
కుప్పంలో దారుణం: రోడ్డు పక్కనే ఓ మహిళను చెట్టుకు కట్టేసిన దృశ్యం
కుప్పంలో మరో ప్రతిఘటన
అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశారు. బిడ్డ ఏడుస్తున్నా కనికరించలేదు. వీడియో తీసి పైశాచికానందం పొందారు.
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భర్త చేసిన అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి, అమానవీయంగా వ్యవహరించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
భర్త అప్పు చేసి పారిపోయాడు. అతను భార్యను చెట్టుకు కట్టేసారు. తన తల్లికి జరుగుతున్న అవమానాన్ని రాయిపై కూర్చుని చూస్తున్న కొడుకు దుఖం పెల్లుబికింది. ఇలా ఎందుకు చేస్తున్నారో ఆ బిడ్డకు అర్థం అయ్యే వయసు కాదు. ఏదో జరుగుతోందిన తెలుస్తోంది. తన తల్లిని కట్టేయడం మాత్రమే అర్థం చేసుకున్న ఆ బిడ్డ గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. అయినా అప్పు కోసం వేధిస్తున్న వారి మనసు కరగలేదు. రోడ్డుపై వాహనాలు నిలిపి మరీ చోద్యం చూస్తున్న వారు కూడా అడ్డు చెప్పిన దాఖలాలు కనిపించలేదు. మహిళను చెట్టుకు కట్టేసే సమయంలో వీడియో చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందారు. అప్పు చెల్లించకుంటే ఏం చేయాలని కూడా కొందరు మహిళలు ఆ వీడియోలో ప్రశ్నిస్తూ ఉండడం కనిపించింది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ అమానవీయ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది.
తన నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చిత్తూరు ఎస్పీని ఆదేశించారు. ఈ వివరాల్లోకి వెళితే,
కుప్పంలో రోడ్డు పక్కనే మహిళను చెట్టుకు కట్టేసిన దృశ్యం.
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేశాడు. ఆ అప్పుల భారం భరించలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ, బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తున్నారు. సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకున్నారు.
"నీ భర్త తీసుకున్న డబ్బు చెల్లించు" అని శిరీషతో వాగ్వాదానికి దిగారు. ఆమె చెప్పేది ఏమాత్రం వినలేదు. మునికన్నప్ప ఆయన భార్య, కోడలు శిరీషను నిర్బంధించారు. రోడ్డు పక్కనే అందరూ చేస్తుండగానే, తాడుతో చెట్టుకు కట్టేశారు. మునికన్నప్ప కోడలు జగదీశ్వరి తాడును చెట్టుకు చెడుతూ, శిరీషను దుర్భాషలాడారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా ఈ సంఘటనను చూస్తూ ఉండడం మినహా అడ్డుచెప్పిన వారు లేరు.
బిడ్డ ఏడుస్తున్నా...
తల్లి శిరీషను చెట్టుకు కట్టేస్తుండడం చూసి కొడుకు గుక్కపెట్టి ఏడుస్తున్నా, అప్పు కోసం వేధిస్తున్న వారిలో ఏమాత్రం మానవత్వం కనిపించలేదు. శిరీషను దూషిస్తూ, ఉండడం కనిపించింది. ఇదే సమయంలో ఓ వ్యక్తి ఈ వ్యవహారాన్ని వీడియో చిత్రీకరిస్తున్నాడు. మహిళను చెట్టుకు కట్టేస్తుండగా, వీడియో తీస్తున్నారని తెలిసినా మునికన్నప్ప ఏమాత్రం వెనక్కు తగ్గకుండా, వారి వాదన వారిదిగానే కనిపించింది.
శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీఎం సీరియస్
కుప్పం నియోజకవర్గంలో జరిగిన అమానవీయ ఘటన సమాచారం సీఎం చంద్రబాబుకు తెలిసింది. తన నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుతో మాట్లాడారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఎస్పీని ఆదేశించారు. బాధితురాలు శిరీష కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Next Story