రాజంపేట:చెన్నకేశవాలయంలో బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు
x

రాజంపేట:చెన్నకేశవాలయంలో బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు

నందలూరు సౌమ్యనాథుడి ఉత్సవాల ఏర్పాట్లపై కూడా టీటీడీ అధికారులు పరిశీలించారు.


పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మస్థలం కడప జిల్లా తాళ్లపాక గ్రామం. ఇక్కడి చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

నందలూరు వద్ద చోళరాజుల కాలంలో నిర్మించిన శ్రీసౌమ్యనాథస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై ఐదు నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం

కడప జిల్లాలోని ఈ ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, డిప్యూటీ ఈఓలు నటేష్ బాబు, శివప్రసాద్, ప్రశాంతి, డిఎఫ్వో ఫణికుమార్ నాయుడు, పట్టణీకరణ నిపుణులు రాముడు, అధికారులతో కలిసి జేఈఓ వి. వీరబ్రహ్మం బుధవారం సమీక్షించారు. తిరుపతి నుంచి వివిధ శాఖల అధికారులతో కలిసి వెళ్లిన ఆయన ఈ రెండు ఆలయాల వద్ద పరిశీలించారు.
"నందలూరు శ్రీసౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు జూలై నాల్గవ తేదీ, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై ఐదో తేదీన అంకురార్పణ జరుగుతుంది" అని జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు.
ఏర్పాట్లపై దృష్టి
కడప జిల్లా రాజంపేటకు సమీపంలోని నందలూరు, తాళ్లపాక ఆలయాల వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేయడానికి పరిశీలించారు. యాత్రికులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని టిటిడి జేఈవో వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. వాహన సేవలలో సమయ పాలన పాటించాలని కోరారు. ఆలయ పరిసరాల్లో రోజూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు దర్శనం, తాగునీరు, ప్రసాదాలు పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పుష్పాలంకరణకు ప్రాధాన్యత
నందలూరు, తాళ్లపాక ఆలయాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం మరింత శోభాయమానంగా మార్చడానికి పుష్పాలంకరణ చేయాలని టిటిడి జేఈవో వీరబ్రహ్మం ఆదేశించారు. విద్యుద్దీపాలంకరణలు కూడా అదే స్థాయిలో ఉండాలని గుర్తు చేశారు. ఆ మూడు ఆలయాల్లో కల్యాణోత్సవాలకు వచ్చే యాత్రికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాహన సేవలో భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Read More
Next Story