కేంద్రమంత్రి సింధియాతో రేవంత్, భ‌ట్టి భేటీ

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

By :  Vanaja
Update: 2024-08-23 14:17 GMT

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ నేతలతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు అనుమతుల గురించి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కేంద్ర టెలికాం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి భేటీ అయ్యారు.

టీ-ఫైబర్ ప్రాజెక్టును భార‌త్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు స‌మ‌ర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాల‌ని విజ్ఞప్తి చేశారు. టీ – ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వ‌ర్క్ కల్పించాలని కోరారు. టీ-ఫైబర్ యొక్క ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ భేటీలో టీ-ఫైబర్‌ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వ‌ర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేయాలని వినతి అందించారు. టీ-ఫైబర్ కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం, డిప్యూటీ సీఎం కోరారు.

Tags:    

Similar News