
తోతాపురిపై ఆంక్షలు: ప్రతీకారానికి ఆజ్యం.. హెచ్చరించిన కర్ణాటక సీఎం
చిత్తూరులో మామిడి కొనుగోలులో ఆంక్షలు విధించడంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఏపీ సీఎంకు లేఖాస్త్రాలు సంధించింది
అనుకున్నంత జరిగింది. తోతాపూరి మామిడి కొనుగోలుపై కర్ణాటక- ఆంధ్ర మధ్య వివాదం ఏర్పడింది. చిత్తూరులో మామిడి కొనుగోలుపై ఆంక్షలు ఏమిటని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఆ మేరకు కర్ణాటక సీఎం, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విడివిడిగా ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశారు.
"రాజ్యాంగ సహకార స్ఫూర్తి కి ఇది విరుద్ధం. ప్రతీకార చర్యలకు కూడా ఆజ్యం పోస్తుంది" అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక లాంటి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కారణం
"జిల్లాలోని రైతులు తీసుకువచ్చే మామిడికాయలు మాత్రమే తీసుకోవాలి. కర్ణాటక, తమిళనాడు నుంచి అనుమతించవద్దు" అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు చెక్పోస్ట్ ల వద్ద కూడా కాపలా ఉంచారు.
కర్ణాటక చీఫ్ సెక్రటరీ డాక్టర్ శాలిని రజనీష్ కూడా ఏపీ సీఎస్ ( AP Chief Secretary ) లేఖాస్తం అందించారు.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఉద్దేశించి రాసిన లేఖలో..
"చిత్తూరులో కర్ణాటక మామిడికాయలు కొనకూడదనే ఆంక్షలు రైతులకు నష్టం కలిగిస్తుంది" అని ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీస్, అటవీ, మార్కెటింగ్ విభాగాల అధికారులు మోహరించడంపై కర్ణాటక చీఫ్ సెక్రటరీ డాక్టర్ శాలిని రజనీష్ ఆక్షేపణ తెలిపారు.
"ఇది అంతర్ రాష్ట్ర వాణిజ్య సంబంధాలకు అంతరాయం కలిగించడమే కాదు. రైతులకు తీవ్ర నష్టం కష్టం కలిగిస్తుంది" అనే విషయాన్ని కర్ణాటక చీఫ్ సెక్రటరీ గుర్తు చేశారు.
ఆగ్రహానికి కారణం ఇదీ
చిత్తూరు జిల్లాలోని మామిడి తోటల నుంచి రైతులకు తీసుకువచ్చే కాయలు మాత్రమే గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలని, తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే దిగుబడిని అనుమతించవద్దని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తో కలిసి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఈనెల ఆరంభం నుంచి రైతు సంఘాల నాయకులు, జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో అనేక దఫాలు చర్చలు జరిపారు.
1. చిత్తూరు జిల్లాలోని తోటల నుంచి తీసుకొచ్చే కాయలు మాత్రమే కొనుగోలు కొనుగోలు చేయాలి.
2. కిలో మామిడికి 12 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి. రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు అంగీకరించకపోవడంతో మడత పేర్చి ఏర్పడింది. ఎట్టకేలకు మూడు రోజుల కిందట జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చొరవ తీసుకొని కిలో మామిడికి రూ. 12 మద్దతు ధరగా నిర్ణయించారు. ఇందులో నాలుగు రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే, మిగతా ఎనిమిది రూపాయలు పరిశ్రమల యజమానులు చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది.
చిత్తూరు జిల్లాలో 87,500 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతుంటే, దాదాపు 7.5 నుంచి 8 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు ఓ అంచనా. జిల్లాలో ప్రధానంగా చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, పీలేరు, తిరుపతి, నగరి ప్రాంతాల్లో తోటలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వెళ్లి కొనుగోలు చేసే వారు కొందరు ఉన్నారు. చిత్తూరు, తిరుపతి, పాకాల సమీపంలోని దామన్న చర్ల, పలమనేరు సమీపంలోని మండేల నుంచి ఇంకొందరు కొనుగోలు చేసి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో 47 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉంటే అందులో ఈ ఏడాది 15 మాత్రమే తెరిచారు. ఏడు పరిశ్రమలు మూతపడ్డాయి. మిగతావి తెరవడానికి సాహసించడం లేదనేది పరిశ్రమ వర్గాల సమాచారం. ఎందుకంటే, ఈ పరిశ్రమలకు 7 లక్షల టన్నుల మామిడికాయలు ప్రాసెస్ చేయగలిగినంత సామర్థ్యం ఉంది. దీనివల్ల ఏటా 3.5 లక్షల టన్నుల గుజ్జు దిగుబడి వస్తుంది.
