తిరుమలలో కార్యాలయాలన్ని ఒకే గొడుకు కిందకు..
x
తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ బీఆర్. నాయుడు, హాజరైన సభ్యులు.

తిరుమలలో కార్యాలయాలన్ని ఒకే గొడుకు కిందకు..

శ్రీవారి క్షేత్రంలో యాత్రికుల కోసం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.


కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాలు అందించాలని నిర్ణయించారు. దీనికోసం 4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.

తిరుమలకు పెరుగుతున్న యాత్రికుల సంఖ్య నేపథ్యంలో మూడో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి కమిటీని నియమించారు.
తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అనంతరం టీటీడీ ఈఓ జే. శ్యామలరావు తో కలిసి చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాకు వివరించారు.

నిర్ణయాలు ఇవీ...
1. శ్రీవారిసేవను మరింత విస్తృత పరిచి భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు 4 కోఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు ఆమోదం.
2 . తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం. అదేవిధంగా తిరుమలలో పాత బడిన హెచ్వీడీసీలోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలని నిర్ణయం.
3. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం.
4. తిరుమలలో భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు (లాంజ్ లు) ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం.
5 . అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతవరణం పెంపొందించడం.
6 .తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని అధికారులకు ఆదేశం.
7 .తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం.
తీపి కబురు: ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయం.
రాష్ట్రం వెలుపల
ఆలయాల నిర్మాణం: రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్య‌యం రూ. 10 లక్షల నుంచి 20 ల‌క్ష‌ల‌కు పెంపుదల.
5 .రాష్ట్ర దేవాదాయశాఖ సూచనల మేరకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీలుగా విభజన. మూడు కేటగిరీల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒకే కేటగిరీ కింద రూ.10 లక్షలు చెల్లించే విధానంలో మార్పు.
సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయం. ఒక్కొక్క మైక్ సెట్ ఖర్చు రూ.25 వేలు.
శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వివిధ దేశాల్లో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై టీటీడీ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

వేద ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవదాయశాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం.

తాళ్లపాక : పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన రాజంపేట సమీపంలోని తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని నిర్ణయం.

కడపలో వేల సంవత్సరాల చరిత్ర గల శివాలయం అభివృద్దికి నిధులు మంజూరు.

తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ( AI ) టెక్నాలజీ అమలుకు విధానపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. దీనిపై రెండు ప్రముఖ సంస్థలు కసరత్తు చేస్తున్నాయని తెలిపారు. త్వరలో ఏఐ అమలు చేసి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పిస్తాం అని ఆయన వివరించారు.

టీటీడీలో హిందూయేతర ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని బీఆర్ నాయుడు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పార. అన్యమత ఉద్యోగుల పై నిఘా పెట్టాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. టీటీడీ నియమ నిబంధనలు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

Read More
Next Story