
తిరుపతి గాంధీ : టీటీడీ మాజీ ఈఓ చెలికాని అన్నారావు విగ్రహం
తిరుపతి : అన్నా... ఏ దారి ఎటో.. తెలియడం లేదే..
తిరుపతి ఆధ్యాత్మిక పరపతిని రాజకీయ నేతలు దెబ్బతీస్తున్నారు. యాత్రికుల మనోభావాలతో ఆటాడుకుంటున్నారు.
తిరుపతి ఆధ్యాత్మిక నగరం. యాత్రికుల మనోభావాలతో ముడివడి ఉన్న ప్రదేశం. ఈ చారిత్రక ప్రదేశం ఔన్నత్యాన్ని కాపాడాలని టీటీడీ నిర్ణయాలు చేస్తోంది. మినహా ఆచరణలో విఫలం అవుతోంది. అందుకు నిదర్శనం తిరుపతిలో ప్రధాన రోడ్లే కాదు. వీధులను కూడా కమ్మేస్తున్న హోర్డింగులు, ఫ్లెక్సీల వల్ల యాత్రికులకు దారీతెన్నూ తెలియని స్థితి కల్పిస్తున్నారు. చివరాఖరికి చరిత్రకారుల విగ్రహాలను కూడా వదలడం లేదు.
తిరుపతి నగరంలో దాదాపు 2.50 లక్షల మంది ఓటర్లే ఉన్నారు. విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక, విహారయాత్ర స్థలాలకు కేంద్రంగా ఉండడంతో దేశ, విదేశాల నుంచి రోజూ లక్ష మంది వరకు తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటారనేది ఓ అంచనా. ఈ పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన వసతుల వల్ల తిరుపతి నగరం దాదాపు 11 కిలోమీటర్ల దూరం ఉన్న రేణిగుంట, చిత్తూరు మార్గంలో దాదాపు 10 కిలోమీటర్లు, మదనపల్లె మార్గంలో శ్రీనివాసమంగాపురం వరకు 15 కిలోమీటర్లు విస్తరించింది. ఈ ప్రదేశాలన్నీ చారిత్రక ఆలయాలకు నిలయం. ఈ ప్రదేశాలకు ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో యాత్రికులు తికమక పడుతున్నారు. ఏ ప్రదేశానికి ఎటు వెళ్లాలనే సూచిక బోర్డులు కనిపించవు. దారి పొడవునా, రోడ్డుకు రెండు పక్కలా ఫ్లెక్సీలు, కటౌట్లు, భారీ హోర్డింగులతో నింపేస్తున్నారు.
తిరుపతి పితామహుడుకీ తప్పలేదు...
అన్నాారావు విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు అంటించిన వైనం
టీటీడీ ఆ తరువాత తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయడంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చెలికాని అన్నారావుది కీలకపాత్ర. ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా ఉన్నాయి. ఆయన సేవలను చిరస్మరణీయం చేస్తూ, కపిలతీర్థం రోడ్డు (K.T. Road)లో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టని రోజంటూ ఉండదు.
"1933 టీటీడీలో అన్నారావు పేష్కారుగా చేరారు. ఆతరువాత పర్సనల్ అసిస్టెంటు కమిషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది. ఈయన దేవస్థానంలో ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన జీతాలు, సౌకర్యాలను కల్పించి, చక్కని క్రమశిక్షణ అలవర్చాడు. అమెరికా, ఇతర దేశాలలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల స్థాపనకు ఆయన ఎంతో కృషిచేశారు" అని తిరుపతిలో ఎవరిని కదిపినా చెబుతారు. అటు తిరుమలకు వెళ్లే మార్గం, ఇటు కపిలతీర్ధం వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదేశానికి "అన్నారావు సర్కిల్"గా చిరస్థాయిగా పేరు ఉంది. ఈ విగ్రహం చుట్టు దిమ్మెకు ప్రచార పోస్టర్లు అంటించడం నిత్యకృత్యంగా మారింది.
ఏడాదికి కనీసం రెండుసార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటామని నిజామాబాద్ కు చేందిన రమేశ్ చెప్పారు. శ్రీనివాసం వద్ద ఆయన ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్టాడుతూ,
"అలిపిరి నుంచి నడిచివెళ్లడానికి ఆటోలో బయలుదేరాం. ప్రతి కూడలి చుట్టు ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అది ఏ ప్రదేశం అనేది పిల్లలకు చెప్పడానికి కూడా వీలుకావడం లేదు" అని రమేశ్ వ్యాఖ్యానించారు.
తీర్మానాలు పుస్తకాల్లో భద్రం
తిరుపతి ఆధ్యాత్మికతను కాపాడాలని టీటీడీ హైపవర్ కమిటీ చేసిన తీర్మానాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు ఆ కమిటీ సమావేశాలు జరుగుతున్న దాఖలాలు కూడా లేవు.
