రాయలసీమ మరోసారి దగా పడింది...
x

రాయలసీమ మరోసారి దగా పడింది...

ప్రధాని మోదీ పర్యటన నిరాశ పరిచిందంటున్న రాయలసీమ సాగునీటి సాధన సమితి.


దేశంలోని 100 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కార్యక్రమం చేపట్టిన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం, ఆ కార్యక్రమం అమలు చేయ్యడంలో విఫలమైందని విమర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అదే పని చేశారని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

"కర్నూలు సభలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ అమలుపై ఒక్క మాట ప్రస్తావించపోవడమే నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన రాయలసీమ వాసులకు తీవ్ర నిరాశ కలిగించింది" అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..
కర్నూలు కృష్ణా వాటర్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని బుజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమిచెప్పారంటే...
" ఎనిమిదేళ్లుగా ప్రజలపై భారంగా జీఎస్టీ పన్నులు విధించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా స్వల్ప పన్ను తగ్గింపును “ప్రజలకు లాభం”గా ప్రదర్శిస్తూ “జీఎస్టీ – 2 వారోత్సవ ప్రారంభ సభ” ద్వారా ప్రధానమంత్రి ప్రచారం చేయడం ప్రజలను మోసగించే ప్రయత్నంగా ప్రజలు భావిస్తున్నారని దశరథరామిరెడ్డి విమర్శించారు.
ఈ ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరింత భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా రాయలసీమ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మూడు ప్రధాన తప్పిదాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఆయన గుర్తు చేశారు.
1. హైదరాబాదు రాజధానిని 10 సంవత్సరాలపాటు కొనసాగించకుండా తొందరపడి అమరావతికి తరలించడం,
2. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం స్వయంగా చేపట్టడం.
3. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి సంక్షేమ పథకాలు చేపట్టడం.
ఈ నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన వివరించారు.
ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించలేని స్థితి ఏర్పడిందని బొజ్జా పేర్కొన్నారు.
ఉదాహరణకు — ఏడు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న అలగనూరు రిజర్వాయర్ పునరుద్ధరణకు కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించడానికీ ప్రభుత్వానికి చేతగాకపోయిందని, రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులలో రెండు నుంచి పది శాతం పనులు పూర్తి చేయడానికి అవసరమైన 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయలేకపోయిందనీ.. ఈ కారణంగా 7 లక్షల ఎకరాల సాగునీటి సదుపాయం అందకుండా రైతులు నష్టపోతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారి పర్యటనకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కూడా, రాయలసీమ రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న కరువు, నీటి కొరత, వలస సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

లక్షలాది ప్రజల ఆకాంక్ష అయిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లను రాయలసీమలో ఏర్పాటుపై ప్రకటన రాకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ పట్ల చిత్తశుద్ధి లేదని మరోసారి బహిర్గతం అయిందని బొజ్జా ఘాటుగా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ఏ విధమైన ప్రకటన రాకపోవడం ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగించిందని బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు.


Read More
Next Story