పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడే పులులను సంరక్షించాల్సిన అవసరాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గుర్తించి పులుల గణనను చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరగనున్న పులుల గణన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం పాల్గొననుంది. రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్, కొమురం భీం పులుల అభయారణ్యాల్లో ఉన్న పులుల సంఖ్యను గణించేందుకు తెలంగాణ అటవీశాఖ అధికారులు సమాయత్తం అయ్యారు. ఇందులో భాగంగా పులుల అభయారణ్యాల్లో కెమెరా ట్రాప్ లను మోహరించి పులుల కదలికలను ప్రత్యక్షంగా రికార్డు చేయనున్నారు. దీంతోపాటు పులులు మంచినీళ్లు తాగేందుకు అడవుల్లోని వాగులు, సరస్సుల చెంతకు వస్తుంటాయి. అక్కడ పులుల పగ్ మార్క్ లను సేకరించి వాటిని విశ్లేషించి ఎన్ని పులులున్నాయనేది లెక్క తేల్చనున్నారు.
అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల కెమెరా ట్రాప్ చిత్రాలు
పులుల గణన ఎప్పుడు చేపట్టారంటే...
జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, రాష్ట్ర అటవీ శాఖలు, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వాములతో ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి పులుల గణన చేపడుతుంటారు. ఈ గణనను 2005వ సంవత్సరంలో టైగర్ టాస్క్ ఫోర్స్ ఆమోదించింది. 2006, 2010,2014,2018 సంవత్సరాల్లో పులుల గణన చేశారు. 2006వ సంవత్సరంలో దేశంలో 1657 పులులున్నాయని లెక్క తేల్చారు. 2010వ సంవత్సరం జరిపిన పులుల గణనలో 1706 పులులున్నాయని వెల్లడైంది. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా 2018 పులుల గణన నివేదికను సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. పులుల ఆవాసాలు దెబ్బతినడం, అడవులు అంతరించి పోవడం, పులులకు కావాల్సిన ఆహారం లభ్యత తగ్గడం వల్ల పులుల సంఖ్య తగ్గడంతో కేంద్ర పర్యావరణ పరిరక్షణ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.దీంతో పులుల సంరక్షణ కోసం పులుల ఆవాస కారిడార్ లను ఏర్పాటు చేసి పులుల జనాభాను పెంచాలని నిర్ణయించారు.దేశంలో 26,838 ప్రదేశాలలో కెమెరా ట్రాప్లను అమర్చారు. ఈ కెమెరాల ఫలితంగా 34,858,623 వన్యప్రాణుల ఛాయాచిత్రాలు లభించాయి.
తెలంగాణలో 35 పులులు
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోనే 33 పులులున్నాయని గత గణనలో వెల్లడైంది. 26 పెద్ద పులులు, ఏడు కూనలు ఉన్నాయి. కవ్వాల్ రిజర్వు ఫారెస్ట్ లో రెండు పెద్దపులులున్నాయని తేలింది. అయితే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పులుల అభయారణ్యాల నుంచి కవ్వాల్ లోకి పులులు వలస వస్తున్నాయని వెల్లడైంది.అమ్రాబాద్లో 2022 అటవీశాఖ గణాంకాల ప్రకారం 20 పెద్దపులులు ఉండగా,ప్రస్తుతం వాటి సంఖ్య 33కి చేరాయి. కవ్వాల్ టైగర్ రిజర్వులో పులులు, మనుషుల మధ్య ఘర్షణ జరుగుతోంది.
అడవుల్లో నీటివనరుల లభ్యతపై సర్వే
తెలంగాణలో పులుల గణనే కాకుండా పులుల నివాసాలైన అభయారణ్యాల్లో నీటి వనరులు, ఆహారం లభ్యత, జింకలు, ఇతర జంతువులు ఎన్ని ఉన్నాయి? పులుల సంచారానికి మానవ ఆటంకాలు ఏమైనా ఎదురవుతున్నాయా అనేది కూడా అటవీ శాఖ అధికారులు ఆడిట్ చేయనున్నారు. తెలంగాణలో పులుల సంఖ్యను లెక్క తేల్చాక దీన్ని జాతీయ వన్యప్రాణుల సంస్థలు అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ తో డేటాను ప్రాసెస్ చేయనున్నారు.
పులుల గణన కోసం సన్నాహాలు
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) సమన్వయంతో జరగనున్న ఆల్-ఇండియా టైగర్ మానిటరింగ్ గణన కోసం తెలంగాణ అటవీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. 2025-26 వససంవత్సరంలో పులుల గణన కోసం ఫీల్డ్ వర్క్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభమై 2026 ప్రారంభంలో కొనసాగనుందని అటవీశాఖ వన్యప్రాణుల విభాగం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తెలంగాణలోని మూడు పులుల అభయారణ్యాల్లో ఏకకాలంలో చేపట్టనున్న ఈ సర్వేలో పులుల సంఖ్య, పులులు వేటాడే జంతువులు జింకలు, దుప్పులు, అడవి పందులు ఎన్ని ఉన్నాయనేది కూడా గణించనున్నట్లు ఆయన చెప్పారు. పులుల గణన చేపట్టేందుకు పది నెలల సమయం పడుతుందని ఆయన వివరించారు.
పులులు, చిరుతల జనాభానే కీలకం
తెలంగాణలో పులులు, చిరుతలు, సాంబార్, చిటల్, బ్లాక్బక్,నాలుగు కొమ్ముల జింకల సంఖ్యను లెక్కించినా ,నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలంగాణలోని పులులు,చిరుతపులుల గణాంకాలను మాత్రమే విడుదల చేయనుంది.అడవులను నరికి వేసి పోడు చేయడం వల్ల పులుల సంచార ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. పులులు, మనుషుల మధ్య సాగుతున్న సంఘర్షణ, అంతరించి పోతున్న అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ అంశాలు పులుల గణనలో వెలుగుచూడనున్నాయని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.