
చిత్తూరు:జాగిలానికి గౌరవవందనం సమర్పిస్తున్న పోలీసులు
POLICE DOG | 'జాకీ'.. మాకోసం మళ్లీ పుడతావా...
అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలానికి అధికార లాంఛనాలతో కలకడలో తుదివీడ్కోలు పలికారు. తొమ్మిదేళ్లపాటు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంలో సేవలందించింది.
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డకట్ట వేయడానికి టాస్క్ ఫోర్స్ విభాగం పనిచేస్తోంది. ఈ విభాగంలో కడప జిల్లా (అన్నమయ్య జిల్లాలో) తొమ్మిదేళ్లు విశేష సేవలతో బంగారు పతకం సాధించిన పోలీస్ జాగిలం జాకీ గోల్డు అనారోగ్యంతో గురువారం సాయంత్రం చనిపోయింది. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కలగడ కేంద్రంగా ఈ పోలీస్ జాగిలం సేవలు అందిస్తోంది. పోలీస్ జాగిలం మృతికి ఆ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శ్రద్ధాంజలి ఘటించారు. కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో ఎర్రచందనం పసిగట్టడంలో పోలీస్ జాగిలం జాకీ కీలకంగా వ్యవహరించింది.
ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ లోకి రాకముందు శిక్షణలోనే బంగారు పతకం సాధించింది. ఈ జాగిలం ఎర్ర చందనం గుర్తించడంలో నేర్పరి. అనుమానం వచ్చిన చెక్ పోస్ట్ లలో తనిఖీలు నిర్వహించేది. పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విన్యాసాలతో చూపరులను ఆకట్టుకునేది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఉన్నతాధికారుల మన్ననలు పొందింది. 9 సంవత్సరాల పాటు జాకీ నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించింది. జాకీ చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ జిల్లా పోలీసులు నివాళులర్పించారు.
కలగడ పోలీస్ స్టేషన్ వద్ద జాగిలం జాకీకి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం.పెద్దయ్య, కలకడ ఇంచార్జి సీఐ. .ప్రసాదబాబు, ఆర్ ఎస్ఐ హాజరతయ్య, కలకడ పోలీసులు, ఏఆర్ పోలీసు సిబ్బంది, నివాళులర్పించారు. ముగ్గురు పోలీసులు తుపాకులతో గౌరవవందనం సమర్పించారు. ఈ సంఘటన పోలీసులనే కాదు. ప్రజలను కూడా కదిలించింది.
జాకీ నేపథ్యం..
2016 జనవరి 13వ తేదీ జన్మించింది. ఈ పోలీస్ జాగిలం "జాకీ” బెల్జియం మెలనాయిస్ జాతికి చెందింది. హైదరాబాదులోని మొయినాబాద్ లో ఐఐటిఎ, ఐఎస్డబ్ల్యూ. శిక్షణ కేంద్రంతో ఎర్రచందనం దుంగలు ఎక్కడ ఉన్నా పసిగట్టడంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ పోలీస్ జాగిలం జాకీకి హ్యాండ్లర్గా కడప ఏఆర్ కానిస్టేబుల్ ( పిసి-2317) జి. జైపాల్ కు 20.6.2016 జాన్ 20వ తేదీ అప్పగించారు. ఆయన ద్వారా హైదరాబాద్ లో ఈ పోలీస్ జాగిలం శిక్షణ తీసుకుంది. ఆ జాగిలానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనే విషయంలో కూడా కానిస్టేబుల్ జైపాల్ మరింత సుక్షితుడయ్యారు.
"జాకీ.. మమ్మల్సి వదిలి వెళ్లపోయావురా.. మా కోసం మళ్లీ పుడతావా?" అని
పోలీస్ జాగిలం జాకీ హ్యాండ్లర్ ఏఆర్ కానిస్టేబుల్ జి. జైపాల్, బాంబ్ స్క్వాడ్ ఇన్చార్జి కానిస్టేబుల్ అన్నా రవి, హెడ్ కానిస్టేబుల్ మణికంఠన్ కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీస్ జాగిలానికి పూలమాల వేసి, నివాళులర్పించే సమయంలో వారి వేదన ఎలా ఉందంటే, కుటుంబంలోని వ్యక్తి కానరాని లోకానికి వెళితే, ఎలా ఉంటుందో, అదే వాతావరణం కనిపించింది. ఖాకీ డ్రస్ వెనుక దయార్ధ హృదయం ఉంటుందనే విషయం ఇక్కడ కనిపించింది.
"అధికజ్వరం, పచ్చకామెర్లు సోకడం వల్ల మరణించింది" అని డాగ్ స్క్వాడ్ ఇన్ చార్జి మణికంఠన్, హ్యండ్లర్ జైపాల్ తెలిపారు. పులివెందులలోని సూపర్ స్పెషాలిటీ పశువైద్య ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యలోనే మరణించిందని హ్యాండ్లర్లు తెలిపారు.
పోలీసుల కంటే.. ముందే..
పోలీస్ విభాగంలో గూఢచారుల తరువాత డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ పాత్ర కీలకం. అందులో భాగంగానే ఎర్రచందనం అక్రమ రవాణా విభాగంలోకి రావడానికి ముందు పోలీస్ జాగిలం జాకీకి శిక్షణ ఇచ్చారు. ఇది కడప జిల్లాలో మూడేళ్ల పాటు సేవలు అందించింది.
జాకీ చనిపోయిన విషయం తెలిసి, అది అందించిన సేవలు తెలుసుకుందామని కలగడ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న హ్యాండ్లర్ జైపాల్ ను పలకరిద్దామని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి ఫోన్ చేశారు.
ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే, ఎవరు సార్ అని వినిపించిన గొంతులో ఏడుపు వినిపించింది.
"నా బిడ్డ లాంటి జాగిలం నన్ను వదిలి వెళ్లిపోయింది. సార్ నేను మాట్లాడలేను" అని అన్న రవికి ఫోన్ ఇచ్చేశారు.
రవి మాట్లాడుతూ, "తొమ్మిదేళ్ల పాటు మాతో మంచి స్నేహం ఏర్పడింది. ఒక రోజు మేము కనిపించకుంటే, జాకీ చూపించే ప్రేమ, ఎగిరి మీదికి దూకడం. మరిచిపోలేం" అని చెబుతూ ఉండగానే గొంతు బొంగరపోయింది.
డాగ్ స్వ్కాడ్ ఇన్ చార్జి మఠికంఠన్ టాస్క్ ఫోర్స్లో జాకీ విలువైన సేవలు అందించిందని చెప్పారు.
"ఓ చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నాయి. హ్యాండ్లర్ జైపాల్ చేతిలో జాకీ మెడకు వేసిన బెల్టు గొలుసును విదిలించుకుని ముందుకు దూకింది. వాహనంలో కనిపించకుండా దాచిన విషయాన్ని వాసన చూసి పసిగట్టి తన యజమానికి సంకేతం ఇచ్చింది. చెక్ చేస్తే, భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి" అని జాకీ హ్యాండ్లర్ ద్వారా తెలిసిందని వివరించారు.
Next Story