
TTD | అలిపిరి వద్ద భద్రత మరింత పటిష్టం
తిరుమలకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి వద్తద తనిఖీలకు ఆధునిక సదుపాయాలలో టోల్ ప్లాజా పునరుద్ధరించనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి ఈఓ జె. శ్యామల రావు తెలిపారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో బుధవారం సమీక్షించారు.
అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూప్కు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈఓ సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.