CM Chandrababu | తల్లీ.. నీకు దశల వారీగానే వందనం..!
x

CM Chandrababu | 'తల్లీ'.. నీకు దశల వారీగానే 'వందనం'..!

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతో ఒకేసారి లబ్ధి కలదనే విషయం తెరమీదకు వచ్చింది. తల్లుల ఖాతాకు నగదు జమ చేసే ఈ పథకంపై ఇంకా ఓ స్థిర నిర్ణయానికి రాలేదనే విషయం వెల్లడైంది.


రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం ' పథకంపై ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలో తెరిచే నాటికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 15 వేల వంతున చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం సూపర్-6 హామీల్లో మేనిఫెస్టోలో ప్రకటించింది.

ఈ ఏడాది మే నెలలో పాఠశాలలు తెరిచే నాటికి తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఒకేసారి నగదు జమ చేయాలా? విడతల వారీగా పంపిణీ చేయాలా? అనే విషయంలో కూటమి ప్రభుత్వం ఇంకా సమాలోచనల్లోనే మునిగి తేలుతున్నట్లు స్పష్టమైంది.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆ మేరకు చేసిన వ్యాఖ్యలు "తల్లికి వందనం" పథకంలో నగదు ప్రక్రియ పై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది.
2024 ఎన్నికల మేనిఫెస్టోలో టిడిపి కూటమి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని ప్రకటించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకంపై విస్పష్టమైన ప్రకటన చేశారు.
"ఏడాది మే నుంచి ఈ పథకం అమలు చేస్తాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బడ్జెట్లో కూడా 9507 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంతవరకు సవ్యంగానే ఉంది.
అప్పుడూ కోతలే..
వైసిపి అధికారంలో ఉండగా, అమ్మ ఒడి పేరిట ఈ నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ. 15 వేలలో వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ ఖర్చుల పేరిట కోత విధించి, రు. 14 వేలు చెల్లించారు.
వైసిపి అధికారంలో ఉండగా మాజీ సీఎం వైఎస్ జగన్ 2020 జనవరి 9న అమ్మ ఒడి పథకానికి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద లభ్య పొందడానికి 5 అర్హతలను ప్రకటించారు.
1 . ప్రభుత్వం జారీ చేసిన తెల్ల కార్డు ఉండాలి
2 .లబ్ధిదారులు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి
3 .అమ్మ ఒడి పథకం లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.
4 .విద్యార్థులు కనీసం 75% హాజరు ఉండాలి.
5 .ప్రభుత్వ ఉద్యోగులు ఏ పథకానికి అర్హులు కాదు.
అని ప్రకటించిన ఆ తర్వాత, విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చిన, సొంత కార్లు ఉన్నవారికి పథకం వర్తించడానికి కొర్రెలు పెట్టారు. అయినా
తగ్గిన సంఖ్య..
అమ్మ ఒడి పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరం 2020 లోనే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 44 లక్షల మంది విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యింది. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అసెంబ్లీ లో చేసిన ప్రకటన ఇది.
ఆ ఏడాది తొమ్మిదో తేదీ 63 36. 45 కోట్ల రూపాయలు జమ చేశారు. 70 శాతం నిబంధన కారణంగా 2021-22 విద్యా సంవత్సరానికి 51,000 మంది తల్లులు అమ్మబడి పథకానికి అర్హత కోల్పోయారు. డ్రాప్ అవుట్ ను తగ్గించారని ఉద్దేశంతోనే కనీస హాజరు నిబంధన పెట్టామని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది.
పెరిగిన లబ్ధిదారులు..
"ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ 'తల్లికి వందనం' వర్తింప చేస్తాం" అనే టిడిపి కూటమి మేనిఫెస్టో వల్ల రాష్ట్రంలో ఈ పథకం లో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.
ప్రభుత్వం ప్రకటించినట్లు 2024 25 వ సంవత్సరంలో 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు గుర్తించారు. వారిలో ప్రాథమికంగా 69. 16 లక్షల మంది విద్యార్థులను మాత్రమే తేల్చినట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసిన విషయం. వీరికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి టిడిపి కూటమి బడ్జెట్లో కేటాయించిన 9,407 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంది.
వీడని సందిగ్ధత
టిడిపి కూటమి తన మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తల్లికి వందనం పథకం అమలు చేయడంలో ఇంకా అంతర్గతంగా ఓ కొలిక్కి రాలేదని విషయం సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన స్పష్టం చేసింది.
ఈ పథకం అమలు చేయడానికి ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకోలేదని విషయం కూడా తెరపైకి వచ్చింది.
ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీకి విమర్శనాస్తంగా దొరికింది.
"ఎన్నికల్లో ఇచ్చే హామీలు చంద్రబాబు అమలు చేయరు. అది ఆయన నైజం" అని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.
తిరుపతిలో గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి కరపత్రాల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇది ఇలా ఉంటే
ఒకేసారి ఇస్తారా..?
తల్లికి వందనం పథకం విద్యార్థి తల్లి ఖాతాకు ఒకేసారి 15000 జమ చేస్తారా? ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న పిల్లలు తల్లుల ఖాతాలో కంతుల వారీగా జమ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా మరో నెలలో పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటికే అనధికారికంగా కోచింగ్ కేంద్రాలు, ప్రత్యేక తరగతుల పేరుతో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ ఇది వరకు యాజమాన్యాలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాయి. పుస్తకాలు కొనుగోలు అనేది విద్యార్థుల తల్లిదండ్రులకు అనివార్యం.
మొదటి ఏడాది మొండిచెయ్యి
2024 జూన్ 12 వ తేదీసీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. వాస్తవానికి అదే రోజు విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయాల్సి ఉండగా, టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే తల్లికి వందనం పథకం అమలు కాలేదు. అయితే,
"ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేస్తాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు లబ్ధిదారుల ను గుర్తించాలని కూడా ఆయన అధికారులు ఆదేశించారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడి పదో నెల ముగియబోతున్నా, ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విధివిధానాలను ఖరారు చేయడంలో ఇంకా మల్ల గుల్లాలు పడుతూనే ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన వల్ల మరింత గందరగోళం ఏర్పడింది. తల్లికి వందనం పథకం లో ఒకేసారి నగదు బదిలీ చేస్తారా? లేక విడతల వారీగా చెల్లిస్తారా? అనేది సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన అంశం.
దీనికి తోడు నిబంధనల ఆంక్షలు కూడా వెంటాడుతున్నాయి. గత వైసిపి ప్రభుత్వం అమలు చేసిన విధానాలను సమీక్షించడంలో భాగంగానే ఈ పథకంలో కూడా సొంత ఇల్లు, విద్యుత్ వినియోగం, సొంత కారు ఉన్నవారికి తల్లికి వందనం పథకం నుంచి మినహాయించే ప్రమాదం లేకపోలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా జూన్ నెలలో పాఠశాలలు తెరిచే నాటికి ఈ పథకంగా జమ అయ్యే నగదు ద్వారా విమర్శలు ఆరోపణలకు తెరపడే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూడకు తప్పదు.
Read More
Next Story