శ్రీవారి క్షేత్రాన్ని దేవలోకంగా మార్చిన పువ్వులు...
x
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆకట్టుకుంటున్న ప్రదర్శన

శ్రీవారి క్షేత్రాన్ని దేవలోకంగా మార్చిన పువ్వులు...

27వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం. రామాయణం, యుగాల పురాణ కథలు వివరిస్తున్న ప్రదర్శన


తిరుమల కలియుగ వైకుంఠం. వరుస విశేష పర్వదినాలతో శ్రీవారి క్షేత్రం దేవలోకంగా మారింది. ఫల, పుష్పాలతో రామాయణ ఘట్టాలు ఆవిష్కరించారు. ఈ ప్రదర్శన యాత్రికులను రామాయణ కాలం నాటి చరిత్రను కథలుగా చెబుతోంది. ప్రకృతిలోని పువ్వుల తోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు శ్రీవారి ఆలయం ఎదుట మరో లోకాన్ని ఆవిష్కరించాయి. సీతారాముల వారి చరిత్రను కళ్లముందు ఆవిష్కరించడంలో టీటీడీ ఉద్యానశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

27వ తేదీ శ్రీరామనవమి ఆస్థానం

ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా తిరుమలలో శ్రీరామపట్టాభిషేకం ఉత్సవం నిర్వహించనున్నారు. ఆ రోజు శ్రీవారి సన్నిధిలో ఆస్థానం నిర్వహిస్తారు. బంగారు వాకిలికి సమీపంలోని గరుడాళ్వార్ సన్నిధిలో రాత్రి తొమ్మిది గంటల నుంచి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. దీనికి ముందు సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. ఆస్థానం సందర్భంగా వేదపండితులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామ జనన ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు.

రాముడి అవతారం
తిరుమల ఆలయం వెలుపల గొల్లమండపం సమీపంలో ఫల, పుష్పాలతో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. గద, చేతిలో విష్ణుచక్రం ధరించిన నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శ్రీవారి ఆలయం లోపల పుష్పాలంకరణ మధుర వాసనలు విరజిమ్ముతోంది. ఆలయం వెలుపల కూడా రామాయణ ఘట్టాలను వివరించే చిన్నికృష్ణుడు, రాముడు, మాహా విష్ణువును పోలిన విగ్రహాలు యుగాల నాటి చరిత్రను కథలుగా చెబుతున్నాయి. మూడు యుగాలకు (కృత, త్రేత, ద్వాపర) చెందిన ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


తిరుమలలో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువయ్యారనేది చారిత్రక కథనం. తిరుమలలో ఉగాది పండుగతో ఈ ఏడాది ఉత్సవాలకు నాంది పలికారు. ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి వేడుక నేపథ్యంలో శ్రీవారి క్షేత్రంలో ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకం కూడా శ్రీవారి సన్నిధిలో అదే రోజు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక సందర్భాల నేపథ్యంలో ఆలయం వెలుపల గొల్లమండపం సమీపంలో రామాయణ ఘట్టాలను వివరిస్తూ, ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన యాత్రికులను ఆకట్టుకుంటోంది.


"ఉగాది, శ్రీరామనవమి పండుగల నేపథ్యంలో శ్రీవారి ఆలయం, వెలుపల పది టన్నుల పుష్పాలు, పత్రాలు, పండ్లతో అలంకరించాం" అని టీటీడీ ఉద్యానవన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు చెప్పారు.

ఉగాది వేడుక దాదాపు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద అలంకరించారు. సుమారు 60 వేల కట్‌ ఫ్లవర్స్‌ వినియోగించినట్టు టీటీడీ ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసులు చెప్పారు.

ఎన్ని రూపాలో...


కృష్ణుడి లీలలు: గోవుల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం ఆకర్షణగా నిలిచింది.


మామిడి చెట్టు కింద బాలకృష్ణుల ఆటపాటలు, అల్లరిని గుర్తు చేస్తున్నాయి.


శ్రీవారి ఆలయం ఎదుట రామాయణ ఘట్టాలు మరింత ఆకర్షణగా కనిపిస్తున్నాయి. సీతారాముల వారు అరణ్యవాసాన్ని వివరించే ఘట్టం కళ్లకుకట్టినట్లు వివరించడంలో టీటీడీ ఉద్యానవన విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

నమ్మినబంటు ఆంజనేయుడికి సీతారాములవారు కర్తవ్య బోధ చేస్తున్న దృశ్యం అద్భుతంగా తీర్చిదిద్దారు. అడవిలో వనవాసం చేస్తున్న సీతారాముల వారు పొదరింటి బయట సంభాషణ ఘట్టం ఆ రామాయణం చదవకుండానే కథ చెప్పినట్టుగా కళాకారులు చాతుర్యం ప్రదర్శించారు.
Read More
Next Story