ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాలకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం
ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాలను డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో చేయాలని నిర్ణయించారు. టన్నెల్ పరిస్థితులపై అంచనాకు హెలికాప్టరుతో లిడార్ సర్వే చేయనున్నారు.;
By : Shaik Saleem
Update: 2025-05-28 02:01 GMT
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ లో పరిస్థితులను అంచనా వేసేందుకు లిడార్ (LiDAR) సర్వే చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీనికోసం డెన్మార్క్ దేశం నుంచి అద్దెకు హెలికాప్టరు(Denmark Helicopter) తీసుకున్నామని ఆయన చెప్పారు.(Lidar Survey) ఈ హెలికాప్టర్ను ఉపయోగించి ఎస్ ఎల్ బీసీ టన్నెల్44 కిలోమీటర్ల విస్తీర్ణంలో లిడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్)విద్యుదయస్కాంత సర్వే నిర్వహిస్తామని చెప్పారు. టన్నెల్ ప్రాజెక్ట్ను తాజా ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. టన్నెల్ పనులు తిరిగి ప్రారంభించి, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత హయాంలో పూర్తి చేస్తామని హామి ఇచ్చారు.
జాడలేని మృతదేహాలు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (SLBC Tunnel) కూలిపోయి మూడు నెలలు దాటింది. అయినా టన్నెల్ లోపల మృత్యువాత పడిన ఆరుగురి మృతదేహాలు ఇంకా వెలుగుచూడలేదు. టన్నెల్ పై భాగంలో ఫాల్ట్ జోన్ ఉందని నిపుణులు చెప్పినా టన్నెల్ నిర్మాణ పనులు చేపట్టిన జైప్రకాష్ అసోసియేట్స్ పట్టించుకోకుండా పనులు కొనసాగించింది. దీంతో ఈ ప్రమాదం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22 వతేదీన ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలి 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో (Drilling and Blasting) తవ్వకాలు చేపట్టాలని ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. టన్నెల్ ఇన్ లెట్ వైపు టన్నెల్ బోరింగ్ మెషీన్ తో తవ్వకాలు చేపట్టవద్దని కమిటీ సూచించింది. ఈ మేరకు సాంకేతిక కమిటీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
పర్యావరణ అనుమతితో పనులు చేపట్టండి
ఎస్ఎల్బీసీ టన్నెల్ అమ్రాబాద్ పులుల అభయారణ్యం గుండా పోతున్నందున దీని తవ్వకాల్లో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ అనుమతి తీసుకొని పనులు చేపట్టాలని సాంకేతిక కమిటీ సూచించింది.
నిపుణులతో భూ సాంకేతిక పరీక్షలు చేయించండి
టన్నెల్ ప్రమాదంలో 8 మంది మరణించగా, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకు పోయిన ఆరుగురి మృతదేహాలను వెలికితీసేందుకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రాక్ మెకానిక్స్ సహకారం తీసుకోవాలని కమిటీ సలహా ఇచ్చింది.టన్నెల్ కూలిన ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ జీ ఆర్ఐ నిపుణులతో సర్వే చేయించాలని కమిటీ కోరింది. జూన్ 30వతేదీలోగా టన్నెల్ లోపల భూ సాంకేతిక పరీక్షలు చేసి టన్నెల్ తవ్వకాలను బ్లాస్టింగ్ పద్ధతిలో చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
ప్రమాద ముప్పును పట్టించుకోలేదు...
ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాల్లో నిర్మాణ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ లోపాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్ కూలిన విషాదం, ఇతర ఖర్చులను జైప్రకాష్ అసోసియేట్స్ భరించాలని నీటిపారుదల శాఖ అధికారి ఒకరు చెప్పారు.టన్నెల్ లోపల సీస్మిక్ ప్రిడిక్షన్ నివేదిక, మునుపటి భూకంప సర్వేల్లో గుర్తించిన భౌగోళిక ప్రమాదాలను పరిష్కరించడంలో ఏజెన్సీ విఫలమైందని అధికారులు చెబుతున్నారు. టన్నెల్ లోపల భౌగోళిక హెచ్చరికలను విస్మరించడం వల్లే కూలిపోయిందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి వ్యాఖ్యానించారు.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పరిమితుల కారణంగా తగినంత ఉపరితల అన్వేషణ చేయకుండానే సొరంగం పనులు ప్రారంభించారు. టన్నెల్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకం పనులు ప్రారంభించాలని, ఈ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో జై ప్రకాష్ అసోసియేట్స్ ప్రణాళిక ఇవ్వాలని ఇంజినీర్ల సాంకేతిక కమిటీ కోరింది.