అంబేడ్కర్ విగ్రహం ఘటనపై   ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు
x

'అంబేడ్కర్ విగ్రహం ఘటన'పై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు

రాష్ట్రంలో పరిస్థితులు గాడి తప్పాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. దళితుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. అని వైఎస్ఆర్ సీపీ మాజీ మంత్రులు జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.


రాష్ట్రంలో పరిస్థితులు గాడి తప్పాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. దళితుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. అని వైఎస్ఆర్ సీపీ మాజీ మంత్రులు జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఫలకం ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ దళిత మాజీ మంత్రులు జాతీయ ఎస్సీ కమిషన్ ను కోరారు. ఎస్సీ కమిషన్ వ్యక్తిగతంగా సంఘటన ప్రదేశాన్ని పరిశీలించాలని కోరారు. తద్వారా దర్యాప్తు వేగవంతం చేసి, షెడ్యూల్డ్ కులాల వారి గౌరవం, హక్కులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శిలాఫలకం ధ్వంసం చేసిన సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని గురుమూర్తి వివరించారు.


వైఎస్ఆర్ సీపీ దళిత మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కూమార్ తో కలిసి తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకి బుధవారం ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
విజయవాడ స్వరాజ్ మైదానంలో మాజీ సీఎం వైఎస్. జగన్ మోహనరెడ్డి అంబేడ్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని సామాజిక న్యాయానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ విగ్రహానికి అమర్చిన శిలాఫలకం ధ్వంసం చేయడం ద్వారా షెడ్యూల్డు కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వారు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు పాల్పడిన వారికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నా కూడా నిందితులను గుర్తించడంలో ప్రభుత్వం నుంచి స్పందన లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వ మద్దతుతోనే ఈ దాడి జరిగిందని స్పష్టమవుతుందని వారు ఆరోపించారు.
"రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలన గాడి తప్పింది. శాంతిభద్రతలు క్షీణించాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల భద్రత ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అంబేడ్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసం చేయడంతో పరాకాష్టకు చేరాయి" అని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయ మహశిల్పం శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం అమానుషం. జాతీయ ఎస్సీ కమిషన్ జ్యోక్యం చేసుకొని విచారణ జరపాలి. అని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి విన్నవించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ముఖ్యంగా దాడి సమయంలో అనుమానాస్పదంగా లైట్లు ఆఫ్ చేయడం వంటి పరిస్థితులు ప్రభుత్వ ప్రమేయాన్ని బలంగా సూచిస్తున్నాయి అని అన్నారు. నిష్పాక్షికమైన విచారణ చేయడం, అంబేడ్కర్ విగ్రహానికి భద్రత కల్పించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు దర్యాప్తును అప్పగించాలని కోరారు.
Read More
Next Story