Liquor scam | చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్రహింసలు పెట్టారు..
x
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గన్ మన్, తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి

Liquor scam | చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్రహింసలు పెట్టారు..

మాజీ ఎమ్మెల్యే గన్ మన్ ఒకరు డీజీపీకి లేఖ రాయడం సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం ఆయన తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు.


రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న లిక్కర్ స్కాం వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెన్టిగేషన్ టీం ( Special Investigation Team SIT ) చంద్రగిరి వైసీపీ ( YCP ) మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై దృష్టి సారించింది. ఆయనకు గతంలో గన్ మన్ (GUNMAN) గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచారు. తనను చిత్రహింసలకు గురి చేశారని మదన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాలను వివరిస్తూ, డీజీపీకి ఆయన స్వయంగా లేఖ రాశారు.


ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ( Sri Venkateswara Institute of Medical Sciences- SVIMS ) ఆస్పత్రిలో చికిత్సఆయన తీసుకుంటున్నారు. డీజీపీకి మదన్ రెడ్డి లేఖ రాయడంతో తిరుపతి ఏఆర్ (Tirupati Armed Reserve ) పోలీస్ అధికారులు సోమవారం ఆయనను పరామర్శించి వెళ్లారు. సిట్ బృందంలోని పోలీసు అధికారులు కొట్టిన దెబ్బలతో ఆస్పత్రిలో చేరినట్లు మదన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఆరురోజుల పాటు విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తరువాత తిరుపతికి వచ్చానని, ఆయన లేఖలో వివరించారు.

చెవిరెడ్డిపై ఫోకస్
లిక్కర్ స్కాంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్. జగన్ ఓఎస్డీగా కృష్ణమోహనరెడ్డి, భారతి సిమెంట్స్ బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీల మూలాలు శోధించడానికి మాజీ ఎమ్మెల్యే అనుచరులను సిట్ పోలీస్ అధికారులు విచారణకు పిలిచారు. ఆ విధంగా నోటీసు అందుకుని వెళ్లిన తనను చిత్రహింసలకు గురి చేశారని మదన్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా ఆయన పనిచేస్తున్నారు.
చెప్పినట్లు రాయలేదని కొట్టారు...
విచారణలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ రాయించుకోవడానికి సిట్ అధికారులు తీవ్రంగా కొట్టారని మదన్ రెడ్డి ఆరోపించారు. "ఆ దెబ్బలకు తాళలేక విజయవాడలో ఆరు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాను. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేరి, చికిత్స చేయించుకుంటున్నాను. విచారణ పేరిట నన్ను చిత్రహింసలకు గురి చేశారు," అని మదన్ రెడ్డి డీజీపీకి రాసిన లేఖలో ఆరోపించారు.

"అవాస్తవాలు తాను చెప్పలేను అన్నందుకు బూతులు తిట్టి నరకం చూపించారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖలో ఏముందంటే..
"నన్ను సిట్ అధికారులు తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేశారు. చిత్రవధకు గురిచేశారు. పోలీసు యూనిఫాంలో ఉన్నా, పిడి గుద్దులతో శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశారు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

"విచారణకు ఎప్పుడు వచ్చినా యూనిఫాం తీసి తమ వద్దకు రావాలి. అని ఆదేశించారు. నేను యూనిఫాంతో వచ్చినందుకు బండ బూతులు తిట్టి, కొట్టారు" అని డీజీపీకి వివరించారు. తాను మరోసారి సిట్ అధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తే ఒంటరిగా వెళ్లనని, ఒక వేళ వెళ్లాల్సి వచ్చినా తనను కొట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ లేఖలో ప్రాదేయపడ్డారు.
చెవిరెడ్డి అనుచరుల విచారణ
లిక్కర్ స్కాంలో విచారణ సాగిస్తున్న సిట్ పోలీస్ అధికారులు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరులకు నోటీసులు జారీ చేశారు. అందులో ఇప్పటి వరకు చెవిరెడ్డి గన్‌మెన్‌ గిరి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. మరో గన్‌మెన్‌ మదన్‌ను విచారణకు పిలిపించారు. ప్రస్తుతం ఈయన తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చెవిరెడ్డి సన్నిహితులు వెంకటేష్‌నాయుడు, అతని కుటుంబీకులను కూడా విచారణ చేసినట్లు తెలిసింది.
"బాలాజీ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు నరకం చూపారు" అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. తనకు ఏపీ లిక్కర్‌ స్కాంతో సంబంధం ఉంది. అలా స్టేట్ మెంట్ ఇవ్వమని ఒత్తడి తెస్తున్నారు" అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు.


Read More
Next Story