ప్రియుడితో కలిసి భార్యే భర్తను మట్టు పెట్టించింది...

హనీమూన్ పేరిట మేఘాలయకు తీసుకువెళ్లి భర్తను చంపిన భార్య ఉదంతం మరవక ముందే గద్వాల్ జిల్లాలో నవ వధువు తన భర్తను ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించింది.;

Update: 2025-06-26 10:04 GMT
సర్వేయర్ హత్య కేసు వివరాలు చెబుతున్న గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు

హనీమూన్ పేరిట భర్త రాజాను భార్య సోనమ్ మేఘాలయకు తీసుకువెళ్లి తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ముగ్గురు హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మరవక ముందే, అలాంటి ఘటనే జోగులాంబ గద్వాల్ జిల్లాలో వెలుగుచూసింది. గద్వాల్ పట్టణానికి చెందిన ప్రైవేటు సర్వేయర్ గంటా తేజేశ్వర్ ను కొత్తగా పెళ్లాడిన ఐశ్వర్య తన ప్రియుడు వి. తిరుమలరావుతో కలిసి సుపారీ గ్యాంగ్ సహాయంతో హత్య చేయించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ రెండు ఘటనల్లోనూ భార్యలే ప్రియుల సహాయంతో భర్తలను హత్య చేయించడం విశేషం.




నిశ్చితార్థం , పెళ్లి
కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు తేజేశ్వర్ తో డిసెంబర్ నెలలో నిశ్చితార్థం జరిగినది. ఆ తర్వాత మే 18వతేదీన వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి అయ్యాక బ్యాంక్ మేనేజరైన ప్రియుడు తిరుమల రావుకు, ఐశ్వర్య లకు అక్రమ సంబంధం కొనసాగించడం కష్టమైంది.దీంతో వారిద్దరూ పరిచయం ఉన్న వారికి సుపారీ ఇచ్చి తేజేశ్వర్ ను హత్య చేయించాలని ప్రణాళిక వేసుకున్నారు.

మొదట అదృశ్యం కేసు నమోదు
గద్వాల్ పట్టణానికి చెందిన తన తమ్ముడు, ప్రైవేటు సర్వేయర్ గంటా తేజేశ్వర్ రోజూ మాదరిగానే డ్యూటీకి వెళ్లి కనిపించడం లేదని, తన తమ్ముడి బైక్ గద్వాల్ ఫాతిమా ఐటీఐ కళాశాల వద్ద నిలిపి ఉందని అతని అన్న గంటా జయరాముడు గద్వాల్ పట్టణ పోలీసులకు జూన్ 17వతేదీన ఫిర్యాదు చేశాడు.తన తమ్ముడి గురించి తన బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకీ లభించలేదని తన ఫిర్యాదులో జయరాముడు పేర్కొన్నాడు. దీంతో గద్వాల్ పట్ణణ ఎస్ఐ కల్యాణ్ మిస్సింగ్ కేసు కింద 61(1),103(1),140(1),238 బీఎన్ఎస్ కింద జూన్ 18వతేదీన క్రైం నంబరు 134 తో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.



సీసీటీవీ ఫుటేజి పట్టించింది...
సర్వేయర్ తేజేశ్వర్ ను కొందరు వ్యక్తులు కారులో తీసుకువెళ్లారని సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. దీంతో జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ వై.మొగిలయ్య,గద్వాల్ సి.ఐ టంగుటూరి శ్రీను, గద్వాల్ పట్టణ ఎస్సై కల్యాణ్, రూరల్ ఎస్సై, గట్టు ఎస్సై లతో ప్రత్యేక బృందాలను ఎస్పీ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీరికి తేజేశ్వర్ ను కారులో తీసుకువెళ్లిన సీసీటీవీ ఫుటేజీ లభించడంతో క్లూ దొరికింది. భార్య ఐశ్వర్య తరచూ తన ప్రియుడు తిరుమలరావుతో వీడియో కాల్స్ మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డులు లభించడంతో అసలు అక్రమ సంబంధం బాగోతం వెలుగు చూసింది. దీనికి తోడు భర్త హత్యకు గురైనా భార్య ఐశ్వర్య బాధ పడక పోవడం,సాధారణంగానే ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ బాగోతం బయటపడిందని గద్వాల్ పట్ణణ ఎస్ఐ కల్యాణ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తల్లీకూతుళ్లతో నిందితుడికి అక్రమ సంబంధం
కర్నూల్ పట్టణానికి చెందిన కెన్ ఫిన్ మేనేజరు తిరుమలరావుకు అప్పటికే పెళ్లి అయింది. కెనరా బ్యాంక్ కు అనుబందంగా పని చేసే కెన్ ఫిన్ హోమ్ లోన్ లిమిటెడ్ బ్యాంక్ మేనేజర్ గా ఉంటూ తన ఆఫీస్ లో పని చేసే స్వీపర్ సుజాత కు హౌసింగ్ లోన్ ఇప్పించి, ఆమెకు అవసరమైన ఆర్థిక అవసరాలు తీర్చి ఆ పరిచయంతో స్వీపర్ తోను, ఆమె కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు.

తేజేశ్వర్ హత్యకు నిందితుడి పథకం
తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఐశ్వర్యకు తేజేశ్వర్ తో పెళ్లి కావడంతో అతన్ని ఎలాగైనా హతమార్చి అడ్డు తొలగించుకోవాలని నిందితుడు తిరుమల రావు పథకం పన్నాడు.తిరుమల రావు కుమ్మరి నగేష్ తో తేజేశ్వర్ ని ఏమైనా చేయాలి, అని చెప్పి బాధితుడు తేజేశ్వర్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు.కుమ్మరి నగేష్ తేజేశ్వర్ తో పొలాల గురించి మాట్లాడి పరిచయం పెంచుకొని సన్నిహితంగా ఉంటూ అదును చూసి పరుషరాముడుతో కలిసి హత్యకు నిందితుడు సుపారీ ఇచ్చాడు.

