వేణుస్వామి జాతకం ఇలా రివర్స్ అయ్యిందేంటి?

సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, రాజకీయాలపై వివాదాస్పద జోస్యం చెబుతూ నిత్యం నెట్టింట హల్చల్ చేస్తుంటారు వేణుస్వామి.

By :  Vanaja
Update: 2024-08-13 17:13 GMT

సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, రాజకీయాలపై వివాదాస్పద జోస్యం చెబుతూ నిత్యం నెట్టింట హల్చల్ చేస్తుంటారు వేణుస్వామి. యాదృచ్ఛికమో, నిజంగా ఆయన దూరదృష్టో తెలియదు కానీ ఆయన చెప్పినవి కొన్ని నిజమవడంతో సెలబ్రిటీ జ్యోతిష్యుడిని అనే ముద్రేసుకుని పదేళ్ళపాటు అన్ని రకాలుగా హవా సాగించాడనే చెప్పాలి. అలాంటి వేణుస్వామి జాతకం ఇప్పుడు రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. ఈమధ్య కాలంలో ఆయన చెప్పినవన్నీ బెడిసికొట్టాయి. ఆయన జోస్యం చెప్పినట్టు తెలంగాణలో కేసీఆర్ గెలవలేదు, ఏపీలో కూటమి ఓడిపోలేదు, ప్రభాస్ సినిమాలు ఫ్లాపులవ్వట్లేదు. దీంతో నెటిజన్లు వేణుస్వామిని నోరు మెదపకుండా చెడుగుడాడేసుకున్నారు. ఈ దెబ్బకి రాజకీయాలపైనా, సినిమా వాళ్ళపైన జోతిష్యం చెప్పను అని ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు.

కానీ, ఒకేఒక్క జాతకం చెప్తాను అని, టాలీవుడ్ లో నయా కపుల్ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో చెబుతూ వీడియో చేశాడు. అది కూడా అక్కినేని ఫ్యామిలీకి చెందిన జంటపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 8 న నాగచైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. అదే రోజు సాయంత్రం వీరిద్దరి భవిష్యత్తుపై జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. వీరిద్దరికి జాతకాలు కలవలేదని, శోభిత జాతకం అస్సలు బాగోలేదని, 2027 లో విడిపోతారని విశ్లేషణ చెప్పాడు.

ఈ క్రమంలో వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నాగ చైతన్య, శోభిత వ్యక్తిగత జీవితం గురించి జోతిష్యం పేరిట చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేశాయి. వీరి ఫిర్యాదు పై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. వేణు స్వామిని పిలిపించి వివరణ కోరుతామని వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈనెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని వేణు స్వామికి ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News