రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వివాదం రచ్చకెక్కింది. దీనికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేంద్ర బిందువుగా మారింది. ఈ హెడ్ రెగ్యులేటర్ తూముల విస్తరణతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రైతులకు వరం ప్రసాదించాలని ఐదు బృందాలు 1986 జనవరిలో సాగించిన పాదయాత్రకు సరిగ్గా 40 ఏళ్ల నిండాయి. ఆ స్ఫూర్తిని గుర్తు చేస్తూ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిప్పు కణిక మండించే యత్నానికి తిరుపతి వేదికగా నిలవబోతోంది.
తిరుపతి నగరంలో జనవరి 21వ తేదీ "రాయలసీమ ఎత్తిపోతల పథకం"పై చర్చా గోష్ఠి ఏర్పాటు చేశారు. మంగళం రోడ్డులోని గెస్ట్ లైన్ ఎదురుగా ఉన్న డీఎల్ ఆర్ గ్రాండ్ హోటల్ ఉదయం పది గంటలకు ఈ చర్చా కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ నాటి ఉద్యమం..
1986 జనవరి ఒకటో తేదీ రాయలసీమలోని ఐదు ప్రదేశాల నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ తూముల విస్తరణ కోసం ప్రారంభమైన పాదయాత్రలు 26వ తేదీ నంద్యాల వద్ద లక్ష మందితో సభ ముగిసింది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు పోలీసు బలప్రయోగం చేయకుండా, సీమ ప్రాంత ఉద్యమకారులకు పోతిరెడ్డి పాడుకు చేరుకునేలా చేశారు. అప్పటి నుంచి రాయలసీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సేద్యం, తాగునీటికి జీవనాడిగా నిలిచిన శ్రీశైలం జలాశయం కుడి కాలువకు అనుసంధానంగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నేతల మధ్య కాక రగిలిస్తూనే ఉంది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూము విస్తరణ కోసం 40 సంవత్సరాల కిందట సాగించిన పాదయాత్ర ఓ చరిత్ర. యువతను చైతన్యం చేయడం కూడా ఓ చారిత్రక అవసరం" అని రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ చెప్పారు.
"రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో మాట్లాడి, నేనే ఆపించాను" అని తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది.
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్యం 885 అడుగులు. 881 అడుగులు నీరు నిలిపితే పోతిరెడ్డిపాడు నుంచి నీరు రాయలసీమకు పారుదలకు అవకాశం ఉంటుంది. తెలంగాణ 777 అడుగుల స్థాయి నుంచే రోజుకు నాలుగు టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి సాగిస్తే, 881 అడుగులు నిలువ ఉంచడం ఎలా సాధ్యం అవుతుంది? 884 అడుగుల కనీస నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని లిఫ్ట్ చేయవచ్చని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.
"శ్రీశైలం నుంచి వరదనీటి జలాలను తెలంగాణ తరలిస్తే, తప్పు లేదు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తే తప్పయిందా?" అని రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ ప్రశ్నించారు.
రాజకీయ మంటలు
రాయలసీమకు సాగు నీరందించే హంద్రీనీవా సుజల స్రవంతి (HNSS), కాలువలోకి నీరు లిఫ్ట్ చేసే ముచ్చుమర్రి, తాజాగా రాజకీయంగా మాటల మంటలు రేపుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంత ప్రయోజనాలకు శ్రీశైలం కుడికాలువ ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం, విద్యుత్ ఉత్పత్తి కారణంగా రాయలసీమ ప్రజలకు శాపంగా మారుతోంది.
"రాయలసీమలో హంద్రీ, నీవా కాలువకు నీరందిస్తున్న ముచ్చుమర్రి, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కూడా అనుమతి లేనివే. కానీ ఇవి అవసరం" అని రాజ్యసభ మాజీ సభ్యుడు, పీసీసీ మీడియా కమిటి చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
పోతిరెడ్డిపాడు ప్రాధాన్యం ...
నీలం సంజీవరెడ్డి సాగర్ (శ్రీశైలం జలాశయం) నుంచి రాయలసీమకు సాగు నీరు అందాలంటే నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో పోతులపాడు గ్రామం. ఇది శ్రీశైలం జలాశయం ఒడ్డునే కర్నూలు, గుంటూరు రహదారికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటిని తీసుకునేందుకు ఈ ప్రదేశం ప్రధానమైంది. 11,500 క్యూసెక్కుల నీటిని నాలుగు తూముల ద్వారా వదలడానికి హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. తరువాత 2005 సెప్టెంబర్ 13వ తేదీ జీఓ నంబర్ 170 ద్వారా ఏడు తూములకు విస్తరించి, 40 వేల క్యూసెక్కులకు పెంచారు.
శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ప్రవహించే వరదనీటిని చైన్నైకి 15 టీఎంసీల నీరు బ్ర్మంహ్మంసాగర్ ద్వారా గాలేరు, నగరి కాలువలో పారించడం, హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా 16.4 కిలోమీటర్లు ప్రయాణించి ఈ కాలువ 16.4 కి.మీ.ప్రయాణం చేసి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు చేరి ముగుస్తుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం డ్యాం నుంచి కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు, నగరి కాలువకు వరదనీటిని అందించడంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కీలకం.
"పోతిరెడ్డిపాడు" పోరాటానికి 40 ఏళ్లు..
అది 1986 జనవరి1:
డిమాండ్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూముల ద్వారా నీటి విడుదల సామర్థ్యం 90 వేల క్యూసెక్కులకు పెంచాలనే డిమాండ్ ఆ రోజు ఆందోళన మొదయలింది. హెడ్ రెగ్యులేటర్ నీటి ప్రవాహం సామర్థ్యం పెంచినపుడు రాయలసీమ ప్రయోజనాలు నెరవేరుతాయని కాంగ్రెస్ నాయకుడు వైఎస్.రాజశేఖరరెడ్డి సారధ్యంలో పాదయాత్రలు మొదలయ్యాయి. 16 రోజుల పాటు ఐదు ప్రాంతాల నుంచి పాదయాత్రలు జరిగిన సంఘటనలు ఓ చారిత్రక ఘట్టంలా నిలిచాయి. నంద్యాల ఎంపీగా పనిచేసిన బొజ్జా, వెంకటరెడ్డి, అనంతపురం కదలిక పత్రిక ఎడిటర్ ఇమాం తోపాటు ఎందరో కీలకంగా వ్యవహరించారు. నందికొట్కూరు వద్ద ఆనాటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే శేషశయనారెడ్డి పాదయాత్రలో వచ్చిన వైఎస్ఆర్ ను స్వాగతించారు.
"కరువుబండ యాత్ర" పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు వైఎస్. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రకు రాయలసీమలోని ఐదు ప్రాంతాల నుంచి బయలుదేరిన ఉద్యమకారులు కూడా జత కలిశారు. ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి కందుల నాగార్జునరెడ్డి నేతృత్వంలోని మరొక బృందం ప్రధాన యాత్రలో చేరడానికి కదం తొక్కింది.
"ఈ యాత్రికు అప్పుడే 40 ఏళ్ల నిండాయా? నిన్నగా క మొన్న చేసినట్టు ఉంది" అని కడప నగరానికి చెందిన రాయలసీమ కార్మిక నేత సీహెచ్. చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్, కదిరి న్యాయవాది శ్రీధర్ తో కలిసి మదనపల్లె నుంచి సాగించిన పాదయాత్రను సీహెచ్ గుర్తు చేసుకున్నారు.
ఈ ఉద్యమ స్పూర్తి రాయలసీమలోని రైతులను, సంఘాలను కదిలించిందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో కాలు కదపడం అనేది పోరాట ఉధృతిని పెంచడానికి దోహదం చేసిందని సీహెచ్ అభిప్రాయపడ్డారు.
"ఆ పాదయాత్ర ఉద్యమకారులకు స్ఫూర్తి కలిగించింది. యలసీమకు ఎత్తిపోతల పథకం చాలా అవసరం" అని సీహెచ్ . చంద్రశేఖరరెడ్డి
ఆ తరువాతి నుంచి రాయలసీమ జలాల కోసం వివిధ వేదికల నుంచి గొంతుకలు బలంగా నినదించాయి. ఈ చారిత్రక ఘట్టంలో పోరాటంలో మమేకమైన తిరుపతికి చెందిన రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ ఆ నాటి జ్ణాపకాలు పంచుకున్నారు.
"ఆ రోజుల్లో రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి బ్యానర్ ప్రధాన పతాకంగా నిలిచింది. ఈ ఉద్యమం చేపట్టడానికి వైఎస్ఆర్ కు వ్యూహం అందించాను" అని భూమన్ చెప్పారు.
సాగునీటి ఉద్యమం సాగిన తీరుపై ఆయన ఏమన్నారంటే..
"వైఎస్. రాజశేఖరరెడ్డి సారధ్యంలో లేపాక్షి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తిరుపతి నుంచి మాజీ మంత్రి ఎంవీ.మైసూరారెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ.రమణారెడ్డి, మదనపల్లె నుంచి కదిరికి చెందిన న్యాయవాది శ్రీధర్, కడపకు చెందిన కార్మిక సంఘ నేత సీహెచ్. చంద్రశేఖరరెడ్డి, నేను పాదయాత్రలు ప్రారంభించాం. నవంబర్ 16వ తేదీ నంద్యాల వద్ద లక్ష మందితో నిర్వహించిన సభ రాయలసీమ నీటి హక్కుల పోరాటానికి నాంది పలికింది" అని భూమన్ వివరించారు.
