
Update |కుటుంబీకులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి
ఒంటిమిట్టి కోదండరాముడికి ఏడోసారి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం సమీపంలోని అతిథి గృహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. ఆయన వెంట భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్ కూడా ఉన్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు
సమర్పించనున్నారు. దీనికోసం గట్టి భద్రత మధ్య భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి కోదండరామాలయం వద్దకు వచ్చిన ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఆ తరువాత ఆలయంలోకి వెళ్లిన ఆయనకు వేదపండితులు పరివట్టం కట్టారు. వెండిపళ్లెంలో ఉంచిన పట్టువస్త్రాలను నెత్తిన పెట్టుకుని శ్రీకోదండరామాలయంలోకి వెళ్లారు.
ఏకశిలామూర్తి సీతారామ, లక్షుణుడి మూలమూర్తుల వద్దకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టువస్త్రాలతో బయలుదేరగానే, వెంట ఉన్న ఆయన భార్య నారా భూవనేశ్వరి వెెండి పళ్లెంలో పండ్లు, పూలు, మనవడు మరో వెండి పళ్లెంలో పసుపు, కుంకుమ తీసుకుని అనురసించారు. మందీమార్బలం లేకుండా, ప్రశాంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి వెళ్లారు.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం వద్ద శ్రీరామ శ్రీరామనవమి వేడుకలను 2016 నుంచి రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు. శ్రీరామ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలోని రాములవారికి ముఖ్యమంత్రి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.