తేజేశ్వర్ తో పరిచయం పెంచుకొని...
సుపారీ తీసుకున్న కుమ్మరి నగేష్,పరుషరాముడు లు తేజేశ్వర్ కు ఫోన్ చేసి తాము కర్నూల్ లో హోమ్ లోన్ ఏజెంట్ లు గా పని చేస్తున్నామని, మీ దగ్గర ఏవైనా పొలాలు ఉంటే మేం కొనుగోలు చేస్తామని చెప్పారు. మీకు కూడా కమిషన్ ఇస్తామని చెప్పగా, అందుకు తేజేశ్వర్ సరే అన్నాడు. తరువాత రెండు రోజులకు తేజేశ్వర్ నిందితులకు ఫోన్ చేసి పొలాలు ఉన్నాయని, మీరు గద్వాల కు రండి అని చెప్పాడు. వెంటనే వారు ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు తిరుమల రావు కు చెప్పి ఖర్చులకు డబ్బులు వేయించుకొని అద్దెకు కారు తీసుకొని గద్వాల్ కు రాగా తేజేశ్వర్ వారికి వారి కారులో వెళ్లి గద్వాల్ చుట్టూ అమ్మకానికి ఉన్నా భూములు చూపి తిరిగి పంపాడు.

బైక్ కు జీపీఎస్ ట్రాకర్ పెట్టి...
తేజేశ్వర్ కదలికలను గుర్తించేందుకు ఆయన బైక్ కు నిందితులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాగే రెండు మూడు రోజులకు ఒకసారి తేజేశ్వర్ కు కాల్ చేసి భూములు ఉన్నాయా అని అడుగుతూ అప్పుడప్పుడు కారులో వచ్చి చూసి పోయేవారు.పెళ్లికి వారం ముందు తేజేశ్వర్ ను హత్య చేసేందుకు రాగా తేజేశ్వర్ ఎక్కడెక్కడో ఉన్నానని చెప్పడంతో వారు తెలుసుకోలేక పోయారు. దీంతో తిరుమల రావు కు తెలుపగా అప్పుడు ఆన్ లైన్ లో జీపీఎస్ ట్రాకర్ ఆర్డర్ చేసి కుమ్మరి నగేష్, పరుషరాముడులకు ఇవ్వగా వారు ఒక రోజు రాత్రి గద్వాల్ కు వచ్చి తేజేశ్వర్ బైక్ కు కింది బాగంలో టేపు చుట్టి అమర్చారు.

నిందితులకు కమీషన్ ఇప్పించి...
తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తిరుమలరావు సుపారీ తీసుకున్న నిందితులు ఏ 3-కుమ్మరి నగేష్, ఏ4- పరుషరాముడు లు రుణాలిచ్చిన ఇళ్లను అమ్మించి వారికి కమీషన్ ఇచ్చి పరియం పెంచుకున్నాడు. గతం లో కారుడ్రైవర్ గా పని చేసి ప్రస్తుతం కిరాయికి ఆటోలు నడుపుతూ బ్యాంక్ ఏజెంటుగా పనిచేసేవాడు.

సర్వే పేరిట తేజేశ్వర్ ను కారులో తీసుకువెళ్లి...
సర్వే పేరిట తేజేశ్వర్ ను కారులో తీసుకువెళ్లిన నిందితులు వెనుక సీటులో నుంచి వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత రక్తపు మరకలు ఉన్న దుస్తులు విప్పేసి కాల్వలో పడేసి ముందుగా తెచ్చుకున్న కొత్త బట్టలు ధరించారు. మృతదేహాన్ని గాలేరు నగరి కాల్వలో శవాన్ని పడేసి తిరిగి వచ్చారు. మేఘాలయ వరుడి హత్య కేసులో లాగా తాము దొరక కూడదని హంతకులు చర్చించుకున్నారు.

నిందితుల అరెస్ట్
డీఎస్పీ వై.మొగిలయ్య స్వీయ పర్యవేక్షణలో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతికనైపుణ్యం ఆదారంగా నిందితులను గుర్తించి గురువారం 5:00 గంటల సమయంలో పుల్లూరు చెక్ పోస్టు దగ్గర నిఘా ఉంచి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు కారులో హైదరాబాద్ కు పారిపోతుండగా అరెస్టు చేశామని గద్వాల పోలీసులు చెప్పారు.

నిందితుల నుంచి వేటకొడవళ్లు స్వాధీనం
అందించిన సమాచారం ఆధారంగా హత్యకు సహకరించిన ఏ2 ఐశ్వర్య ను గద్వాల్ లో, ఏ6 ను జమ్మిచేడు లో, ఏ7, ఏ8 లను కర్నూల్ లో పోలీసులు అరెస్టు చేసి నిందితుల నుంచి కారు, రెండు కొడవళ్లు, కత్తి, 10-మొబైల్ ఫోన్లు, నగదును స్వాదినం చేసుకున్నారు.అనంతరం మెజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడం లో ప్రతిభ చూపిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీకాంత్, ధరూర్ ఎస్సై కొండా శ్రీ హరి, మల్దకల్ ఎస్సై నందికర్, గట్టు ఎస్సై మల్లేష్, ఐ‌టి సెల్ ఎస్సై సుకూర్, పి.ఎస్సైలు స్వాతి, తేజేశ్విని, సిబ్బందిని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు క్యాష్ రివార్డ్ తో ప్రత్యేకంగా అబినంధించారు.



Tags:    

Similar News