
ధర్మవరం: తాడిమర్రిలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాాఖా మంత్రి సత్యకుమార్
Health Department | ఆరోగ్య శాఖలో 8000 పోస్టుల భర్తీ చేస్తాం..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ విషయం చెప్పారు. ధర్మవరంలో రెండు బ్లాక్ పబ్లిక్ యూనిట్లను ప్రారంభించారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
"రాష్ట్రంలో 2,600 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించాం. త్వరలోనే మరో 8000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం" అని ప్రకటించారు. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రిలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, తహసీల్దార్ కార్యాలయ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు.
వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తో సిబ్బంది
రాష్ట్రంలో 168 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మంజూరైతే ధర్మవరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా రెండు యూనిట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు కార్పొరేట్ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి డయాగ్నోస్టిక్ సామగ్రిలో 3200 ఐటెమ్స్ ఉన్నాయని తెలిపారు. 6 CT స్కానర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కర్నూలులో రూ.24 కోట్లతో లీనాక్స్ పరికరం సహాయంతో స్టేట్ క్యాన్సర్ సెంటర్ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్రం సహకారంతో..
రాష్ట్రంలో విలేజ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి 3,336 భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, సీఎం ఎన్. చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్నాయని అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో 10 కొత్త బోర్లు వేసినట్లు, రూ.3 కోట్ల వ్యయంతో 87 సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. చిత్రావతి జలాశయం ముంపు బాధితులకు రూ.9.5 కోట్లు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. శివంపల్లి, పినదరి గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, తాడిమర్రి బాలుర హాస్టల్ భవనం మరమ్మతులకు రూ.14 లక్షలు మంజూరుచేసిన విషయాలను వివరించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, డిఎంహెచ్.ఓ ఫైరోజ్ బేగం, ఆర్డీవో మహేష్, ఎమ్మార్వో భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో రంగారావు, డివై.డిఎంహెచ్ఓ సెల్వి సల్మాన్, డాక్టర్స్ హరిత, గోవర్ధన్ నాయుడు పాల్గొన్నారు.
Next Story