
టీటీడీ ట్రస్టులు ఊతం.. పేదరోగులకు ప్రాణదానానికి సహకారం..
రూ. రెండు కోట్లు విరాళం అందించిన విశాఖ, బెంగళూరు పారిశ్రామికవేత్తలు.
తిరుమల శ్రీవారి ద్వారా పేద రోగులకు ఆరోగ్య సేవలు అందించడానికి పారిశ్రామికవేత్తలు విరాళాలతో సహకారం అందిస్తున్నారు. ఆదివారం టీటీడీ ట్రస్టులకు రెండు కోట్ల రూపాయలు అందించారు.
పేదరోగులకు ప్రాణదానం..
టీటీడీ తిరుపతిలో ఏర్పాటు చేసిన స్విమ్స్ ఆస్పత్రి ద్వారా పేద రోగుల కోసం ఎస్వీ ప్రాణదాన ట్రస్టు నిర్వహిస్తోంది. ఈ ట్రస్టుకు విశాఖపట్టణానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం 1,01,25,000 విరాళం డీడీని అందించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత దేవి ఫిషరీస్ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ విరాళం డీడీని ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందించారు. శ్రీవారి ఆలయ రంగనాయకుల మండపంలో పేష్కార్ కు అందించారు. వారికి ఆలయ వేద పండితులు వేదాశీర్చచనం కూడా అందించారు.
దివ్యాంగుల కోసం
తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న బర్డ్ ఆస్పత్రి కూడా అత్యంత కీలకమైంది. దివ్యాంగులకు శస్త్రచికిత్స చేయడంతో పాటు పరిశోధన, పునరావాస సంస్థగా సేవలు అందిస్తోంది. రాష్ట్రం నుంచే కాకుండా, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఎముకల శస్ర్తచికిత్సల కోసం దివ్యాంగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వారికి సేవలు అందించాలని కోరుతూ బెంగుళూరుకు చెందిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఆ సంస్థ ఎండీ వీణ్ ఎస్.నాయర్ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. శ్రీవారి దర్శనం తరువాత వారికి వేదాశీర్వచనం అందించారు.