"శ్రీశైలంలో పూర్తి నీటి సామర్థ్యం 885 అడుగులు ఉంటే రాయలసీమ సేద్యపు నీటి అవసరాలు తీరాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 45 వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు. 841 అగుడులకు మాత్రమే పరిమితమైన స్థితిలో ఏడు వేల క్యూసెక్కులకు మించి పారించే అవకాశం లేదు. ఆ పక్క తెలంగాణ 777 అడుగుల నుంచే నీటిని వాడేస్తుంటే, రాయలసీమ ప్రాంత రైతాంగ పరిస్థితి ఏమిటి" అని భూమన్ ప్రశ్నించారు.
తెరపైకి రాయలసీమ ఎత్తిపోతలు...
రాయలసీమకు శ్రీశైలం వరద జలాలు పారించే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్. జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తెరపైకి తెచ్చారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి వద్ద ప్రతిపాదించారు. శ్రీశైలంలో 97 అడుగులు నీరు ఉన్నా హంద్రీనీవా కాలువలోకి ఎత్తిపోయాలనే పథకానికి అప్పటి తెలంగాణ సీఎం కే. చంద్రశేఖరరావు అభ్యంతరం చెప్పడంతో వివాదం ఏర్పడింది. ఆ తరువాత పోతిరెడ్డిపాడు, బనకచర్ల మధ్య ఉన్న సంగమేశ్దర వద్ద రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసే పథకానికి నాంది పలికారు. దీంతో మహబూబ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం, తెలంగాణ ప్రభుత్వం కూడా జత కలవడం వల్ల 2020 అక్టోబర్ లో స్టే ఇచ్చిందని, తెలంగాణలోని అన్ని పార్టీలు కూడా అడ్డుపడ్డాయని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గుర్తు చేశారు.
అప్పటికే రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలకు నీరందించే ఈ పథకానికి 6,810 కోట్లు అవుతుందని అంచనాలు తయారు చేయడం, అందులో రూ.990 కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రస్తుతం ఈ పథకం అర్ధంతరంగా ఆగింది. ఈ వివాదాల నేపథ్యంలో కృష్ణా వాటర్ మేనేజిమెంట్ చేతిలోకి వెళ్లడం ఒకటైతే, కేంద్ర జలశక్తి మంత్రి, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ లో చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యంగా మారిందనేది తులసిరెడ్డి మాట.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో మాట్లాడి "రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను" అని ఇటీవల తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయంగా మంటలు రేపాయి. వైసీపీ, టీడీపీ కూటమి నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.
ఇది రాద్దాంతంలోకి వెళ్లే ముందు 40 ఏళ్ల తరువాత కూడా వరద జలాలు అని మాట్లాడుకోవడం విడ్డూరమే అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి వ్యాఖ్యానించారు.
పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్ ఆ నాటి ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య కాలంలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఎస్ఆర్ బీసీకి 11 వేల క్యూసెక్కులు కేటాయించారని దశరథరామిరెడ్డి గుర్తు చేశారు. ఆన ఏమంటారంటే..
"శ్రీశైలం ఆపరేషన్స్ మార్గదర్శకాలు అమలు చేయాలి" అని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకోవడానికి వైఎస్. రాజశేఖరరెడ్డి తూములు వెడల్పు చేయించారు. కాలువలు విస్తరించని స్థితిలో ప్రయోజనం ఏమిటి" అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా వారసత్వంగా పోటీ పడిన మాజీ సీఎం వైఎస్. జగన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విఫలం అయ్యారని ఆయన అన్నారు.
అవీ అక్రమ ప్రాజెక్టులే కదా..?
శ్రీశైలం ఎడమ కాలువ తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు ఉపయోగపడుతోంది. 885 అడుగుల నీటి సామర్థ్యం ఉండాల్సిన ఈ ప్రాజెక్టులో 817.15 అడుగుల నుంచే ఎడమ కాలువ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తోపాటు పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో 840 అడుగులు నీరు ఎలా నిలుస్తుంది? సీమ రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని తులసి రెడ్డి ప్రశ్నించారు
"రాయలసీమలో ఎత్తిపోతల పథకాలు అనుమతి లేని పథకాలు అంటున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాల పరిస్థితి కూడా అంతే. వారికి అక్కడి అవి ఎంత అవసరమో, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అంతే అవసరం" అని తులసిరెడ్డి తేల్చిచెప్పారు.