తిరుపతి : కల్యాణ్ ఏమని ప్రార్ధించారు.. అందులో ఏముంది..!
x

తిరుపతి : కల్యాణ్ ఏమని ప్రార్ధించారు.. అందులో ఏముంది..!

అలిపిరి పాదాల మండపం వద్ద పవన్ కల్యాణ్ మోకరిల్లారు. కొన్ని నిమిషాలు శ్రీవారిని ప్రార్ధించారు. మెట్లపై ఉంచిన ఓ తెల్ల ప్లాస్టిక్ కవర్ ప్రత్యేకంగా కనిపించింది.


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఆయన అలిపిరి పాదాల మండపం వద్దకు రావడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది.


తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష విరమణకు తిరుమలకు వచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న పవన్ కల్యాణ్ అలిపిరి పాదాలమండపం వద్ద పూజలు చేశారు. ఆ తరువాత ఆయన తిరుమలకు కాలినడకన బయలుదేరారు.

ఆ బ్యాగులో ఏముంది?

తిరుమలకు నడక ప్రారంభించడానికి ముందు పవన్ కల్యాణ్ మెట్లపై మోకరిల్లారు. తన చేతిలోని జిప్ వేసి ఉన్న ఓ తెల్లటి బ్యాగ్ ఓ మెట్టుపై ఉంచారు. కింది మెట్టుపై మోకాళ్లపై కూర్చుని ఇంకో మెట్టుపై తల ఆనించారు. కొన్ని నిమిషాల పాటు ఆయన శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్ధిస్తూ అలాగే ఉండిపోయారు.
ఏమని ప్రార్ధించారు?

శ్రీనివాసా పాహిమాం. తండ్రీ నీ చెంతకు వస్తున్నా.. నీకు సమర్పించే ప్రసాదం నైవేద్యంలో కల్తీ జరిగిందనే మాటలు నన్ను కలచివేశాయి."అందుకే జగద్రక్షుడైన నీవు నీ భక్తులను కటాక్షించు స్వామీ.. నీ సన్నిధిలో జరిగిన అపరాచారానికి శాంతి హోమంతో పాపపరిహారం చేశాం. అయినా, నా మనస్సులో కొరత ఉంది. నీ అశేష భక్తకోటి పక్షాన నేను ప్రాయశ్ఛిత్త దీక్ష చేశా. పాపాల నుంచి కాపాడాలని కోరుతూ నీ సన్నిధికి వస్తు్న్నా.. స్వామీ నీవే నీ భక్తులను కాపాడాలి. నువ్వే ధైర్యం ప్రసాదించాలి" అని ప్రార్ధిచారా? అనేది ఆయన వివరించాలి. వాస్తవానికి పవన్ కల్యాణ్ శ్రీవారిని శరణు కోరుతూ, సర్వమానవాళి శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్ధించారని జనసేన పార్టీ వర్గాలు చెప్పాయి.

ఆ తరువాత ఓ మెట్టుపై ఉంచిన తెల్లటి ప్లాస్గిక్ బ్యాగు తీసుకుని నడక ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత ఆ బ్యాగును తన సన్నిహిత మిత్రుడైన ఆర్ట్ డైరెక్టర్ కు అప్పగించారు. ఆయన తిరుమల చేరే వరకు ఆ బ్యాగును చేతిలో తీసుకుని వెళ్లారు. అందులో ఏదో కీలక పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే ఆ బ్యాగులో ఏమందో చెప్పగరని ఆయనకు సన్నిహితంగా నడక సాగించిన నాయకులు వ్యాఖ్యానించారు. తిరుమలలో ఆ బ్యాగు గుట్టు విప్పుతారేమో వేచి చూడాల్సిందే.

అంతర్యామీ అలసితినీ... సొలసితినీ...

అలిపిరి కాలిబాట నుంచి తిరుమలకు నడక ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గాలిగోపురం వరకు వెళ్లేసరికి లెక్కలేనన్నిసార్లు కూర్చుండిపోయారు. బయలుదేరడానికి ముందే ఆయన మోకాళ్లకు పట్టీలు వేసుకున్నారు. సాధారణంగా గాలిగోపురం వరకు మెట్లు నిటారుగా ఉంటాయి. అక్కడి వరకు నడక సాగించాలంటే కష్టంగానే ఉంటుంది. దీనిని పవన్ కల్యాణ్ ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు దరిదాపుల్లోకి రానివ్వకుండా జనసేన తిరుపతి నేత పసుపులేటి హరిప్రసాద్, పవన్ కల్యాణ్ సన్నిహిత మిత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నారు.
నడకమార్గంలో అలసి కూర్చున్నప్పుడల్లా పవన్ కల్యాణ్ కు సపరిచర్యలు చేశారు. రుమాలుతో విసురుతూ, సేదదీరడానికి శ్రద్ధ తీసుకున్నారు. రాత్రికి తిరుమలకు చేరుకోగానే అక్కడి స్థానికులు హారతులతో ఘనంగా స్వాగతించారు.


Read More
Next Story