
మాజీ ఎమ్మెల్యే 'తోపుదుర్తి' ఆచూకీ ఎక్కడ?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాషరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం.
అనంతపురం జిల్లా రాప్తాడు వైసిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సమాచారం ముందుగానే పసిగట్టిన వైఎసీపీ ( YSR CP ) ఎమ్మెల్యే తోపుదుర్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ ( Anticipatory bail ) మంజూరయ్యే వరకు కనిపించకుండా ఉండాలని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు ద్వారా తెలిసింది.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లెలో ఆ పార్టీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల అంటే ఏప్రిల్ 8వ తేదీ హెలికాప్టర్లో బెంగళూరు నుంచి సికె.పల్లెకు చేరుకున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైసిపి నాయకులు భారీగా జన సమీకరణ చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా 1100 మంది పోలీసులను బందోబస్తుకు నియమించినట్లు ఆ జిల్లా ఎస్పీ రత్న నియమించారు. అయినా, భారీగా జన సమీకరణకు దిగిన వైఎస్ఆర్సిపి నాయకులు సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగే సమయానికి, వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు. దీంతో బారికేడ్లు ధ్వంసం చేసిన పార్టీ కార్యకర్తలు హెలికాప్టర్ వద్దకు చేరుకోవడం, వారి అత్యుత్సాహంతో హెలికాప్టర్ రెక్కలు కూడా దెబ్బతిన్నాయి.
కేసు నమోదు..
పాపిరెడ్డిపల్లి వద్ద మాజీ సీఎం వైఎస్. జగన్ వచ్చిన హెలికాప్టర్పై జరిగిన దాడి, సంఘటనలపై పోలీసులు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో పాటు ఇంకొందరు వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ని అరెస్టు చేయడానికి రామగిరి సీఐ శ్రీధర్, సికె పల్లి ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. అనంతపురం పట్టణంలో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసం వద్దకు బుధవారం అర్ధరాత్రి పోలీసులు వెళ్లారని తెలిసింది. ఇంట్లో ఉన్న తోపుదుర్తి తండ్రి ఆత్మరామిరెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారు.
తన కుమారుడు ఎక్కడికి వెళ్ళింది తెలియదని ఆత్మరామరెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రకాష్ రెడ్డి ఆచూకీ తెలుసుకునేందుకు ఆయన సెల్లో సంప్రదించడానికి పోలీసులు ప్రయత్నించారు. అప్పటికే సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసుల సందేహిస్తున్నారు.
రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డి పల్లె హెలిపాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై నమోదైన కేసు కు సంబంధించి ముందస్తు మెయిల్ కోసమే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పైలెట్ కు నోటీసులు
మాజీ సీఎం వైయస్ జగన్ ను తీసుకువచ్చిన హెలికాప్టర్ పైలెట్ అనిల్ కుమార్ కు రామగిరి పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. విఐపి ప్రయాణించిన హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతిన్నది అని చెప్పిన పైలెట్లు మళ్లీ టేక్ ఆఫ్ ఎలా తీసుకున్నారనే విషయంలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీంతో విచారణకు రావాలని పైలట్ అనిల్ కుమార్ కు నోటీసులు జారీ చేసినట్లు రామగిరి సీఐ శ్రీధర్ చెప్పారు.
Next Story