Tirumala: సవాళ్ల మధ్య భద్రతాధికారి బాధ్యతలు
x
తిరుమల ఆలయ ధ్వజస్తంభం వద్ద సీవీఎస్ఓ కేవీ. మురళీకృష్ణ

Tirumala: సవాళ్ల మధ్య భద్రతాధికారి బాధ్యతలు

టీటీడీలొ నాలుగు నెలల తరువాత పూర్తిస్థాయి సీవీఎస్ఓగా బాధ్యతలు స్వీకరించారు.


రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల. ఇక్కడ కొంతకాలమైనా పనిచేయాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావిస్తారు. అనేక సవాళ్ల మధ్య టీటీడీ సీవీఎస్ఓగా కేవీ. మురళీకృష్ణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆయన రంగనాయకుల మండపంలో సీవీఎస్ఓగా బాధ్యతలు స్వీకరిస్తూ, ఉత్తర్వులపై సంతకం చేశారు. గతంలో ఆయన తిరుమల, తిరుపతిలో కూడా అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది.
తిరుమల, అలిపిరి వద్ద ఇటీవలి కాలంలో తరచూ తలెత్తిన భద్రతా వైఫల్యాలు, చోటుచేసుకున్న ఘటనలు టీటీడీ ప్రతిష్టకు మసకపూశాయి. శాంతిభద్రతల విభాగంలో గతానుభవం ఉన్న ఐపీఎస్ అధికారి మురళీకృష్ణకు సీవీఎస్ఓగా అనేక సమస్యలు పరిష్కరించే బాధ్యత ఉంది. వాటిని ఆయన ఎలా పరిష్కరిస్తారనేది వేచిచూడాలి.
2025 జనవరి 8: టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విషాధ ఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ సాధారణ టైంస్లాట్ టోకెన్లు రద్దు చేసింది. ఆ స్థానంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు జారీ చేయడానికి తిరుపతిలో పది కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఒక రోజు ముందుగానే బైరాగిపట్టెడ హైస్కూల్, ఆర్టీసీ బస్గాండు సమీపంలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద టికెట్ల జారీకి గేట్లు తెరవడంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. సంఘటన జరిగిన ప్రదేశాన్ని సీఎం ఎన్. చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ మరుసటి రోజే వేర్వేరుగా సందర్శించడమే కాకుండా, తీవ్ర గాయాలతో చికిత్స తీసుకుంటున్న యాధిత యాత్రికులను కూడా పరామర్శించారు. వారికి పరిహారం కూడా ప్రకటించి, కొన్ని రోజల వ్యవధిలోనే టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, ఎమ్మెల్యేల ద్వారా ఆయా ప్రాంతాలకు వెళ్లి చెక్కులు కూడా అందించారు. ఇదే రోజు దుర్ఘటన జరగడానికి బాధ్యతగా తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తోపాటు ఐపీఎస్ అధికారి అయిన టీటీడీ సీవీఎస్ఓ ఎస్. శ్రీధర్ ను బదిలీ చేశారు. ఆయన 2024 ఆగష్టు7వ తేదీ బాధ్యతలు స్వీకరించారు. అతి తక్కువగా ఐదు నెలల్లోనే ఆయన బదిలీ కావడం ప్రస్తావనార్షం.
నాలుగు నెలల తరువాత భర్తీ
టీటీడీలో భద్రతా విభాగాలను సమన్వయం చేయడానికి ఐపీఎస్ స్థాయి అధికారిని సీవీఎస్ఓగా నియమిస్తున్నారు. ఆ కోవలోనే ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీవీఎస్ఓగా ఉన్న ఎస్. శ్రీధర్ ను బదిలీ చేశారు. అప్పటి నుంచి మొదట చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు, తరువాత తిరుపతి ఎస్పీ హర్షవర్ణన్ రాజు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల తరువాత విశాఖపట్టనం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్ కేవీ. మురళీకృష్ణను గత నెలలో సీవీఎస్ఓగా నియమించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ఆయన తిరుమల ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
సవాళ్ల మధ్య బాధ్యతలు...
టీటీడీలో అనేక సవాళ్లు నూతన సీవీఎస్ఓ మురళీకృష్ణపై ఉన్నట్లు ఇటీవల జరిగిన సంఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా తిరుమలకు ప్రధాన ద్వారంగా ఉన్న అలిపిరి చెక్ పాయింట్ వద్ద తరచూ స్కానింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. విజిలెన్స్ విభాగంలో నియమించుకున్న ఎక్స్ ఆర్మీ ఉద్యోగులతో పాటు మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా నియమించుకున్న యువకులు కొందరు వేరు ఉద్యోగాలు రావడం వల్ల మనేశారు. ఎస్పీఎఫ్ ( Special Protection Force SPF ) సిబ్బందిపై భారం పడినట్లు తెలుస్తోంది. దీంతో సరిగ్గా తనిఖీలు చేయని స్థితిలోనే తిరుమల కొండపైకి మాంసాహారం తీసుకుని వెళ్లడం, తిరుమలలో నమాజ్ చేయడం వంటి ఘటనలకు ఆస్కారం కలిగినట్లు భావిస్తున్నారు.
రాజకీయ కేంద్రం
గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల క్షేత్రాన్ని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు. చిన్నపాటి ఘటన జరిగినా, దానికి రాజకీయ రంగు పులిమి, నిత్యం తిరుమలను వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. వేసవి సెలవులు కావడం వల్ల ఇటీవల ఓ యాత్రికుడు క్యూలో వెళుతూ, నినాదాలు చేయడం వివాదమైంది. ఆయన వైసీపీ నేత అంటూ వివాదం తెరపైకి తెచ్చారు. ఓ పథకం ప్రకారం ఈ తరహా కార్యక్రమాలకు తెరతీస్తున్నారని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ పక్కకు ఉంచితే, భద్రతా పరంగా తీసుకోవాల్సని అనేక కీలక అంశాలపై సీవీఎస్ఓ దృష్టి సారించాల్సిన అవసరమని తిరుమలలోని పరిస్థితులు చెబుతున్నాయి.
తిరుమల ఆలయంలో వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించిన సమయం హాయిగా ఉంటుంది. సామాన్య యాత్రికులను దర్శనానికి అనుమతించే సమయంలో విజిలెన్స్ విభాగంలోని కాంట్రాక్టు సిబ్బంది నోరు, చేతి దురుసు ప్రదర్శిస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయనేది యాత్రికుల నుంచి వినిపిస్తున్న ఆరోపణలు. అంటే, విజిలెన్స్ సిబ్బందిని మరింత పెంచడం తోపాటు పర్యవేక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.
కనిపించని గుర్తింపు కార్డులు
"తిరుమల ఆలయం లేదా వెలుపల పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కనిపించేలా ధరించాలి" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇది అమలు జరుగుతున్న తీరు మాత్రం కనిపించడం లేదు. మెడలో ట్యాగ్ ఉంటుంది. కార్డు జేబులో ఉంటుంది. దురుసుగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయాలన్నా, వారి పేర్లు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం విజిలెన్స్ సిబ్బంది కంటే, టీటీడీ ద్విగువశ్రేణి సిబ్బంది, అధికారుల వద్దే కనిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read More
Next Story