వారి రాక ఆలస్యమే..  పేర్ల వెల్లడిలో జాప్యం..
x

వారి రాక ఆలస్యమే.. పేర్ల వెల్లడిలో జాప్యం..

రాష్ట్ర మంత్రివర్గ కూర్పు మంగళవారం రాత్రి ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీ పెద్దల కోసం నిరీక్షించడం, సమీక్ష వల్లే జాబితా వెల్లడిలో ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది.


టీడీపీ కూటమికి రోజురోజుకు తలనొప్పులు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పొత్తులతో పురుడు పోసుకున్న కష్టాలు సీట్ల సర్దుబాటుతో పెరిగి, క్యాబినెట్ కూర్పు వరకు కొనసా...గాయి. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో తేల్చుకోలేని స్థితిలో ఒకే వ్యక్తి కోసం టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు నిశిరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు టీడీపీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనేతలు వచ్చిన తరువాత కూడా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలని అనే విషయంలో తీవ్రంగా చర్చలు సాగడం వల్ల పేర్లు వెల్లడిలో జాప్యానికి కారణమని తెలిసింది. టీవీల్లో కూడా బ్రేకింగ్ రాకపోవడం, పదేపదే కూటమి లెజిస్టేటివ్ మీటింగ్ మాత్రమే తిప్పితిప్పి ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో.. మంగళవారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేను ఫెడరల్ ప్రతినిధి పలకరించారు. ’అన్నా ఇంకా ఏమీ తెలియలేదు. వెయిట్ చేస్తున్నా. నేనే కాదన్నా... సీనియర్లు చాలా మంది టెన్షన్గా ఉన్నారని చెప్పారు.

వాస్తవానికి ఫలితాలు వెలువడిన తరువాత మంత్రివర్గ కూర్పుపై టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని బేరీజు వేసుకుని, కసరత్తు చేశారని సమాచారం. అందులో సామాజిక వర్గాలు, ప్రాంతాల వారిగా సమతూకం పాటించే విధంగా అంచనాకు వచ్చారని కనిపిస్తోంది. అయితే, బీజేపీ నుంచి ఎవరిని తీసుకోవాలనే అంశంలో రాష్ట్ర కమిటీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఆ పార్టీ కేంద్ర నాయకత్వ నిర్ణయం కోసం వేచిచూడడం వల్లే ఆలస్యం కావడానికి దారితీసినట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. ఈ ప్రాంతం నుంచి ప్రమాణస్వకార కార్యక్రమానికి వెళ్లిన బీజేపీ నేత ఒకరు ఈ విషయం స్పష్టం చేశారు.


ఏమి జరిగిందంటే...
టీడీపీ, జనసేన, బీజేపీ లెజిస్ట్రేటివ్ పార్టీ నేతలను ఎన్నుకున్నారు. ఆ తరువాత మూడు పార్టీల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సీఎం అభ్యర్థిగా ఎన్. చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత మంత్రివర్గ కూర్పులో ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు సమాచారం. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల విషయంలో రెండు పార్టీల నేతలు క్లారిటీగా ఉన్నారు. బీజేపీ విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పడినట్లు సమాచారం. దీనికోసం ఢిల్లీ నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు రాక కోసం కూటమి నేతలు నిరీక్షించారని తెలిసింది. తన నివాసానికి వచ్చిన అమిత్ షాతో ఎన్. చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా చర్చించిన తరువాత, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మల్యే, బీజేపీ జాతీయ కార్యదర్శి ఏ. సత్యకుమార్ పేరును ఖరారు చేశారని తెలిసింది. ీ తరువాతే, తుది జాబితా మంగళవారం రాత్రి (బుధవారం తెల్లవారుజామున) ఒంటి గంట తరువాత ప్రకటించడానికి కారణమని సమాచారం.
రాత్రంతా జాగారం
కొత్తగా ఎన్నికైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు రాజధాని అమరావతికి వెళ్లారు. మంగళవారం శాసనసభాపక్ష నాయకులను ఎన్నుకున్నారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా విజయవాడలోనే మకాం వేశారు. సోమవారం మంత్రివర్గం కొలువుదీరాలి. అయితే, మంగళవారం ఉదయం అలా కాలం వెళ్లదీసి వారంతా, సాయంత్రం వరకు వేచి చూశారు. జిల్లాల్లో అనుయాయుల నుంచి ఫోన్లు, వారికి సమాధానాలు చెప్పుకుంటూనే వారంతా ఉత్కంఠగా గడిపారు. సాయంత్రం కాస్తా.. రాత్రి అయింది. ఆ తరువాత నడిరేయి వచ్చింది. మంత్రి వర్గంలోకి తీసుకునే వారి పేర్లు ప్రకటించడంలో జాప్యం. ఆశావహులు ప్రధానంగా సీనియర్లలో నరాలు తెగే ఉత్కంఠ. తెల్లవారితే ప్రమాణ స్వీకారం. చంద్రబాబు నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందా? అని మాటిమాటీకి ఎదురు తెన్నులు. కొత్తగా ఎన్నికైన వారంతా మంగళవారం ఇలా కాళరాత్రిని అనుభవించారు. చివరాఖరికి ఊహించని వారి పేర్లు జాబితాలో రావడం, ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలనే పిలుపునతో పదవులు ఆశించి భంగపడిన వారంతా ఉస్సూరుమన్నారు.
Read More
Next Story