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, తుడ చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనిచేసిన కాలం అది. ఇందులో తిరుపతికి సంబంధించి మూడు తీర్మానాలు చేశారు.
1. తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి బైపాస్ రోడ్డులో అలిపిరి వరకు భారీ హెర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడాదు.
2. ఇదే మార్గంలో మద్యం, మాంసం దుకాణాలు నిర్వహించకూడదు.
3. తిరుమల, శ్రీవెంకటేశ్వరస్వామి పేరు ఆయన పర్యాయ పేర్లు తిరుపతి, సమీపప్రాంతాల్లో బ్రాందీషాపులకు పేర్లు పెట్టకూడదు.
అని తీర్మానం చేశారు. ఇందులో మద్యం మినహా మిగతా ఏవీ అమలు చేస్తున్న దాఖలాలు లేవు.
ఎవరికి వారు..
తిరుపతిలో పెరిగిన ఫ్లెక్సీలు, హోర్డింగుల సంస్కృతి మితిమీరింది. రెండు ప్రధాన శాఖలు ఎవరికీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం లేదు. అలాంటి వాటిని ఆ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటే, ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్నప్పటికీ పోలీసులు కూడా స్పందించిన దాఖలాలు లేవు.
ఆలయాలు కనిపించవు..
నగరానికి మంత్రులు, కీలక నేతలు వస్తున్నారంటే, తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి తిరుమలకు ప్రవేశ ద్వారంగా ఉన్న అలిపిరి వరకు బైపాస్ రోడ్డుకు రెండు పక్కలా అడుగు దూరంలో ఏమి ఉందనేది కనిపించనంతగా ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఇదే పరిస్థితి కపిలతీర్థం, రైల్వే స్టేషన్, బస్టాండ్, గోవిందరాజు స్వామి ఆలయం, రాములవారి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలను కూడా ప్రచార ఆర్భాటకులు వదలడం లేదు. దీనివల్ల, తిరుమలకు వెళ్లాలని తిరుపతికి చేరుకునే యాత్రికులు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది.
ఈ విష సంస్కృతి నుంచి తిరుపతిని కాపాడాలని సీపీఎం రాష్ట్ర నేత కందారపు మురళీ కోరారు.
"అభిమానం ఉండవచ్చు. అది ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఉండకూడదు" అని మురళీ అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు ఆగడాలకు అంతులేకుండా ఉంది. మున్సిపల్ అధికారులు కూడా తమాషా చూస్తున్నట్లు ఉంది అని మురళీ నిరసన వ్యక్తం చేశారు.
సందర్భం ఏదైనా సరే..
తిరుపతికి నాయకులు వస్తున్నా సరే. స్వాగతించడానికి ఏర్పాటు చేసే హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఫ్యాషన్ గా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులే కాదు. గల్లీ లీడర్ పుట్టినరోజు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా అదీ, ఇదీ అని లేదు. ప్రధాన రోడ్లే కాదు. చిన్నవీధుల్లో కూడా దారి కనిపించని స్థితి కల్పిస్తున్నారు.
తిరుపతి నుంచి బైపాస్ రోడ్డులో అలిపిరి వరకు ఏర్పాటు చేస్తున్నఫ్లెక్సీల వల్ల ఒకే పార్టీలోని వారి మధ్యే ఘర్షణలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన ఈ అంశంపై పోలీసులు కూడా చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. ఎందుకంటే, అధికార పార్టీ నేతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనేది ప్రధాన కారణం.
"రాజకీయ నేతల జన్మదినోత్సవాలు, షష్టిపూర్తి, పదవీ ప్రమాణస్వీకారం, ఆఖరికి పెళ్లి రోజులను కూడా వదలడం లేదు. ఊరంతా సందు లేకుండా ఫ్లెక్సీలను కట్టేస్తున్నారు. తిరుపతిలోని ప్రజలు ఈ సంస్కృతిని అసహ్యించుకుంటున్నారు" అని మురళీ వ్యాఖ్యానించారు.
ఫ్లెక్సీల కారణంగా తిరుపతి నగరం కాలుష్యకారకంగా మారిపోతోంది. ఫ్లెక్సీల చెత్తతో కాలువలు, చెత్త కుప్పలు నిండిపోతున్నాయని భూమిలో కలిసిపోవడానికి దీర్ఘకాలం పట్టే ఈ ఫ్లెక్సీలను తిరుపతి లాంటి ప్రాంతంలో విచ్చలవిడిగా వాడటం ఈ ప్రాంతానికి తీరని నష్టం కలుగజేస్తుందనడంలో సందేహం లేదు.
పర్యావరణ ప్రేమికులు, పలు సంస్థలు అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నా స్పందన లేదని అన్నారు. ఆఖరుకు నియంత్రించాల్సిన జిల్లాస్థాయి, నగర స్థాయి అధికారులు సైతం తమ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి పోటీలు పడటం అన్యాయమని అన్నారు.
Next Story