
తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపు.
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి మంగళవారం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో టీటీడీ చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. తిరుమలలోని శేషగిరులలో వరాహ పురాణం ప్రకారం 66 కోట్ల తీర్థాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా ఉంది. చక్రతీర్థ ముక్కోటి సందర్భంగా ప్రత్యే పూజలు నిర్వహించడం ఆనవాయితీ.
శ్రీవారి ఆలయం నుంచి ప్రదర్శన
శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాలతో ఆలయం నుంచి చక్రతీర్థం వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ శ్రీచక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం చేశారు. ఆతరువాత పుష్పాలంకారం చేసి, హారతి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
చరిత్ర ఇదీ..
చక్రతీర్థ ముక్కోటికి కూడా చారిత్రక నేపథ్య కథనం ఉంది. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మహావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీసుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందింది.
చక్రతీర్థ ముక్కోటి సందర్భంగా అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యర్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story

