తిరుపతిలో మారిషస్ అధ్యక్షుడి ఆలయాల యాత్ర...
x
తిరుచానేరు పద్మావతీ అమ్మవారి ఊంజల్ సేవలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్

తిరుపతిలో మారిషస్ అధ్యక్షుడి ఆలయాల యాత్ర...

శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమలలో ధరమ్ బీర్ గోకుల్ పర్యటన ఇలా సాగింది..


తిరుపతి జిల్లాలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ రెండు రోజుల పర్యటన మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

రేణిగుంట విమానాశ్రయంలో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు స్వాగతం పలుకుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్

అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరిన మారిషస్ అధ్యక్షుడు శ్రీకాళహస్తికి చేరుకున్నారు.

శ్రీకాళహస్తి ఆలయంలో మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తిలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఆలయ ఈఓ టి. బాపిరెడ్డి స్వాగతించారు. అనంతరం శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దర్శించుకున్నారు.


శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో సంప్రదాయబద్ధంగా ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులచే తీర్థప్రసాదాలు అందజేశారు.


పద్మావతీ అమ్మవారి సేవలో..

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దర్శనం కోసం మంగళవారం సాయంత్రం మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ చేరుకున్నారు. ఆయనకు టీటీడీ జెఈఓ వి.వీరబ్రహ్మం,సి విఎస్ఓ కె.వి.మురళీకృష్ణ, జిల్లా ఎస్పి ఎల్.సుబ్బరాయుడు,తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్ మారిషస్ స్వాగతం పలికారు. వారితో కలిసి ఆలయంలోకి చేరుకున్న ధరమ్ బీర్ గోకుల్ శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆయనకు వేద పండితులు ఆలయ మర్యాదలతోవేద ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు అందించారు.

టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం ఆయనకు శ్రీవారు, పద్మావతీ అమ్మవారి చిత్రపటం జ్ణాపికగా అందించారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఊంజల్ సేవలో కూడా మారిషస్ అధ్యక్షుడు పాల్గొన్నారు.
తిరుమలలో బస

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తిరుచానూరు నుంచి బయలులేరారు. మంగళవారం రాత్రి తిరుమలలో బస చేసే ఆయన బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, అధికారులు స్వాగతించారు. తిరుమలలోని వీవీఐపీ అతిథుల పద్మావతీ అతిథి గృహాల ప్రాంగణంలో బస ఏర్పాట్లు చేశారు.
Read More
Next Story