మళ్లీ ఉలిక్కిపడిన మదనపల్లె....
x

మళ్లీ ఉలిక్కిపడిన మదనపల్లె....

దేవుడంటే భక్తి. విశ్వాసం. స్వామీజీలంటే ఆమెకు వల్లమాలిన ప్రాణం. ఈ బలహీనత ఆ మహిళను ఏమి చేశాయి? మదనపల్లిలో ఇద్దరు యువకులు ఏం చేశారు?


ఓ మహిళ హత్యకు గురైంది. ఓ సీఐ తల్లికే రక్షణ లేకుండా పోయింది. అదృశ్యమైన ఆమె ఆచూకీ తెలుసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. పది రోజుల తరువాత ఆమె ఆమె శవమై తేలింది. దీని వెనుక జరిగిన కథ ఏమిటంటే..

మదనపల్లి చల్లటి ప్రదేశం. ఆహ్లాదకరమైన వాతావరణం. నేరప్రవృత్తి కలిగిన కొందరు దీనిని విచ్ఛిన్నం చేస్తున్నారు. తాజాగా, అదృశ్యమైన ఓ మహిళ 10 రోజుల తర్వాత శవమై తేలింది. తన తల్లి కనిపించడం లేదని ఓ సీఐ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో చోటు చేసుకున్న జాప్యం ఆ మహిళ నిండు ప్రాణం తీసింది. ఈ వివరాల్లోకెళ్తే ..

మదనపల్లె సమీపంలోని బండమీద కమ్మపల్లె (బీకేపల్లి) జగనన్న కాలనీలో స్వర్ణకుమారి (62) ఒంటరిగా నివాసం ఉంటుంది. శ్రీసత్య సాయి జిల్లా ధర్మవరం వన్ టౌన్ సీఐగా ఆమె కొడుకు నాగేంద్రప్రసాద్ పనిచేస్తున్నారు.

