
శ్రీవారి ఆలయంలో 30న పుష్పయాగం
తిరుమలలో 29వ తేదీ ఆర్జిత సేవలు రద్దు..
తిరుమలలో ఈ నెల 29వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. 30వ తేదీ శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. దీంతో అంతకుముందు రోజు సహస్రదీపాలంకార సేవ రద్దు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30వ తేదీ గురువారం పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. దీనికోసం అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించే 30వ తేదీ ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడవీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
Next Story