
తిరుమలలో కియోస్క్ మిషన్ (ఫైల్)
టీటీడీ ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు కియోస్క్ మిషన్లు
శ్రీవాణి ట్రస్టు ఆలయాల నిర్మాణానికి రెండు డిజైన్ల తయారు చేయాలన్న ఈఓ
తిరుమల తరహాలోనే అనుబంధ ఆలయాల్లో కూడా యూపీఐ చెల్లింపులకు కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్స్ అందుబాటులోకి తీసుకుని రావాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దేశంలోని 60 టీటీడీ ఆలయాల్లో ఈ యంత్రాల ఏర్పాటుకు యాత్రికుల నుంచి సోమవారం అభిప్రాయాలు సేకరించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, గోవిందరాజస్వామి ఆలయాల్లో కూడా అమలు చేయడానికి వీలుగా యాత్రికులు ఏమని భావిస్తున్నారనే విషయంలో అభిప్రాయ సేకరణ చేయాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.
"దేశంలోని 60 టీటీడీ ఆలయాల్లో భక్తులు సులభంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయండి"అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించదలచిన ఐదువేల ఆలయాలకు అవసరమైన రెండు, మూడు డిజైన్లు సిద్ధం చేయాలని సీఈని ఆదేశించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.
తిరుపతిలోని వినాయక నగర్ వద్ద ఉన్న టీటీడీ స్టాఫ్ క్వార్టర్స్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.
టీటీడీ అనుబంధ అప్పలాయగుంట ఆలయం వద్ద భక్తులకు సమాచారం తెలిసేలా సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం లో ఉన్న కదిలే వంతెన మరమ్మతు పనులను వైకుంఠ ఏకాదశిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముంబైలోని బాంద్రా ఆలయంలో జేఈవో, చీఫ్ ఇంజనీర్,సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థానికాలయాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ఆయా ఆలయాల అభివృద్ధికి సంబంధిత అధికారుల తో సమన్వయం చేసుకుని సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కూడా టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పారు.
కర్ణాటక, బీహార్ అధికారులో సంప్రదించండి
కర్ణాటకలోని బెలగావిలో శ్రీవారి ఆలయం నిర్మాణం, బీహార్ లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపుపై శ్రద్ధ తీసుకోవాలని ఈఓ సింఘాల్ అధికారులకు గుర్తు చేశార. ఆ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ధార్మిక ప్రచురణలకు సంబంధించి ఇదివరకే ముద్రించిన పుస్తకాల పంపిణీ విషయంలో సూచనలకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ ప్రచురణల్లో బాగా డిమాండ్ ఉన్న పుస్తకాలను పాఠకుల అభిరుచి మేరకు పునర్ ముద్రణకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన జేఈవో వి. వీరబ్రహ్మంకు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీ&ఎస్వో మురళీకృష్ణ, ఎఫ్ఏ&సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ, డిప్యూటీ సీఎఫ్ ఫణి కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Next Story

