ఈ పాయింట్లు కేసీయార్ కు చాలా కీలకమా ? వదలనంటున్న కమిషన్

ఈనెల 19వ తేదీనే కమిషన్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ విషయం ఇపుడే బయటపడింది. ఈ నేపధ్యంలోనే కేసీయార్ విషయంలో కొన్నిపాయింట్లు కీలకంగా మారాయి.

Update: 2024-06-26 04:50 GMT

విద్యుత్ రంగంలో అవినీతి ఆరోపణలపై విచారిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి పవర్ కమిషన్ కేసీయార్ ను వదిలేట్లు లేదు. ఈనెల 27వ తేదీన విచారణకు హాజరవ్వాలని కమిషన్ రెండోసారి కేసీయార్ కు నోటీసిచ్చింది. ఈనెల 19వ తేదీనే కమిషన్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ విషయం ఇపుడే బయటపడింది. ఈ నేపధ్యంలోనే కేసీయార్ విషయంలో కొన్నిపాయింట్లు కీలకంగా మారాయి.

అదేదో సినిమాలో ‘వదల బొమ్మాళి నిన్నొదల’ డైలాగున్నట్లుగా ఉంది పవర్ కమిషన్ వ్యవహారం. రెండోసారి విచారణకు హాజరుకావాలంటు కేసీయార్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసు జారీచేసింది. కేసీయార్ కు కమిషన్ నోటీసు జారీచేయటం రెండోసారి. మొదటిసారి నోటీసు జారీచేసినపుడు సమాధానం ఇవ్వటానికి, విచారణకు హాజరవ్వటానికి కేసీయార్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తిరస్కరించటమే కాకుండా కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డి వ్యక్తిగతంపైనే లేఖ రూపంలో దాడిచేశారు. కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. కమిషన్ ఛైర్మన్ తనపై కక్షసాధింపులకు దిగుతున్నట్లు భావించారు. తనను ఇబ్బందులు పెట్టాలని కమిషన్ ముందుగానే డిసైడ్ అయ్యిందనే అనుమానాలను కేసేయార్ వ్యక్తంచేశారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అసలు కమిషన్ ఏర్పాటే చట్టానికి వ్యతిరేకమన్నారు. ఛైర్మన్ గా నరసింహారెడ్డి పనికిరారని ఆక్షేపించారు. కమిషన్ ఛైర్మన్ గా తప్పుకోవాలని నరసింహారెడ్డిని కేసీయార్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఘాటుగా లేఖరాసిన కేసీయార్ మంగళవారమే కమిషన్ ఏర్పాటు, ఛైర్మన్ తొలగింపు లక్ష్యంతో హైకోర్టులో కేసు వేశారు. ఈనేపద్యంలోనే కమిషన్ నుండి కేసీయార్ కు రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరై చెప్పుకోవాల్సింది చెప్పుకోవచ్చని నోటీసులో కమిషన్ స్పష్టంచేసింది. తనపైన వినిపిస్తున్న ఆరోపణలకు విచారణకు హాజరై కమిషన్ సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టంగా ఉంది. నోటీసు అందిన వారంరోజుల్లోగా విచారణకు హాజరై తన వాదన వినిపించవచ్చని నోటీసులో కమిషన్ స్పష్టంచేసింది. కమిషన్ రెండోసారి నోటీసు ఇచ్చిన కారణంగానే కేసీయార్ హైకోర్టులో పిటీషన్ వేసినట్లు అర్ధమవుతోంది. ఎలాగైనా విచారణకు కేసీయార్ ను రప్పించి విచారించాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో కమిషన్నే రద్దుచేయించాలని కేసీయార్ కోర్టులో కేసు వేశారు.

ఈ నేపధ్యంలోనే కమిషన్-కేసీయార్ మధ్య టామ్ అండ్ జెర్రీ వ్యవహారం నడుస్తోంది. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం కమిషన్ విచారణకు కేసీయార్ హాజరవ్వాల్సిందే. హాజరుకానని తప్పించుకునేందుకు లేదు. కేసీయార్ను విచారించాలని కమిషన్ గట్టిగా అనుకుంటే అరెస్టుచేసైనా సరే విచారించే అధికారం కమిషన్ కు ఉంది. ఇక్కడ రెండు పాయింట్లు కీలకంగా ఉన్నాయి. మొదటి పాయింట్ ఏమిటంటే రెండో నోటీసును కూడా కేసీయార్ లెక్కచేయకుండా విచారణకు హాజరుకాకపోతే కమిషన్ ఏమిచేస్తుంది ? ఇక రెండో పాయింట్ ఏమిటంటే కేసీయార్ కేసుపై హైకోర్టు స్పందన ఏ విధంగా ఉంటుంది ? అని. కోర్టులో కేసువేసినా కమిషన్ పట్టించుకోకుండా మరోసారి నోటీసులిస్తే అప్పుడు కేసీయార్ ఏమిచేస్తారు ? వీటన్నింటి నేపధ్యంలో కేసీయార్ దాఖలుచేసిన పిటీషన్ విషయంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది.

ఆరోపణలను గమనిస్తే ఉన్నతాధికారులు, రిటైరైన ఉన్నతాధికారులు, విద్యుత్ రంగ నిపుణులు విచారణకు హాజరై కేసీయార్ వైఖరి వల్లే ప్రభుత్వానికి రు. 6 వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు. అందుకు తగిన సాక్ష్యాధానాలను కూడా అందించారు. ఛత్తీస్ ఘడ్ తో ఏ పరిస్ధితుల్లో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవాల్సొచ్చిందో తన లేఖలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు వివరించారు. అయితే లేఖలో కేసీయార్ చెప్పిందంతా అబద్ధాలే అని నిపుణులు ఖండించారు. రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన ధరలనే తాము ఒప్పందాలు చేసుకున్నట్లు కేసీయార్ వివరించారు. అయితే నిపుణులు, ఉన్నతాధికారులేమో అసలు రెగ్యులేటరీ కమిషన్ ధరలను నిర్ణయించనేలేదన్న విషయాన్ని బయటపెట్టారు. కేసీయారే తనిష్టంవచ్చిన ధరలను ఫిక్స్ చేశారంటు చాలామంది ఆరోపణలు చేశారు. విద్యుత్ కొనుగోలు చేసిన యూనిట్ ధరను రెగ్యులేటరీ అథారిటి నిర్ణయించలేదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

అలాగే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో కూడా భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. అసలు ప్లాంట్లు ఏర్పాటుచేసిన ప్రాంతాల వల్లే ప్రభుత్వానికి అధిక భారంపడిందని నిపుణలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ప్లాంట్లు తెలంగాణా ప్రభుత్వానికి గుదిబండలుగా మారటం ఖాయమంటున్నారు. ఉన్నతాధికారులు, నిపుణుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగానే కేసీయార్ ను విచారించాలని కమిషన్ గట్టిగా నిర్ణయించింది. అందుకనే రెండోసారి కూడా నోటీసులిచ్చింది. మరి కేసీయార్ ఏ విధంగా స్పందిస్తారు ? విచారణకు హాజరుకాకపోతే కమిషన్ ఏమిచేస్తుంది ? కోర్టు ఏమిచెబుతుందన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News