బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోను: రేవంత్
ఈ బిల్లు కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం రావాలని కోరుతున్నామని, వివాదాలకు తావు లేకుండ బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.;
బీసీ రిజర్వేషన్ల సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏడాదిలోగా బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ వేదికగా చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానన్నారు. కలిసి కట్టుగా ప్రధాని మోదీని కలుద్దామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. కాగా తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటానని, ఈ బిల్లు కోసం లోక్సభలో పోరాటం చేయాలని కోరతానని వెల్లడించారు. ఈ బిల్లు కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం రావాలని కోరుతున్నామని, వివాదాలకు తావు లేకుండ బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ ఆనాడు హామీ ఇచ్చారు. మేం బాధ్యతలు చేపట్టగానే 4 ఫిబ్రవరి 2024 లో బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టాం. కులసర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ సమాజం బలహీన వర్గాలకు రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారని సందేశం ఈ సభ ద్వారా పంపించాలనుకున్నాం. ఇందుకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు గత ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ప్రతిపాదనను ఉపసంహరించుకుని కొత్త ప్రతిపాదన పంపిస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘4 ఫిబ్రవరిని సోషల్ జస్టిస్ డే గా సభ ద్వారా తీర్మానం చేశాం. అందరినీ సంప్రదించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఈ బిల్లును తీసుకొచ్చాం. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… బీసీ రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా. అఖిలపక్ష నాయకులు అందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుందాం. ఇందుకోసం ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ సభాపక్షనాయకుడిని కోరుతున్నా. రాహుల్ గాంధీని కూడా కలిసి పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరదాం’’ అని వివరించారు.
‘‘రాహుల్ గాంధీ సమయం తీసుకోవాల్సిందిగా మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యత అప్పగిస్తున్నా. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా.. కులసర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క వందశాతం సరైంది. బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు. కామారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని స్పష్టం చేశారు.