సెప్టెంబర్ 29: మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో "నా తల్లి స్వర్ణకుమారి ఆచూకీ తెలియడం లేదు" అని సీఐ నాగేంద్రప్రసాద్ ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి వారు దర్యాప్తు చేస్తున్నా అదృశ్యమైన స్వర్ణకుమారి జాడ తెలుసుకోలేకపోయారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు ఇతర బందోబస్తు నేపథ్యంలో కాస్త ఆలస్యం చేశారనే విషయం స్పష్టమవుతుంది. కాగా,
పూజలు భక్తి అంటే ఎక్కువ ఆసక్తి చూపించే స్వర్ణకుమారి బలహీనతను ఇద్దరు యువకులు ఆసరాగా చేసుకుని ఆమెను నమ్మించి హత్య చేశారు.. ఆమె ఒంటిపై ఉన్న నగలను కూడా చోరీ చేశారు అనే విషయం బయటపడింది.
"మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరమణ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే..
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి సమీపంలోని మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారికి, మదనపల్లి రూరల్ మండలం సీటీఎం (చిన్నతిప్పసముద్రం) ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కొడుకు ( నాగేంద్ర ప్రసాద్) పుట్టిన తరువాత మనస్పర్ధలతో భార్యాభర్తలు విడిపోయారు. దీంతో..
మదనపల్లె పట్టణంలో స్వర్ణ కుమారి ఒంటరిగా నివాసం ఉంటూ, కొడుకు నాగేంద్రప్రసాద్ చదివించింది. చదువులో మేటిగా ఉన్న నాగేంద్రప్రసాద్ క్రీడల్లో కూడా రాణించాడు. హాకీలో నైపుణ్యం కలిగిన ఆయన స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత ఆయనకు పెళ్లి కూడా జరిగింది. ఉద్యోగరీత్యా బదిలీలుఎక్కువగా ఉంటాయి. కొత్త ప్రదేశాల్లో ఇమడలేనని భావించిన స్వర్ణకుమారి మదనపల్లెలోని నివాసం ఉండేది. కొన్ని రోజులకు ఆమెకు బీకేపల్లి సమీపంలో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అక్కడే ఆమె నివాసం ఉంటోంది. ఆమె నివాసానికి ఎదురుగానే మేడికుర్తి ప్రాంతానికే చెందిన ఎల్లమ్మ, సురేంద్ర దంపతులు కూడా వచ్చారు. తెలిసినవారు కావడంతో వారితో స్వర్ణ కుమారి సఖ్యతగా ఉండేది. సురేంద్ర దంపతుల కొడుకు వెంకటేష్.
వయసు పైపడటంతో స్వర్ణ కుమారికి ఏదైనా సరుకులు తీసుకొచ్చి ఇవ్వాలన్న, పట్టణంలోకి తీసుకువెళ్లాలన్నా వెంకటేష్ సహాయకారిగా ఉండవాడని తెలిసింది. స్వర్ణకుమారి ఒంటరి మహిళ. ఆమె వద్ద ఉన్న నగలపై వెంకటేష్ కన్ను పడింది.
ఆమె బలహీనత..
స్వర్ణ కుమారికి పూజలు, పునస్కారాలు అంటే మక్కువ. స్వామీజీలు అంటే నమ్మకం. ఈ బలహీనతను ఆసరాగా తీసుకున్న వెంకటేష్ ఎలాగైనా నగలు కొట్టేయాలని భావించినట్లు ఉంది. "కాశీ నుంచి ఓ స్వామీజీ వచ్చారు. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు" అని స్వర్ణ కుమారిని వెంకటేష్ నమ్మించాడు.
సెప్టెంబర్ 29: స్వర్ణకుమారిని మదనపల్లెలోని నీరుగొట్టి వారి పల్లె సమీపంలో ఉన్న తన స్నేహితుడు అనిల్ ఇంటికి తీసుకెళ్లాడు. తీర్థమని చెప్పి అందులో నిద్ర మాత్రలు కలిపి తాగించినట్లు తెలుస్తోంది. ఆమె స్పృహ కోల్పోగానే, సుత్తితో తలపై కొట్టి చంపేశారని సమాచారం. ఆ తర్వాత స్వర్ణకుమారి ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసుకొని ఓ ప్రైవేటు బ్యాంకులో రూ. 4.50 లక్షలకు తనఖా పెట్టి, ఆ సొమ్మును వెంకటేష్ అనిల్ ఇద్దరూ పంచుకున్నారని తెలిసింది.


ఆ తర్వాత అనిల్ సాయంతో స్వర్ణకుమారి మృతదేహాన్ని మదనపల్లి లోనే అయోధ్యనగర్ వద్ద ఉన్న శ్మశాన వాటిక తీసుకువెళ్లి ఖననం చేశారు. ఆ తర్వాత వెంకటేష్ గత నెల 30వ తేదీ బెంగళూరుకు పారిపోగా, అనిల్ తన తల్లిని తీసుకొని రేణిగుంట విమానాశ్రయం నుంచి రాజస్థాన్ వెళ్ళాడని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే..
సీఐ ఫిర్యాదుతో..
ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో సందేహించిన ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తన తల్లి స్వర్ణకుమారి కనిపించడం లేదని "మదనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు" చేశారు. దీంతో మెల్లగా రంగంలోకి దిగిన పోలీసులు బండమీద కమ్మపల్లి వద్ద విచారణ చేపట్టారు. వెంకటేష్ పై సందేహంతో ప్రశ్నించినా, తనకు ఏమీ తెలియనట్టు బుకాయించాడని తెలిసింది. చివరిసారిగా అతని బైక్ లోనే స్వర్ణకుమారి వెళ్ళిందనే సమాచారం అందుకున్న పోలీసులు "తమదైన శైలితో విచారణ" చేశారు. దీంతో అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది. హత్య చేసిన స్వర్ణకుమారి మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేసిన స్థలాన్ని నిందితుల ద్వారానే పోలీసులు తెలుసుకున్నారు. దీంతో స్వర్ణకుమారి అదృశ్యం మిస్టరీ 12 రోజులకు వీడింది.
"స్వర్ణ కుమారి ఆభరణాలు కాల్ చేయడానికి నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు" అని మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరమణ ' ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు.
Read More
Next Story