దసరాకు టీజీఎస్ఆర్టీసీ 6వేల ప్రత్యేక బస్సులు

టీజీఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు టీజీఎస్ఆర్టీసీ 6వేల ప్రత్యేక బస్సులు నడపనుంది.రద్దీని బట్టి అదనపు బస్సులు నడపనున్నారు.

Update: 2024-09-30 13:16 GMT

బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగ‌ల‌కు 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వివరించారు.


టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లు
అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున.. 9, 10, 11 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపుతామని సజ్జనార్ తెలిపారు. రద్దీ రోజుల్లో ఎన్‌హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

నగర శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల స‌మ‌యాభావం త‌గ్గించేందుకు హైద‌రాబాద్ శివారు ప్రాంతాల నుంచి ద‌స‌రాకు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్ల‌కు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ త‌దిత‌ర ప్రాంతాల నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌక‌ర్యార్థం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు త‌దిత‌ర ప్రాంతాల‌కు బ‌స్సుల‌ను నడిపేలా ప్లాన్ చేసింది.

రద్దీని బట్టి అదనపు బస్సులు
ద‌స‌రా పండుగకు ప్ర‌త్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌యాణికుల‌కు క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల‌పై త‌మ క్షేత్ర స్థాయి అధికారుల‌తో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వ‌ర్చ్‌వ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ప్రయాణికులను సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. గ‌త ద‌స‌రాతో పోల్చితే ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంద‌ని, గతంలో మాదిరిగానే ప్ర‌యాణికుల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉద్యోగులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశించారు. ర‌ద్దీని బ‌ట్టి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాలన్నారు.

ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
ముఖ్యంగా ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ దసరాకు కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కాలుష్యరహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించుకోవాలన్నారు.గత దసరాతో పోల్చితే ఈసారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లుతో పాటు అక్టోబ‌ర్ నెల‌లో 11 శుభ‌ముహుర్తాలు కూడా ఉన్నాయని, ఆ ర‌ద్దీకి త‌గ్గ‌ట్టు బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని సంస్థ ముందుగానే ప్లాన్ చేసింది.పోలీస్, ర‌వాణా, మున్సిపల్ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల‌కు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం త‌మ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాల‌ని వీసీ సజ్జనార్ కోరారు.

Tags:    

Similar News