నెల్లూరు : చెత్త కుప్పలో నోట్ల కట్టలు
x

నెల్లూరు : చెత్త కుప్పలో నోట్ల కట్టలు

ఓ యువకుడి నిజాయితీ రైతు కన్నీళ్లు తుడిచింది.


వర్షాలు కురుస్తున్నాయి. పంటల సాగుకు ఓ రైతు నగలు కుదవపెట్టి రుణం తీసుకున్నాడు. మార్గమధ్యలో నగదుతో ఉన్న బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. నెల్లూరు జిల్లా పొదలకూరు వద్ద బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. కన్నీరుమున్నీరు అవుతూ ఆ రైతు ఇంటికి చేరాడు.

చెత్తకుప్పలో నోట్ల కట్టలతో ఉన్న బ్యాగును గమనించిన ఓ యువకుడు శుక్రవారం నిజాయితీగా పోలీసులకు అప్పగించాడు. దీంతో బాధిత రైతుకు ఆ నగదును అప్పగించిన సంఘటన ఇది.
నడిచి వెళ్లేటప్పుడు రూపాయి దొరికితే వదలడానికి మనసు అంగీకరించదు. నెల్లూరు జిల్లా పొదలకూరు వద్ద చెత్త కుప్పలో నోట్లకట్టలతో పాటు బ్యాంకు పాస్ పుస్తకం ఏటీఎం కార్డు దొరకడం కలకలం రేపింది. ఆ నోట్ల కట్టలను ఓ యువకుడు పోలీసులకు అప్పగించాడు. నిజాయితీ నిరూపించుకున్న యువకుడు ఓ రైతు కన్నీరు తుడిచాడు. ఆ యువకుడిని పోలీసులు సత్కరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..




నెల్లూరు జిల్లా పొదలకూరు సమీపంలో పంటల సాగు కోసం పొదలకూరు మండలం చెన్నారెడ్డి పల్లె కు చెందిన రామకృష్ణారెడ్డి అనే రైతు బ్యాంకులో నగలు తాకట్టు పెట్టాడు. బ్యాంకులో 86 వేల రూపాయలు రుణం తీసుకొని బ్యాగులో పెట్టుకున్నాడు. బైక్ లో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో.. పొదలకూరు బస్టాండ్ వద్ద ఉన్న బ్యాగు బైక్ పైన పెట్టినా రైతు పండ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈయనను గమనిస్తూ ఉన్న ఓ వ్యక్తి బ్యాగు తీసుకుని పారిపోయాడు. కేకలు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన నగలతో ఉన్న బ్యాగును పొదల్లో పారేసి వెళ్ళిపోయాడు.
ఈ విషయం తెలియని రైతు బోరున వినిపించుకుంటూ ఇంటికి వెళ్ళాడని తర్వాత తెలిసింది. పంటల సాగుకు తీసుకున్న డబ్బు పోయింది నగలు కుదవలో ఉన్నాయి. ఇంకెలా రా భగవంతుడా అని కన్నీరుమున్నీరు అవుతున్నట్లు తెలిసింది.
యువకుడి నిజాయితీ..
పొదలకూరు పట్టణంలో రెండు రోజుల కిందట ఓ రైతు నగదు పోగొట్టుకున్న విషయం వాట్సాప్ గ్రూపులో వైరల్ అయింది. పొదలకూరు మండలం శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కి పొదల్లో ఉన్న ఓ బ్యాగు శుక్రవారం దొరికింది. అందులో పరిశీలిస్తే, రూ. 200, 500 నోట్ల కట్టలు కనిపించాయి. అదే బ్యాగులో ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం కూడా ఉండడం సురేష్ గమనించాడు. బ్యాగుతో సహా పొదలకూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై మొహమ్మద్ హనీఫ్ కు అప్పగించాడు.రైతు నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు తో ఉన్న బ్యాగు చోరీకి గురైన విషయం పోలీసులకు ముందస్తుగానే సమాచారం ఉంది.
"సురేష్ తీసుకువచ్చిన బ్యాగులో పరిశీలిస్తే రూ. 86 వేల రూపాయల నగదు, రైతు ఏటీఎం కార్డు, పాస్ బుక్కు కనిపించింది" అని పొదలకూరు ఎస్సై హనీఫ్ మొహమ్మద్ చెప్పారు. బ్యాగులో దొరికిన పాస్బుక్ ఆధారంగా రైతు రామకృష్ణారెడ్డిని పిలిపించి నగదు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
"శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన సురేష్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి" అని ఎస్ఐ హనీ మహమ్మద్ సూచించారు.
"తనకు దొరికిన బ్యాగును నిజాయితీగా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి అప్పగించిన సురేష్ కు రూ. వెయ్యి రూపాయలు రివార్డు అందజేశాం" అని ఎస్సై హనీ తెలిపారు. రైతు నుంచి బ్యాగు చోరీ చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు.
Read More
Next Story