
ఆదివారం తెల్లవారుజామున ఉగ్రశ్రీనివాసమూర్తి ఉత్సవం
తిరుమలలో దర్శనమిచ్చిన ఉగ్రశీనివాసమూర్తి..
శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
శ్రీవారి ఆలయం నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని సర్వాంగ అలంకరించి ఆదివారం సూర్యోదయానికి ముందే మాడవీధుల్లో ఊరేగించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సంవత్సరానికి ఒకసారి మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం టిటిడి నిర్వహించింది.
శ్రీవారి ఆలయం నుంచి ఉభయ దేవేరులతో కలిసి ఉగ్రశ్రీనివాసమూర్తి విహారానికి బయలుదేరే ముందు వేద పండితులు నివేదనలు సమర్పించారు. అనంతరం పల్లకీ సేవలో టీటీడీ పెద్దజీయంగార్ తోపాటు కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆలయ అధికారులు, అర్చకులు హాజరయ్యారు. ఉభయ దేవేరులతో కలిసి ఉగ్రశ్రీనివాసమూర్తి మాడవీధుల్లో విహరించే సమయంలో వేకువజాము అయినా, యాత్రికులు గ్యాలరీల నుంచి కర్పూర హారతులు సమర్పించారు.
చరిత్ర ఇదీ..
కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశిక ద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని సంవత్సరానికి ఒకసారి టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.
ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. శ్రీవరాహ స్వామి కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.
నంబదువాన్ కథ…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీ నంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని ఆకలబాధ తీరుస్తానని ప్రమాణం చేశాడు. చెప్పిన మాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అని పేరు సార్థకమైంది.
సూర్యదయానికి ముందే ఎందుకు?
తిరుమల శ్రీవారి ఆలయంలో సూర్యోదయానికి ముందే ఉగ్రశ్రీనివాసమూర్తిని అలంకరించి ఊరేగించడం ఆనవాయితీ. ఇలా వ్యవహరించడం వెనుక కూడా చారిత్రక నేపథ్యం ఉంది. 14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు జరుగుతూ ఉండగా సూర్య కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగానే భాగీ అగ్ని ప్రమాదం జరిగిందట. దీంతో అప్పటి నుంచి సూర్యోదయానికి ముందే ఉగ్రశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అలంకరించి ఊరేగించడం ఆనవాయితీగా మార్చారు.
ఆస్థానం
ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున 4.30 నుంచి 5.45 గంటల వరకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుంచిడి ఉదయం 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. అందులో భాగంగా ఆలయంలో పురాణ పారాయణం ఘనంగా నిర్వహించడంతో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తయింది.
Next Story

