కడప:కవల పిల్లలను మింగేసిన నీటి సంప్
x

కడప:కవల పిల్లలను మింగేసిన నీటి సంప్

కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.


మామిడితోట వద్ద కాపలా ఉన్న కుటుంబంలోని ఇద్దరు కవల పిల్లలు రామ, లక్షణుడు నీటి తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన కడప జిల్లా చక్రాయపేట మండలం వద్ద సోమవారం వెలుగు చూసింది.

"ఈ సంఘటన రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం వెలుగు చూసింది" అని చక్రాయపేట ఎస్ఐ జే. చంద్రశేఖర్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. వివరాల్లోకి వెళితే..

కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన యానాది (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన ఆ కవల పిల్లల పేర్లు రామ, లక్షణుడు. చిన్ననాడే దురదృవశాత్తూ తండ్రిని కోల్పోయారు. వారిద్దరి ఆలనా పాలన మేనమామ చూసుకుంటున్నారు. ఇదిలాఉంటే..

సంచార జీవనం సాగించే ఎస్టీ వర్గంలోని ఈ యానాది కుటుంబం చక్రాయపేట మండలం బాలతిమ్మయ్యగారిపల్లె వద్ద మామిడి తోట వద్ద కాపలాకు కుదిరింది. కవల పిల్లలు రామ, లక్ష్మణులు కూడా మేనమామ వెంట వచ్చారు. కొన్ని రోజులుగా అక్కడే అందరి కలిసి ఉంటున్నారు. మామిడితోట వద్ద ఉన్న నీటి సంప్ వద్ద ఆడుకుంటూ ఉన్నారో? లేక ఈతకు దిగారనేది స్పష్టత లేదు. వారిద్దరు ఆ నీటి సంపులో పడిపోయారు. రాత్రంతా కనిపించని పిల్లలు, సోమవారం ఉదయం నీటి సంపులో శవాలై కనిపించారు. ఈ సంఘటనతో బాలతిమ్మయ్యగారిపల్లె వద్ద విషాదం ఏర్పడింది.
మామిడి తోట వద్ద ఇద్దరు పిల్లలు మరణించిన విషయం సోమవారం ఉదయం సమాచారం అందిందని ఎస్ఐ చంద్రశేఖర్ చెప్పారు. వెంటనే సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించాం. బాలుర మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ వివరించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.
Read More
Next Story