Minister Nara Lokesh | టీడీపీకి క్యాడరే అధిష్టానం
x

Minister Nara Lokesh | టీడీపీకి క్యాడరే అధిష్టానం

పదవుల పంపిణీకి కొత్త విధానం తీసుకువస్తాం. ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలతో కలవడానికి ప్రాధాన్యం ఇస్తా అని మంత్రి లోకేష్ ప్రకటించారు.


పనిచేసే వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈ పద్ధతిలో సాంకేతికతతో పనితీరును మదింపు చేసి, గుర్తించిన వారికి పదవులు ఉంటాయని రాష్ట్ర మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షుడి నుంచి బూత్ ఇంఛార్జ్, బూత్ కమిటీ సభ్యుల వరకు "కుటుంబ సాధికార సారధి" (Family authority figure- KSS) నమోదు కావాల్సి ఉంటుందని వెల్లడించారు.

తిరుపతి నియోజకవర్గ పర్యటనలో బుధవారం మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు.

టీడీపీ కోటి సభ్యత్వంతో అతిపెద్ద కుటుంబంగా మారడానికి కార్యకర్తే అధినేత అని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా మొదట కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. అంతకుముందు బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్ లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు, నాయకులతో ఎక్కువ సమయం కేటాయిస్తా అని చెప్పారు.
పనిచేసే వారిని ప్రోత్సహిస్తా
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు,సీఎం ఎన్. చంద్రబాబు మా అందరికీ పదేపదే చెప్పేది ఒక్కటే.. "ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడి క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులను కలిసి మాట్లాడాలి" అని చెప్పారు. "బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆదేశించారు" అని లోకేష్ గుర్తు చేశారు. అందులో భాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు నేను సగం రోజు మీతో గడుపుతున్నాను.
పదవుల పంపిణీకి కొత్త విధానం
పార్టీ, ప్రభుత్వం రెండూ అనుసంధానమై ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. దీనికోసం పార్టీలో నూతనంగా క్లస్టర్, యూనిట్, బూత్ విధానాన్ని తీసుకుని వచ్చాం. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు.. "అన్నా నేను కష్టపడ్డాను.. నన్ను గుర్తించడం లేదు" అని చాలా మంది నాతో చెప్పారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తా, పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. పార్టీ లేకపోతే మనం ఎవరూ లేము అని గుర్తుంచుకోవాలి. ఇవాళ మనకు సమాజంలో గౌరవం లభిస్తోందంటే అందుకు కారణ తెలుగు దేశం పార్టీనే అన్నారు.
కార్యకర్తలకు అండగా
ఎన్నికల్లో గెలిచాం, తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి. మంగళగిరిలో నేను 91వేల మెజార్టీతో గెలిచా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నా. బాధ్యత పెరిగింది. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడాలి. అలకలు మానుకుని నాయకులు సమిష్టిగా పనిచేయాలి. గత ఐదేళ్లలో మనం అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. అక్రమ కేసులు పెట్టారు, లాఠీఛార్జి చేశారు. అవన్నీ మర్చిపోకూడదు. ఇది మన కుటుంబం. పార్టీలో సంస్కరణల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా. పార్టీలో పొలిట్ బ్యూరో ఉంటుంది. అందులో చర్చ జరగాలి. తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మంగళగిరిలో లక్ష సభ్యత్వాలు చేశాం. శాశ్వత సభ్యత్వాలు దాదాపు 180 వరకు చేశాం.
సాంకేతికతో మదించి పదవులు
తిరుపతిలో ఆశించిన స్థాయిలో సభ్యత్వం లేదు అని మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కష్టపడాలి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు పనిచేశారా అనేది తెలుసుకుని వారికే పదవులు ఇస్తాం. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. త్వరలో నూతన విధానం తీసుకువస్తున్నాం. జాతీయ అధ్యక్షుల వారి నుంచి బూత్ ఇంఛార్జ్, బూత్ కమిటీ సభ్యుల వరకు అందరం కుటుంబ సాధికార సారధిలో(కేఎస్ఎస్) నమోదు కావాల్సి ఉంటుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ పదవి కావాలన్నా, నామినేటెడ్ పోస్టు కావాలన్నా కేఎస్ఎస్ లో ఉండాలి. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా 120 మంది ఓటర్లతో కూడిన కేఎస్ఎస్ ను కలవాలి, వారికి చెప్పాలి. కేఎస్ఎస్ కార్యక్రమం తర్వాత క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లను నియమిస్తాం. అనంతరం గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు నియమిస్తామని చెప్పారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టండి
పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కలిసి కట్టుగా పనిచేయాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. మన లక్ష్యం ఒక్కటే పార్టీ బలోపేతం కావాలి. అందుకు అహర్నిశలు కష్టపడాలి. ఈ రోజు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచాం. అని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారనేది ఆయన మాటల్లో..
జగన్ రెడ్డికి వెయ్యి పెంచడానికి నాలుగున్నరేళ్లు పట్టింది. నేడు మనం వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, వికలాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తి వికలాంగులకు రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో ఈ స్థాయిలో ఎక్కడా పెన్షన్ అందించడం లేదు. అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసింది టీడీపీనే. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఏప్రిల్, మే నెల నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుచేస్తామని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైంది? సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, ఏమైంది? ఇవన్నీ మనం మాట్లాడాలి. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. జగన్ రెడ్డి అన్నీ అప్పులు చేసి పోయారు. అయినప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం, పెన్షన్ అందిస్తున్నాం, టీఏ, డీఏ బకాయిలు చెల్లిస్తున్నాం. వైసీపీ నేతలు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను, మనల్ని ఇబ్బంది పెట్టారు. తప్పుచేసిన వారిని పద్ధతి ప్రకారం చట్టపరిధిలో శిక్షిస్తాం.
పార్టీ సుప్రీం.. కూటమిని కలుపుకోండి..

పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన కర్తవ్య బోధ చేశారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా జయప్రదం చేయాలి. కూటమి నేతలను కలుపుకుని పోవాలి. ఏదైనా సమిష్టిగా చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. నాకు పార్టీ సుప్రీం. పార్టీ లేకపోతే యువగళం లేదు, లోకేష్ లేడు. నాకు పదవులు ముఖ్యం కాదు. పార్టీని బలోపేతం చేసేందుకే నేను ఇక్కడ ఉన్నాను. అందుకే కార్యకర్తలను కలుస్తున్నాం. నేను ఏ నియోజకవర్గానికి వెళ్లినా కార్యకర్తలతో సమావేశమవుతా. క్లస్టర్, యూనిట్, బూత్ లను బలోపేతం చేయాలి. నేను 80శాతం సమయం కార్యకర్తలు, నాయకులను కలిసేందుకు కేటాయిస్తున్నా. నాయకులు కార్యకర్తలను కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించాలి. పార్టీకి సమయం కేటాయించాలి. కార్యకర్తలకు ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా రూ.5 లక్షలు చేశాం. త్వరలో కార్యకర్తల ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందు పార్టీ కేంద్ర కార్యాలయంలో కేరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటుచేస్తాం. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు లేరు. నాకు ఉన్నది కోటి మంది పార్టీ కుటుంబ సభ్యులు. మీకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా. అనంతరం తిరుపతి కార్పొరేటర్లతో మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు.
Read More
Next Story