కర్ణాటక దిగుబడిపై నిషేధం
" చిత్తూరు జిల్లాలో దిగుబడి అవుతున్న మామిడికాయలు మాత్రమే కొనాలి. కర్ణాటక నుంచి మామిడికాయలు తీసుకురానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి" అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
"చిత్తూరు జిల్లాలోకి తోతాపురి మామిడికాయల ప్రవేశంపై విధించిన నిషేధం ఉపసంహరించుకోండి" అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఎన్. చంద్రబాబుకు లేఖ రాసింది.
చిత్తూరుకు సమీపంలోని గంగాధర నెల్లూరు వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ఉంది. నగరానికి సమీపంలోనే గుడిపాల మండలం కర్ణాటక కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతాల నుంచి కర్ణాటక రైతులు రాకుండా నిఘా పెట్టాలనే జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదం రేకెత్తించింది. ఎలాగంటే..
చంద్రబాబుకు కర్ణాటక సీఎం లేఖ
కర్ణాటక నుంచి మామిడికాయలు చిత్తూరు జిల్లాలోకి తీసుకు రాకుండా అడ్డుకోవాలని నిర్ణయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు.
"చిత్తూరు జిల్లా అధికారులు తీసుకునే నిర్ణయాన్ని ఉపసంహరించండి" అని ఏపీ సీఎం ఎన్ చంద్రబాబుకు సిద్ధరామయ్య లేఖ రాశారు.
"ఆంధ్రప్రదేశ్ ఏకపక్ష నిర్ణయం వల్ల కర్ణాటకలోని మామిడి సాగుదారులకు తీవ్ర నష్టం కలిగించింది" అని సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జూన్ ఏడవ తేదీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి చేసిన ఆదేశాల్లో ఇతర రాష్ట్రాల నుంచి తోతాపిడి మామిడి పండ్లను దిగుమతి చేసుకోవడానికి నిషేధించారు ఈ విధానాన్ని అమలు చేయడానికి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వివిధ విభాగాల అధికారులు మోహరించిన విషయాన్ని సిద్ధరామయ్య తన లేఖలో ప్రస్తావించారు.
"చిత్తూరు లోని మామిడి గుజ్జు యూనిట్లకు పంటను విక్రయించడం కర్ణాటక రైతులకు ఆదాయ వనరు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కాంక్షలు కారణంగా వాణిజ్య లావాదేవీలకు విఘాతం ఏర్పడింది. రైతుల మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీసింది. రాజ్యాంగ సహకార సూత్రానికి ఇది పూర్తి విరుద్ధమైన ఏకపక్ష నిర్ణయం" అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాసిన లేఖలో ఘాటుగా వ్యాఖ్యానించారు ఇది రాష్ట్రాల మధ్య ప్రతీకార చర్యలకు దారితీస్తాయని కూడా ఆయన హెచ్చరించారు.
కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రజల మధ్య స్నేహ సంబంధాలు ఎక్కువ. ప్రభుత్వాలు కూడా సామరస్యంగానే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తుంటాయి. అది ఫెడరల్ స్ఫూర్తి.
ఏనుగుల కట్టడికి సహకారం
చిత్తూరు జిల్లా అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు దగ్గర ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మూడు రాష్ట్రాల కూడలి. పడమటి తాలూకాలు కుప్పం, పలమనేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు ఆ తర్వాత చంద్రగిరి వరకు మామిడి తోటలో సాగు ఎక్కువ. కర్ణాటక నుంచి ఏనుగుల మందలు ఈ ప్రాంతంలో తిష్ట వేయడం, పంటలు నష్టం కలిగించడం పరిపాటిగా మారింది. అడవిగున్న ఏనుగులను కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.
"చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల కట్టడికి, సుక్షిత కుంకి ఏనుగులు కావాలి" అని పవన్ కళ్యాణ్ కోరారు. నెలల వ్యవధిలోనే కర్ణాటక విధాన సౌధ వద్ద ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారధ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ఆరు కుంకి ఏనుగులను బహుకరించారు. అవి పలమనేరు వద్ద 4, తిరుపతి జూ పార్క్ కు రెండు ఏనుగులు చేర్చారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం ఉండాల్సిన అవసరాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది. ఇది చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉద్యానవన, ఆహార ధాన్యాలు పండించే రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు.
ఏడాదికి ఒకసారి మాత్రమే దిగుబడి వచ్చే మామిడికాయల సీజన్లో పరిస్థితి ఒక్కో ప్రాంతంలో ఒక విధంగా ఉంటుంది. కర్ణాటకలోని గుర్తు పరిశ్రమలు తెరవని కారణంగా అక్కడి రైతులకు ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. దీంతో అక్కడి రైతులు సమీపంలో చిత్తూరు జిల్లాలోని మామిడి దిగుబడి తీసుకురావడానికి ఆంక్షల ప్రతిబంధకంగా మారాయి. దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Next Story