
భూములు సేకరించి సిద్ధం చేయండి
ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా..వినోద కార్యకలాపాల ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎకో సిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ది కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ లు హాజరయ్యారు. ఎస్ఐపీబీ సమావేశానికి సీఎస్ కె.విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది. పరిశ్రమలు–వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ప్రాజెక్టులు ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీ లో 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
కదనరంగానికి కదులుతున్న ‘విశాఖ బిడ్డ’ విశాఖలో ఉన్న హిందూస్థాన్ షిఫ్ యార్డ్ లో పుట్టి దేశీయ అద్భుతం
**********
పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధంగా కార్యకలాపాలు వచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రత్యేకించి సర్వీసు సెక్టార్ కూడా వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్నారు. శ్రీశైలంలో దేవాలయంతో పాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంత మందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.