బాలికల రక్షణ కోసం సీతక్క యాక్షన్ ప్లాన్ ఇదే...

తెలంగాణ బాలికలకు సీతక్క 'స్నేహ' హస్తం;

Update: 2025-06-07 14:43 GMT

ఆకాశంలో సగం,అవకాశాలలో సమం అంటున్నా.. మహిళల, బాలికల భద్రత మాత్రం ప్రశ్నర్థకమౌతోంది. "ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువు అవుతోంది" మంత్రి సీతక్క. అనుభవాన్ని రంగరించి చెప్పారేమోగాని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమాజంలో వాస్తవ పరిస్థితి చక్కగా చెప్పారు. బాలికల రక్షణ విషయంలో పోక్సో లాంటి కఠిన చట్టాలు ఎన్ని వున్నా ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి.ప్రభుత్వాల పరంగా మహిళా, శిశు సంక్షేమం కోసం కార్యక్రమాలతో పాటు, ఆడపిల్లల, మహిళల భద్రత కోసం కార్యాచరణ చేపడుతున్నా, నేరాలను కట్టడి చేయడం అంత సులువు కావడంలేదు. ప్రభుత్వ కార్యాచరణపై ప్రజలలో మరింత గా అవగాహన పెంచాలి. బాలికలను అవమానించినా,లైంగిక వేధింపులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవన్న భావం ప్రతి ఒక్కరిలో రావాలి. అందుకే ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్దమవుతోంది.

బాలికల కోసం స్నేహ కమిటీలు-స్వీయ రక్షణ టీంలు

బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్వీయ రక్షణ టీంలుగా స్నేహ కమిటీ లు పనిచేస్తాయి. అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తామని తెలంగాణ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. .అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీం లను ఏర్పాటు చేస్తామన్నారు.మహిళలు ,బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామని తెలిపారు.. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని, అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని హె చ్చరించారు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

మహిళా శిశు సంక్షేమం పై హైదరాబాద్ లో జరిగిన మేదోమథన సదస్సు ముగింపు సందర్భంగా మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక సలహా కమిటీ నియమిస్తామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం పై ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసింది.. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

పుట్టిన బిడ్డల చెత్తకుప్పలపాలుకాకుండా ఊయలల ఏర్పాటు

అనాధలుగా పసిబిడ్డలు పుట్టిన వెంటనే చెత్త కుప్పల పాలవుతున్నారు. తెలంగాణ లోనూ ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. చాలా చోట్ల ముళ్ళ పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్న ఇలాంటి ఘటనలతో చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల ప్రాణాలు పోతుండటం తీవ్ర ఆవేదన కల్గిస్తోంది. అందుకే అలాంటి పసికందులను కాపాడుకునేందుకు వినూత్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పుట్టిన బిడ్డలను వద్దనుకునే వారు ఎక్కడో పారేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊ యలలో వదిలేస్తే వారి బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లైనా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట రూల్స్‌ను అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరమని, త్వరలో రూల్స్‌ను అడాప్ట్ చేసుకుంటామని సీతక్క తెలిపారు.

తెలంగాణ గణనీయంగా పోక్సో కేసులు ...

తెలంగాణలో పోక్సో కేసులు (POCSO cases) గణనీయంగా పెరిగాయి. 2024లో దాదాపు 449 కేసులు నమోదయ్యాయి, 2025లో ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది ఆగస్టు నుంచి దాదాపు 520 కేసులు నమోదయ్యాయి. చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరగడం వల్ల పోక్సో కేసులు పెరుగుతున్నాయి.

అయితే అశ్లీల చిత్రాలను చూడటం, షేర్ చేయడాన్ని నేరంగా పరిగణించి, ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

పోక్సో కేసులలో నిందితులు చాలామంది పిల్లలకు తెలిసినవారే ఉన్నారని, అందువల్ల పిల్లలను అప్రమత్తంగా ఉంచాలనే అవగాహన పెంపొందిస్తున్నారు.

తెలంగాణలో పోక్సో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసులపై న్యాయస్థానాల్లో చార్జిషీటులు ఫైల్ చేసి నిందితులకు శిక్షలు ఖారారు చేస్తున్నప్పటికీ.. ఫోక్సో కేసులపై అవగాహన లేకపోవడంతో పాటు చాలా మంది తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.

మహిళలకు రక్షణ ఏది? విపక్షాల విసుర్లు

కాంగ్రెస్‌ పాలన ఏడాదిలో 2000కు పైగా లైంగికదాడి ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. హోంశాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షణలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, షీ టీమ్స్‌, సఖీ, భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి రక్షణ కల్పించిందని గుర్తుచేశారు.

మహిళలపై వరుస నేరాలు, దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలకు భద్రత కరువైంది. ఇది ఆందోళన కలిగించే అంశం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాగర్‌కర్నూల్‌లోని ఓ దేవాలయంలో ఘటన, హైదరాబాద్‌లో జర్మనీ పర్యాటకురాలిపై జరిగిన అఘాయిత్యం వంటి సంఘటనలను ఉటంకించారు.

ఏదైనా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల ఘటనలు, గృహ హింస కేసులు, అడపిల్లలపై లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పోలీసులు కూడా ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టారు.గత ఏడాది అత్యాచార కేసులు 29 శాతం పెరిగాయని స్వయంగా డీజీపీ ప్రకటించారు.

Tags:    

Similar News