసింది?
x

'కుప్పం' మున్సిపాలిటీపై పట్టుకు టిడిపి ఏం చేసింది?

మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొద్దిసేపటి కిందటే సమావేశం ప్రారంభమైంది


కుప్పం మున్సిపాలిటీని మళ్లీ హస్తగతం చేసుకోవడానికి టిడిపి, వైసీపీ బల ప్రదర్శనకు వేదికగా మారింది. రెండు పార్టీల మద్దతుదారులు భారీగా మోహరించడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

కుప్పం మున్సిపల్ చైర్మన్ గా టిడిపి కౌన్సిలర్ ఎంపిక కావడం లాంచనంగానే మారినట్లు అక్కడి నుంచి అందిన సమాచారం.
కుప్ప మున్సిపాలిటీలో వైసీపీ నుంచి గెలిచిన చైర్మన్ డాక్టర్ సుధీర్ తన పదవికి, కౌన్సిలర్ పోస్ట్ కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ను ఎన్నుకునేందుకు అవసరమైన సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.
అధికార టిడిపి కూటమి, వైసిపి నాయకులు, మద్దతుదారుల భారీగా మోహరింపు కారణంగా అసాధారణ భద్రత చర్యలు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో టిడిపి ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గం ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంది. ప్రతి ఎన్నికలో టిడిపి అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అందులో భాగంగానే సీఎం ఎన్. చంద్రబాబు ఎమ్మెల్యేగా 8సార్లు విజయం సాధించిన విషయం తెలిసింది. అయితే,
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక శాతం ఆ పార్టీ ఖాతాలోనే వేసుకుంది. అందులో భాగంగానే కుప్ప మున్సిపాలిటీ కూడా వైసిపి దక్కించుకుంది.
"అ ప్రజాస్వామిక పద్ధతులతో వ్యవహరించడం వల్లే ఇలా జరిగింది" అని అప్పట్లో టిడిపి నాయకులు ఘాటుగా ఆరోపణలు చేశారు.
కుప్పం మున్సిపాలిటీ స్థితి
కుప్ప మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో టిడిపి కంచుకోటగా చెప్పుకునే కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆరుగురు గెలిచారు. వైసిపి అభ్యర్థులు 19 మంది విజయం సాధించడంతో ఆ పార్టీ నుంచి కుప్పం పట్టణంలో ప్రముఖ డాక్టర్ సుధీర్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వారి అత్యంత విధేయుడైన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. రెడ్డప్ప భారీ వ్యూహంతోనే కుప్పంలో అన్ని తామే అనే విధంగా రాజకీయంగా పావులు కలిపారు. వై నాట్ కుప్పం అనే నినాదంతో సీఎం చంద్రబాబు ఇలాకాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది.
2024 ఎన్నికల్లో వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఆత్మ సంరక్షణలో పడ్డారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే వైసీపీ నుంచి కుప్పం మున్సిపల్ చైర్మన్ గా గెలిచిన డాక్టర్ సుధీర్ తోపాటు, మరో నలుగురు వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు.
అమరావతిలోని వారందరికి పార్టీ కండువాలు వేసిన సీఎం ఎన్. చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానించారు. అదే సమయంలో డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు, కౌన్సిలర్ పోస్ట్ కు కూడా రాజీనామా చేశారు. ఈయనను పార్టీలో చేర్చుకోవద్దు అని కుప్పం టిడిపి నాయకులు భారీ స్థాయిలో నిలదించడమే కాకుండా నిరసన కూడా వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలో ఉండగా ఆయన వల్ల తీవ్ర ఇబ్బందులు, ఎదుర్కొన్నామని కూడా ఆక్షేపణ వ్యక్తమైన, సీఎం చంద్రబాబు లైట్ గా తీసుకున్నారు.
కుప్ప మున్సిపాలిటీలో ఏం జరగబోతోంది?
కుప్ప మున్సిపాలిటీలో ఆరుగురు టిడిపి కౌన్సిలర్లు ఉన్నారు. వైసీపీ నుంచి నలుగురు బయటికి రావడంతో టీడీపీ బలం 10కి చేరింది. వైసిపి బలం 19 నుంచి 15 కు పడిపోయింది. అయినా, మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే టిడిపి, ఇటు వైసిపికి మ్యాజిక్ ఫిగర్ 14 మంది సభ్యుల బలం ఉండాలి. ఈ పరిస్థితి పూర్తిగా తిరగబడింది.
ఎలాగంటే..
కుప్ప మున్సిపాలిటీలో టిడిపిలో గెలిచిన ఆరుగురికి తోడు వైసిపి నుంచి వచ్చిన నలుగురు కౌన్సిలర్లతో అధికార పార్టీ బలం 10 మంది సభ్యులకు పెరిగింది.
కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ప్రారంభమైంది.
ఆ సమయానికి వైసీపీ నుంచి మరో నలుగురు కౌన్సిలర్లు టిడిపి పక్షానికి వెళ్లినట్లు సమాచారం. అలాగే మరో ఇద్దరు టిడిపి కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరైనట్లు తెలిసింది. దీంతో చైర్మన్ పదవి దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 14 మంది సభ్యుల బలం టిడిపి సాధించినట్లు అక్కడి నుంచి అందిన సమాచారం. దీంతో మళ్లీ కుప్పం మున్సిపాలిటీలో టిడిపి కౌన్సిలర్ చైర్మన్ ఎంపిక లాంచనంగానే భావిస్తున్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
కుప్పం మున్సిపాలిటీలో తమ పట్టు ఎలాగైనా నిలుపుకోవాలని వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టిడిపిలో కూడా ఇదే ధోరణి కనిపించింది. దీంతో, రెండు పార్టీల నాయకులు, మద్దతుదారుల బలప్రదర్శనకు కుప్పం వేదికగా మారింది. పోలీసులు అసాధారణ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ముగ్గురు డిఎస్పీలు, ఐదుగురు సీఐల సారధ్యంలో వందల మంది పోలీసులను కుప్పం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా భారీగా మోహరింపజేశారు.
Read More
Next Story