మాజీమంత్రి గీతా రెడ్డికి సద్భావన అవార్డు

రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి పాల్గొని మాజీమంత్రి గీతా రెడ్డికి సద్భావన అవార్డును ప్రదానం చేశారు.

Update: 2024-10-19 08:59 GMT

దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు.ప్రతీ ఏటా రాజీవ్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతా రెడ్డి గారిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమని సీఎం చెప్పారు.రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.


గాంధీ కుటుంబంతోనే పేదలకు మేలు
రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూశామని,కానీ 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డి అని సీఎం చెప్పారు.పేదలకు మేలు జరిగేది గాంధీ కుటుంబంతో మాత్రమేనని,గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదలకు మేలు జరిగిందని సీఎం గుర్తు చేశారు.‘‘ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.ప్రధాని పదవులను త్యాగం చేసిన ఘనత సోనియా, రాహుల్ ది. పదవులను ఇతరులకు ఇచ్చి దార్శకనికతను చూపిన గొప్ప వ్యక్తులు.గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న వారికి పోలికా?’’ అని రేవంత్ ప్రశ్నించారు.మత సమరస్యాన్ని కాపాడుతూ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.

ఆక్రమణదారుల పట్ల హైడ్రా అంకుశం
హైడ్రా ఆక్రమణలకు పాల్పడ్డ బడా బాబుల పట్ల భూతమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులను ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవంతులు కట్టిన వారిపట్ల హైడ్రా అంకుశం లాంటిదన్నారు. మదపుటేనుగులను అణచడానికి హైడ్రా అంకుశంలా పనిచేస్తుందన్నారు.కొందరు దీన్ని అడ్డుకోవాలని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ను దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ‘‘రాష్ట్ర ఆర్ధిక మూలలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు...రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దు... వారికి నేను హామీ ఇస్తున్నా..మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సీఎం పేర్కొన్నారు.

బిల్లా రంగాలు వచ్చి బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్నారు...
‘‘హైడ్రా ఆగదు అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు.హైడ్రా అనగానే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారు..పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు.మూసీలో మగ్గిపోతున్న వారికి ఇళ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించాం..మేం వారిని గుండెల్లో పెట్టుకుంటుంటే బీఆరెస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారు.బిల్లా రంగాలు వచ్చి బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్నారు.అక్కడికి ఇక్కడికి కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ కు పోదాం పద..బుల్కాపూర్ నాలాను ఆక్రమించుకుని కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టలేదా? ఫామ్ హౌస్ కు బుల్డోజర్ వస్తుందనే ఇక్కడ వాళ్ల డ్రామాలు ఆడుతున్నారు, హరీశ్.. నీలాంటి చెప్పులు మోసే వారు కాదు.. ఫామ్ హౌస్ లో పడుకున్న వాళ్లను రమ్మను నేను వస్తా..నీది ఒక స్థాయేనా..నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డ రోజులు మర్చిపోయావా? ఫామ్ హౌసులు కాపాడుకునేందుకే బిల్లా రంగాల దొంగ ఏడ్పులు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు.

ఫామ్ హౌస్ ల విషయంపై అఖిలపక్షం పిలుద్దాం
మూసీ పునరుజ్జీవనం వేరు... హైడ్రా వేరు..మూసీలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు.ట్రాఫిక్ సమస్య, నాళాల పునరుద్ధరణ, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికే హైడ్రా అని సీఎం చెప్పారు.‘‘వాళ్ల తాపత్రయం అంతా వాళ్ల ఆస్తులు కాపాడుకునేందుకు.అక్కడికి ఇక్కడికి కాదు...ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు రమ్మని సవాల్ చేశారా?వాళ్ల ఫామ్ హౌస్ ల వద్దకు ఎప్పుడు రావాలో హరీష్ చెప్పాలి.హరీశ్, కేటీఆర్ ఫామ్ హౌస్ ల విషయంపై అఖిలపక్షం పిలుద్దాం.. నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు నిగ్గు తేలుద్దాం..ఆ తరువాత మూసీ దగ్గరకా.. ఇంకెక్కడికైనానా వెళదాం’’ అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.

Tags:    

Similar News