తిరుమల:క్రీ.శ 614 నాటి విగ్రహ ఆవిర్భావ వేడుక
x
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం (ఫైల్)

తిరుమల:క్రీ.శ 614 నాటి విగ్రహ ఆవిర్భావ వేడుక

శ్రీవారి సన్నిధిలో భోగశ్రీనివాసుడిని స‌హ‌స్రా శీర్ష పురుషుడిగా పరిగణిస్తారు. ప్ర‌త్యేక స‌హ‌స్ర‌ క‌ల‌శాభిషేకం నిర్వహించడ వెనుక నేపథ్యం ఏమిటి?


తిరుమల అనగానే కళ్లముందు కదలాడేది శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు. ఆ విగ్రహం పాదాల చెంత కనిపించే మరో చిన్న విగ్రహమే భోగశ్రీనివాసుడు. ఈ విగ్రహానికి రాత్రి పవళింపుసేవ, వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించడం ఆనవాయితీ. వార్షిక ఉత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం ఆ భోగశ్రీనివాసుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

భోగశ్రీనివాసమూర్తి విగ్రహం (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణం. ఈ క్రేత్రంలో నిర్వహించే ఉత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఆ కోవలోనే.. శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించారు అనేది చారిత్రక నేపథ్య కథనం. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ రోజును పురస్కరించుకుని ఆలయంలో భోగశ్రీనివాసుడికి ఆదివారం ఉదయం ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ వేదపండితులు ఏకాంతంగా నిర్వహించారు.


కలశాలతో తిరుమల పెద్ద‌జీయ‌ర్ స్వామి, చిన‌జీయ‌ర్ స్వామి, ఆలయప్రధాన అర్చకుల్లో ఒకరు వేణుగోపాల దీక్షితులుతో కలిసి టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు, టీటీడీ అద‌న‌పు ఈవో సిహెచ్‌.వెంక‌య్య చౌద‌రి చేరుకున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీమ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీభోగ శ్రీనివాసమూర్తి, శ్రీవిష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.

మూలవిరాట్టుతో అనుసంధానం..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేకం. సాధారణంగా యాత్రికులు ఆలయంలకి వెళ్లగానే శ్రీవేంకటేశ్వరుడి మూలవిరాట్టును దర్శించుకుంటే పుణ్యం లభిస్తుంది. జన్మధన్యమైనట్టుగా భావిస్తారు. ఆయన పాదాల చెంత ఉన్న భోగశ్రీనివాసుడి విగ్రహాన్ని దర్శించుకునే వారే తక్కువ. భోగశ్రీనివాసుడికి నిర్వహించే కార్యక్రమలన్నీ శ్రీవారికి దక్కినట్లే లెక్క. అందుకోసం.. ఏమి చేశారంటే..
శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీమనవాళ పెరుమాళ్ ను, ఈ విగ్రహానికి అభిముఖంగా విష్వక్సేనులవారిని ఆశీసునులు చేశారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీభోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేశారు. అంటే భోగశ్రీ‌నివాస‌మూర్తికి నిర్వ‌హించే అభిషేకాధి క్ర‌తువులు మూల‌మూర్తికి నిర్వ‌హించిన‌ట్లు అవుతుంది. అనంత‌రం వేదపండితులు వేద పారాయ‌ణం చేశారు. అర్చకస్వాములు ఏకాంతంగా ప్ర‌త్యేక సహస్రకలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు.
చారిత్రక నేపథ్యం

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవ రాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు. ఆలయ డిప్యూటీ ఈఓ లోక‌నాథం, పేష్కార్ రామ‌కృష్ణ‌ పాల్గొన్నారు.
Read More
Next Story