నా ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి -రేవంత్

రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించా. ఆధారాలతో నేను చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాలి.

By :  Vanaja
Update: 2024-05-01 14:31 GMT

రిజర్వేషన్లను రద్దు చేయడమే RSS మూల సిద్ధాంతం., దీనిని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం కోరుట్ల జనజాతరలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కుట్రని సాక్ష్యాలతో నిరూపిస్తానన్నారు. సాయంత్రం ఐదు గంటలకు తన నివాసంలో మీడియా సమావేశంలో వివరిస్తానన్నారు. చెప్పినట్టుగానే జూబిలీహిల్స్ లోని ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కాపాడటానికి, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టడానికే తన హోదాను ఉపయోగిస్తానన్నారు. ఈ బాధ్యత, ఈ హోదా.. దళితులు, గిరిజనులు, ఓబీసీ, మైనారిటీలు ఇచ్చినవే అన్నారు. ముఖ్యమంత్రిగా దళిత, గిరిజన, బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్ధం కావడంలేదు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం ద్వారా తెలంగాణ సమాజాన్ని భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించా. ఆధారాలతో నేను చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాలి. లేకపోతే సవరించుకోవాలి ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించినట్లు.. నాపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. బీజేపీ ఒక ప్రణాళికబద్దంగా రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తోంది. ఈ విషయాన్ని నేను ప్రస్తావించానని నాపై కేసు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యున్ని చేస్తున్నారు.

నాపై ఫిర్యాదు చేసింది హోంశాఖనే. కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల పెట్టి..... ఆగమేఘాల మీద దేశ భద్రతకు ముప్పు వచ్చినట్లు.. దేశ స్వాతంత్ర్యానికి ముప్పు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ కేసుకు సంబంధం లేదని మా మహిళా అడ్వకేట్ పోలీస్ స్టేషన్ కు వెళితే దురుసుగా ప్రవర్తించారు. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు కాబట్టే... వాళ్లు ఢిల్లీ పోలీసులను ఎంచుకున్నారు. పోలీసులను ప్రయోగించి నాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారం చెయ్యకుండా చేసే కుట్ర జరుగుతోంది.

రిజర్వేషన్ల రద్దుకై ఎజెండాతో ముందుకెళ్తున్నారు..

ఆరెస్సెస్, బీజేపీ నేతలందరూ రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ఒక ఎజెండాతో ముందుకెళుతున్నారని రేవంత్ అన్నారు. "ఫిబ్రవరి22, 2000లో బీజేపీ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగాన్ని మార్చడానికి 10మంది సభ్యులతో కూడిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ నియమించారు. 2002 లో ఈ కమిషన్ నివేదిక ఇచ్చింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం తప్పింది. ఆరెస్సెస్ కు చెందిన గోలవార్కర్, ఎన్జీ వైద్య కూడా రిజర్వేషన్లు ఉండకూడదని పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం బీసీ జనగణన చేపట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు."

8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చి ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. రాజ్యాంగాన్ని మార్చడానికే తాము వచ్చామని 2017లో కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే స్టేట్మెంట్ ఇచ్చారు. రిజర్వేషన్లు అభివృద్ధిని తీసుకొస్తాయా అంటూ 2014-2019 మధ్య లోక్ సభ స్పీకర్ గా ఉన్న సుమిత్రా మహాజన్ మాట్లాడారు. దీనిపై మోదీ, అమిత్ షా దేశ ప్రజలకు ఏం చెబుతారు? దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు బీజేపీ కి వేసే ప్రతీ ఓటు... రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది. రిజర్వేషన్లు పెరగాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. రాజ్యాంగం మారాలంటే ఎన్డీఏ... రాజ్యాంగం మార్చకూడదు అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలో దేశంలోని దళిత, గిరిజన, ఓబీసీ, మైనార్టీలు నిర్ణయించుకోండి. మోదీ, అమిత్ షా లకు ఒకటే చెబుతున్నా... పోలీసులతో నన్ను బెదిరించాలని అనుకుంటే అది జరగని పని. అలా చేయాలనుకుంటే ఏం జరుగుతుందో మీ చీకటి మిత్రుడిని అడిగి తెలుసుకోండి. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సీఎం రేవంత్ బీజేపీని హెచ్చరించారు.

Tags:    

Similar News